హైదరాబాద్: గ్రేహౌండ్స్ (Greyhounds) గురువు నారాయణసింగ్ భాటి (NS Bhati) మృతిపట్ల సీఎం కేసీఆర్ (CM KCR) సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేక గ్రేహౌండ్స్ దళాన్ని ఏర్పాటుచేసిన భాటి.. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు కృషిచేశారని చెప్పారు.
గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న నారాయణసింగ్ భాటి (94) మంగళవారం (జూన్ 13న) కన్నుమూశారు. సహస్త్ర సీమా బల్ (SSB) రిటైర్డ్ డీఐజీ అయిన భాటి పోలీసులను యుద్ధ నిపుణులుగా తీర్చి దిద్దారు. ఎస్ఎస్బీలో రిటైర్ అయిన తర్వాత ఎన్టీఆర్ హయాంలో అప్పటి ఐపీఎస్ అధికారి కేఎస్ వ్యాస్ అభ్యర్థన మేరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వచ్చి గ్రేహౌండ్స్ స్థాపనలో కీలక పాత్ర పోషించారు. పోలీసులకు గెరిల్లా యుద్ధ తంత్రాలు నేర్పారు. గ్రేహౌండ్స్ గురువుగా ఖ్యాతికెక్కిన భాటిని భారత ప్రభుత్వం పద్మశ్రీతో సత్కరించింది.