హైదరాబాద్, సెప్టెంబర్ 2 (నమస్తే తెలంగాణ): భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) శనివారం ‘ఆదిత్య ఎల్1’ ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించడం పట్ల ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు హర్షం వ్యక్తం చేశారు. అంతరిక్ష పరిశోధనా రంగంలో ఇస్రో మరో కీలక మైలురాయిని దాటిందని సీఎం కేసీఆర్ అన్నారు. అంతరిక్ష పరిశోధనా రంగంలో ప్రపంచానికి ఆదర్శంగా దేశ శాస్త్రవేత్తలు సాధిస్తున్న ప్రగతి, ప్రతి భారతీయుడినీ గర్వపడేలా చేసిందన్నారు. ఈ సందర్భంగా ఇస్రో చైర్మన్, శాస్త్రవేత్తలు, ఇతర సాంకేతిక సిబ్బందిని సీఎం కేసీఆర్ అభినందించారు. అదేవిధంగా.. ఇస్రో బృందానికి రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అభినందనలు తెలిపారు. ఆదిత్య ఎస్1 మిషన్ను విజయవంతంగా ప్రయోగించడంపై హర్షం వ్యక్తం చేశారు.