హైదరాబాద్: ఫ్లోరోసిస్ బాధితుడు స్వామి మృతిపట్ల సీఎం కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. ఫ్లోరోసిస్ సమస్య అనగానే స్వామి పేరు గుర్తుకొస్తుందన్నారు. తెలంగాణ ఉద్యమంలో స్వామి పోరాటం ఎందరికో స్ఫూర్తిగా నిలిచిందని వెల్లడించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలం శివన్నగూడెంలో ఫ్లోరోసిస్ బాధితుడు అంశాల స్వామి శనివారం ఉదయం మృతిచెందారు. మోటారు సైకిల్ పైనుంచి కిందపడి తలకు బలమైన గాయం కావడంతో మరణించారు. అంశాల స్వామికి మంత్రి కేటీఆర్ ఇల్లు కట్టించిన విషయం తెలిసిందే. మూడు నెలల క్రితం ఆయన ఇంటికెళ్లిన కేటీఆర్.. భోజనం చేశారు. స్వయంగా స్వామికి అన్నం ఒడ్డించారు. జీవనోపాధి కోసం ఆయనకు సెలూన్ కూడా ఏర్పాటు చేయించారు.