హైదరాబాద్, జూన్ 9 (నమస్తే తెలంగాణ): రక్తదానాన్ని ప్రోత్సహించటానికి ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు, క్యాంపులు నిర్వహించాలని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్రావు వైద్యాధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన తెలంగాణ వైద్య విధాన పరిషత్ దవాఖానల పనితీరుపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పేదలకు పూర్తి ఉచితంగా నాణ్యమైన వైద్యసేవలు అందించాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ ఈ ఏడాది రూ.12,364 కోట్ల హెల్త్ బడ్జెట్ కేటాయించారని చెప్పారు. కొత్త భవనాల నిర్మాణం, మరమ్మతులు, వైద్య సిబ్బంది నియామకం, అధునాతన వైద్య పరికరాల కొనుగోలు, మందుల కొరత లేకుండా చూడటం వంటి చర్యల ఫలితంగా ప్రభుత్వ దవాఖానలపై ప్రజల్లో విశ్వాసం ఎంతో పెరిగిందని వెల్లడించారు.
దాన్ని నిలబెట్టుకునేలా అందరం కలిసి కృషి చేద్దామని పిలుపునిచ్చారు. అన్ని స్థాయిల వైద్యసిబ్బంది రోగులతో ఆప్యాయంగా ఉండాలని సూచించారు. ప్రభుత్వ దవాఖానల్లో అందుబాటులోకి తెచ్చిన టిఫా స్కానింగ్ యంత్రాలు గర్భిణులకు వరంగా మారాయని పేర్కొన్నారు. ప్రైవేటులో రూ.2 వేల దాకా ఖర్చయ్యే స్కానింగ్ ఉచితంగా చేస్తున్నట్టు చెప్పారు. గత మూడు నెలల్లో 6,395 మందికి సానింగ్ చేశామని తెలిపారు. గత నెల సాధారణ ప్రసవాలు ఎకువ శాతం నమోదు చేసిన వికారాబాద్, జనగాం, ఖమ్మం జిల్లా దవాఖానలు, నాంపల్లి, పటాన్ చెరు, హుజూర్నగర్ ఏరియా దవాఖానలు, కల్వకుర్తి, షాద్నగర్ పీహెచ్సీల సిబ్బందిని అభింనందించారు. అనవసర సిజేరియన్లు తగ్గించేందుకు కృషి చేయాలన్నారు. ఈ సందర్భంగా పలు ఆదేశాలు జారీ చేశారు.