CM KCR | సంగారెడ్డి : గత ఎన్నికల్లో సంగారెడ్డి నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థిని ఓడగొట్టినా సంగారెడ్డి మీద అలగలేదు.. ఎందుకంటే సంగారెడ్డి నాది కదా.. ఇది నేను పుట్టిన జిల్లా కదా.. అని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. సంగారెడ్డి నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొని, చింతా ప్రభాకర్కు మద్దతుగా ప్రసంగించారు.
పోయినసారి సంగారెడ్డిలో మీరు చింతా ప్రభాకర్ను ఓడగొట్టారు. బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించలేదు. అయినా కూడా నేను సంగారెడ్డి మీద అలగలేదు. ఎందుకంటే సంగారెడ్డి నాది కదా.. ఇది నేను పుట్టిన జిల్లా కదా.. సంగారెడ్డిలో నేను తిరగని గల్లీ ఉన్నదా..? నాల్సాబ్ గడ్డ నుంచి మొదలుకుంటే ప్రతి గల్లీలో నేను పాదయాత్ర చేశాను. ప్రజల అవసరాలు తీర్చడానికి ఇక్కడ మొత్తం పాదయాత్ర చేశాను. మీ అందరికి తెలుసు ఆ విషయం. సాయంత్రం డుర్రుమని హైదరాబాద్ పోకపోయేది. ఇక్కడే గెస్ట్ హౌజ్లో ఉండి పొద్దున లేచి పాదయాత్రలు చేసేది. మీ మధ్యలోనే తిరిగేది.. అలా అనేక కార్యక్రమాలు చేశాను అని కేసీఆర్ గుర్తు చేశారు.
ఇవాళ ఒక పార్టీ మతం అంటడు. ఇంకో పార్టీనేమో ఇందిరమ్మ రాజ్యం అంటడు. మూడు గంటల కరెంట్ అంటడు. ధరణి తీసేస్తం అంటడు. ఒక పార్టీకి మతం పిచ్చి లేపుడు మంటలు పెట్టడం తప్ప ఏం తెల్వది. ఎంతసేపు మసీదులు తవ్వుదామా..? దర్గాలు తవ్వుదామా..? ఈ పని తప్ప ఇంకో పని రాదు ఆ పార్టీకి. ప్రజలను డివైడ్ చేస్తది. కాబట్టి జాగ్రత్త ఆలోచించి ఓటు వేయాలి. ఓటు మన తలరాతను మారుస్తది అని కేసీఆర్ పేర్కొన్నారు.
సంగమేశ్వర, బసవేశ్వర ప్రాజెక్టు పెట్టుకున్నాం. సింగూరు నిండు కుండలా బ్రహ్మాండంగా కాళేశ్వరంతో లింక్ చేస్తున్నాం. ఒకసారి అది లింక్ అయిపోయిందంటే, సంగమేశ్వర, బసవేశ్వర అయిపోతే సంగారెడ్డి, జహీరాబాద్, అందోల్, నారాయణ్ఖేడ్ అంతా సస్యశ్యామలం అయితది. బ్రహ్మాందంగా సాగు, మంచి నీళ్లు వస్తాయి. అందరికీ మంచి జరుగుతది అని కేసీఆర్ తెలిపారు.
చింతా ప్రభాకర్ సౌమ్యుడు, వినయమున్న వ్యక్తి. ఆయన ఎమ్మెల్యేగా లేకున్న కూడా కరోనా టైంలో వచ్చి ప్రజల మధ్యలో ఉన్నాడు. ఓడగొట్టారని నర్వస్ కాలేదు.. సంగారెడ్డి నియోజకవర్గంలోనే ఉన్నాడు. ప్రజలకు సేవ చేసుకుంటూ ఉన్నడు. కరోనా వచ్చినప్పుడు ఎవడూ దిక్కులేకపోతే ప్రభాకర్ వచ్చి మంచిచెడ్డలు చూసిండు. నియోజకవర్గం కోసం పనులు అడిగి చేయించుకున్నాడు. సంగారెడ్డిలో కూడా మెడికల్ కాలేజీతో పాటు 450 పడకల హాస్పిటల్ వస్తుంది. దాని నిర్మాణం జరుగుతోంది. సంగారెడ్డి నియోజకవర్గం సమగ్ర అభివృద్ధి జరగాలంటే ఇక్కడ బీఆర్ఎస్ గెలవాలి. చింత ప్రభాకర్ను గెలిపించాలి అని కేసీఆర్ కోరారు.