కేంద్రానికి రోగం వచ్చింది. దానికి చికిత్స చేయాల్సి ఉన్నది. దేశం నాశనమవుతుంటే, కావాలని విద్వేషాన్ని సృష్టిస్తుంటే దేశవాసులుగా ఆపాల్సిన బాధ్యత మనపై ఉన్నది. కూల్చివేతలు, పగలగొట్టడాలు చాలా సులువు. దేన్నయినా నిర్మించడం కష్టం. సిలికాన్ వ్యాలీగా పేరొందిన బెంగళూరులో విషాన్ని ఎలా వ్యాప్తి చేస్తున్నారో చూస్తున్నాం. కానీ, వాళ్లు ఎప్పుడూ విజయం సాధించలేరు. దేశ ప్రయోజనాల కోసం అందరూ నడుం బిగించాలి. తెలంగాణను ప్రగతి బాట ఎలా పట్టించామో.. అదే విధంగా దేశం వైపు దృష్టి సారిస్తాం.
– కేసీఆర్
హైదరాబాద్, ఏప్రిల్ 29 (నమస్తే తెలంగాణ): ‘ఎల్లప్పుడూ దుష్ట శక్తులు భూమిపై కనిపిస్తాయి. వాటి తమాషా కొన్నిరోజులే ఉంటుంది. కొంచెం ముందుకుపోయాక నిర్మాణాత్మక పాత్ర పోషించే శక్తులే విజయవంతమవుతాయి. మానవత్వం అంతం కాదు’ అని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రబోధించారు. విద్వేష కుట్రలపై సమాజంలోని ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పోరాడాలని పిలుపునిచ్చారు. రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎల్బీ స్టేడియంలో ఇఫ్తార్ విందును శుక్రవారం ఏర్పాటుచేశారు. షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి, మైనార్టీ సంక్షేమశాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్ అధ్యక్షతన కొనసాగిన కార్యక్రమానికి సీఎం కేసీఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలియచేసి సందేశాన్ని వినిపించారు.
ఎనిమిదేండ్ల కిందట తెలంగాణలో దుర్భర పరిస్థితులుండేవని, తాగేందుకు నీళ్లు, కరెంట్, రైతులకు సాగునీరు లేదని చెప్పారు. భగవంతుడి దయ, అందరి సహకారంతో ఏడున్నర ఏండ్లలో ఎంతో అభివృద్ధి సాధించామని ఆనందం వ్యక్తంచేశారు. యావత్ దేశం ఈ రోజు అంధకారంలో ఉంటే, తెలంగాణ రాష్ట్రం వెలిగిపోతున్నదని తెలిపారు. అన్ని రంగాల వినియోగదారులకు 24 గంటల నాణ్యమైన విద్యుత్ అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణే అని, ఇంకా చాలా చేయాల్సి ఉన్నదని చెప్పారు. తాగునీరు, సాగునీరు, పంటల సాగులో రాష్ట్రం అద్భుతప్రగతి సాధించిందని కొనియాడారు. తెలంగాణ తరహాలోనే యావత్ దేశంలో మైనార్టీ గురుకులాలను ఏర్పాటుచేయాలనే చర్చ కొనసాగడం రాష్ర్టానికి గర్వకారణమని వెల్లడించారు. ఏడున్నర ఏండ్లలో రాష్ట్రంలో ఎన్నోరంగాల్లో తెలంగాణ నిర్మాణాత్మక కృషిచేసి దేశానికే ఆదర్శంగా నిలిచిందని వెల్లడించారు.
విద్వేషాన్ని ఆపాల్సిన బాధ్యత మనదే
కేంద్రానికి రోగం వచ్చిందని, దానికి చికిత్స చేయాల్సి ఉందని సీఎం కేసీఆర్ ధ్వజమెత్తారు. తెలంగాణ కూడా దేశంలో భాగమని, దేశం బాగుంటే తెలంగాణ బాగుంటుందని వివరించారు. రాష్ట్ర తలసరి ఆదాయం రూ.1.24 లక్షల నుంచి రూ.2.78 లక్షలకు పెరిగిందని, జీఎస్డీపీ రూ.11.50 లక్షల కోట్లని, తెలంగాణ సాధించిన దాంట్లో, కేంద్రం సగం కూడా సాధించలేకపోయిందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం సరైన రీతిలో సహకరించి ఉంటే, తెలంగాణతో సమానంగా పనిచేసి ఉంటే రాష్ట్ర జీఎస్డీపీ రూ.14.5 లక్షల కోట్లు ఉండేదని వాపోయారు. కేంద్రం బలహీనంగా ఉంటే రాష్ట్రాలూ బలహీనమవుతాయని, కేంద్రంలో గడబిడ ఉంటే రాష్ట్రాల్లో కూడా గడబిడ మొదలవుతుందని వెల్లడించారు. దేశం నాశనమవుతుంటే, కావాలని దేశంలో విద్వేషాన్ని సృష్టిస్తుంటే దేశవాసులుగా దానిని ఆపాల్సిన బాధ్యత మనపై ఉన్నదని పిలుపునిచ్చారు. భగవంతుడు అందరికంటే శక్తివంతుడని, అన్నింటికీ సాక్షిగా ఉంటాడని తెలిపారు.
పనులు చెడగొట్టడానికి, అల్లర్లు చేయడానికి కొన్ని శక్తులు ప్రయత్నిస్తుంటాయని, కానీ వాళ్లు ఎప్పుడూ విజయం సాధించలేరని ప్రబోధించారు. కూల్చివేతలు, పగులగొట్టడాలు చాలా సులువని, దేన్నయినా నిర్మించడం కష్టమని వివరించారు. సిలికాన్ వ్యాలీగా పేరొందిన బెంగళూరులో విషాన్ని ఎలా వ్యాప్తి చేస్తున్నారో చూస్తున్నామని గుర్తుచేశారు. యావత్దేశంలో ఇలాంటివి జరుగుతున్నాయని.. ఇది మంచిది కాదని, ప్రజలు అర్థం చేసుకోవాలని సూచించారు. బుద్ధిజీవులు అర్థం చేసుకుంటున్నారని, మున్ముందు బయటకువస్తారని విశ్వాసం వ్యక్తంచేశారు. దేశ ప్రయోజనాలకోసం అందరూ నడుం బిగించాలని పిలుపునిచ్చారు. అందరి ప్రార్థనలతో ఏ విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించామో.. ప్రగతిబాట పట్టించామో.. అదేవిధంగా దేశంవైపు దృష్టిసారిస్తామని స్పష్టంచేశారు. అందులో అనుమానాలు అవసరం లేదని, ఈ దేశానికి ఉపయోగపడే విధంగా తెలంగాణకు మంచిస్థానం లభిస్తుందని నొక్కిచెప్పారు.
మతపెద్దలతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు
తొలుత సీఎం కేసీఆర్ మైనార్టీ గురుకుల ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్కు చెందిన మెరిట్ విద్యార్థులకు, పేదలకు రంజాన్ కానుకలను అందజేశారు. అనంతరం వేదికపై మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, రాజ్యసభ సభ్యులు కే కేశవరావు, సంతోష్కుమార్, మంత్రులు మహమూద్ అలీ, కొప్పుల ఈశ్వర్, తలసాని శ్రీనివాస్యాదవ్, సత్యవతి రాథోడ్, మల్లారెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, ముస్లిం మతపెద్దలతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఎంఐఎం నేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీకి స్వయంగా పండ్లు తినిపించారు. కార్యక్రమంలో మైనార్టీ వ్యవహారాల ప్రభుత్వ సలహాదారు ఏకే ఖాన్, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఇంతియాజ్, మైనార్టీ సంక్షేమశాఖ ప్రభుత్వ కార్యదర్శి అహ్మద్ నదీమ్, డైరెక్టర్ షానవాజ్ ఖాసీం, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్కుమార్, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఎండీ కాంతి వెస్లీ, వక్ఫ్బోర్డు మాజీ చైర్మన్ మహ్మద్ సలీం, కార్పొరేటర్ బాబా ఫసీయొద్దీన్, హైదరాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, పోలీసు అధికారులు రంగనాథ్, రమేశ్చంద్ర, ప్రకాష్రెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ఇరాన్, టర్కీ అతిథులు కూడా హాజరయ్యారు.