CM KCR | రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వడగండ్ల వానకు పంటలు దెబ్బతిన్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఆదివారం అత్యవసర సమీక్ష నిర్వహించారు. క్షేత్రస్థాయిలో పంట నష్టాన్ని పరిశీలించి, రైతులకు భరోసా కల్పించాలని మంత్రులను ఆదేశించారు.
అకాల వర్షాల కారణంగా రాష్ట్రంలో దెబ్బతిన్న పంట నష్టాన్ని అంచనా వేసేందుకు తక్షణమే చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని ఆదేశించారు. జిల్లాల కలెక్టర్లతో మాట్లాడి నివేదికలు తెప్పించాలని సూచించారు. ఇప్పటికే గత నెలలో కురిసిన అకాల వర్షాలకు 26 జిల్లాల్లో 1.51 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని నిర్ధారించిన ప్రభుత్వం ఆయా రైతులకు ఎకరాకు రూ.10 వేల చొప్పున ఆర్థికసాయం కోసం రూ.151 కోట్లు విడుదల చేసింది.
నమస్తే తెలంగాణ నెట్వర్క్/ హైదరాబాద్, ఏప్రిల్ 23 (నమస్తే తెలంగాణ): ఉమ్మడి కరీంనగర్, వరంగల్, నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో శని, ఆదివారాల్లో వడగండ్ల వానలు బీభత్సం సృష్టించాయి. ముఖ్యంగా వరి, మక్కజొన్న, మామిడి తోటల రైతులు తీవ్రంగా నష్టపోయారు. జనగామ జిల్లాలో సుమారు 20,320 ఎకరాల్లో వరి, 1,232 ఎకరాల్లో మామిడి తోటలు దెబ్బతిన్నట్టు వ్యవసాయశాఖ అధికారులు పేర్కొన్నారు. బచ్చన్నపేట, జనగామ, రఘునాథపల్లి మండలాల్లో ఎక్కువగా వరి పంటకు నష్టం వాటిల్లింది. మహబూబాబాద్ జిల్లా మరిపెడ, నెల్లికుదురు, నర్సింహులపేట, చిన్నగూడూరు మండలాల్లో పంటలు ఎక్కువగా దెబ్బతిన్నాయి. కురవి మండలంలో మామిడి కాయలు నేలరాలాయి. కేసముద్రం మార్కెట్లో రైతులు ఆరబోసుకున్న మక్కజొన్న తడిసి ముద్దయింది.
వరంగల్ జిల్లా నర్సంపేట మండలంలో వరి, మిర్చి తోటలు, మామిడికాయలు నేలవాలాయి. కల్లాల్లోని మిర్చి తడిసిపోయింది. గురిజాలలోని అరటి తోటలకు నష్టం వాటిల్లింది. చెన్నారావుపేట, ఖానాపురం, గీసుగొండ మండలాల్లో పంటలు దెబ్బతిన్నాయి. హనుమకొండ జిల్లా ఆత్మకూరు, దామెర, శాయంపేట, నడికూడ, ఎల్కతుర్తి, భీమదేవరపల్లి, కమలాపూర్, ధర్మసాగర్, వేలేరు మండలాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా ఆదివారం ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వర్షం కురిసింది. ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలంలో వడగండ్ల ధాటికి పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.
ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని పలు మండలాల్లో వడగండ్ల ధాటికి చేతికొచ్చిన వరిపంట నేల వాలింది. మామిడి కాయలు రాలిపోయాయి. కొనుగోలు కేంద్రాలు, మార్కెట్లకు తరలించిన ధాన్యం తడిసిముద్దయింది. కోదాడ, మోటకొండూరు, భూదాన్పోచంపల్లి, తుంగతుర్తి, నాగారం, మోత్కూరు, అడ్డగూడూరు, గుండాల, మేళ్లచెర్వు, నడిగూడెం, మోతె, కేతేపల్లి, చివ్వెంల తదితర మండలాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షాలకు పంటలు దెబ్బతిన్నాయి. ఖమ్మం జిల్లాలోని మధిర, వైరా నియోజకవర్గాల్లో మక్క పంట నేలవాలింది. పంట చేతికొచ్చే సమయంలో అకాల వర్షాలు పడటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. చింతకాని, ఖమ్మం రూరల్, కూసుమంచి, తిరుమలయపాలెం తదితర మండలాల్లో పంటలు దెబ్బతిన్నాయి.
మంత్రులు కొప్పుల, గంగుల భరోసా
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వడగండ్ల వానకు పంట నష్టపోయిన వ్యవసాయ క్షేత్రాలను మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్ ఆదివారం పరిశీలించారు. అధైర్య పడవద్దని, ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు అండగా ఉంటారని భరోసా ఇచ్చారు. జగిత్యాల రూరల్ మండలంలో యాళ్ల భాస్కర్రెడ్డి, యాళ్ల భరత్రెడ్డి, కొప్పెర పవన్రెడ్డికి చెందిన మామిడి తోటలు, పన్నాల రాజవ్వకు చెందిన నువ్వుల పంటను మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్, జడ్పీ చైర్పర్సన్ దావ వసంత పరిశీలించారు. అనంతరం మంత్రి కొప్పుల మీడియాతో మాట్లాడుతూ.. ఈదురు గాలులు, అకాల వర్షాలతో జగిత్యాల జిల్లాలో మామిడి, నువ్వులు, జామ, ఇతర పంటలు దెబ్బ తిన్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. జిల్లాలో దాదాపు 31 వేల ఎకరాల్లో మామిడి పంటకు నష్టం వాటిల్లిందని, 80 శాతం మామిడి తోటలు దెబ్బతిన్నాయని వివరించారు. జిల్లా ఉద్యానవనశాఖ, వ్యవసాయశాఖ అధికారులు రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా పంట నష్టం సర్వే చేయాలని సూచించారు.
కాలికి గాయమైనా రైతుల చెంతకు గంగుల
మంత్రి గంగుల కమలాకర్ కాలికి గాయమైనా లెక్క చేయకుండా హ్యాండ్స్టిక్తో వెళ్లి వడగండ్ల వానతో దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. కరీంనగర్ మండలం చామనపల్లి, బహ్దుర్ఖాన్పేట, తాహెర్ కొండాపూర్, చెర్లభూత్కూర్, ఫకీర్పేట, జూబ్లీనగర్ గ్రామాల్లో రాళ్లవానతో దెబ్బతిన పంటలను పరిశీలించారు. అధికారుల ప్రాథమిక అంచనా ప్రకారం కరీంనగర్ మండలంలోని ఆరు గ్రామాల్లో దాదాపు 3,144 ఎకరాలు పంట నష్టం జరిగిందని మంత్రి గంగుల చెప్పారు.
మంత్రి ఎర్రబెల్లి సమీక్ష
జనగామ జిల్లాలో పంట నష్టంపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, కలెక్టర్ సీహెచ్ శివలింగయ్య, అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్తో కలిసి అత్యవసరంగా సమీక్ష నిర్వహించారు. జరిగిన పంట నష్టం వివరా లను, అంచనాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ.. పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని చెప్పారు. రైతులు ధైర్యంగా ఉండాలని, అధైర్యపడొద్దని విజ్ఞప్తి చేశారు. అనంతరం జనగామ మండలం పెద్దపహాడ్లో దెబ్బతిన్న పంటలను మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, జిల్లా కలెక్టర్ సీహెచ్ శివలింగయ్య పరిశీలించారు. బచ్చన్నపేట మండలం తమ్మడపల్లి, బచ్చన్నపేట, ఆలీంపూర్, గంగాపూర్, నాగిరెడ్డిపల్లి, కొన్నె, లింగంపల్లి, పడమటి కేశ్వాపూర్, మన్సాన్పల్లి గ్రామాల్లో వడగళ్లకు పాడైన పంటలను, మామిడి తోటలను ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి పరిశీలించారు.
మూడు రోజులు వర్షాలు
దక్షిణ ఛత్తీస్గఢ్ నుంచి విదర్భ, తెలంగాణ, కర్ణాటక మీదుగా తమిళనాడు వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఆవరించి ఉన్న ఉపరితల ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో మూడు రోజులు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నదని తెలిపింది. రాష్ట్రంలో అనేక చోట్ల ఐదు రోజులు పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల కన్నా తక్కువగా నమోదవుతాయని చెప్పింది. సోమవారం మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, నాగర్కర్నూల్, వనపర్తి జిల్లాల్లో గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశమున్నదని వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీంతో మూడు రోజులు ఆయా జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది.