హైదరాబాద్, జూలై 2 (నమస్తే తెలంగాణ): ప్రధాని నరేంద్రమోదీ అసంబద్ధ విధానాలు, తప్పుడు నిర్ణయాలతో అంతర్జాతీయంగా భారతదేశం పరువు పోతున్నదని సీఎం కేసీఆర్ విమర్శించారు. శనివారం రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు మద్దతుగా జలవిహార్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం మాట్లాడారు. కేసీఆర్ ప్రసంగం ఆయన మాటల్లోనే..
మీ చెడు నిర్ణయాలు, తప్పుడు విధానాల వల్ల దేశ మర్యాద పోతున్నది. ప్రజల జీవన ప్రమాణాలు పడిపోతున్నాయి. ప్రజల్లో ఆక్రోశం పెరిగిపోతున్నది. ఒ క్కొక్కరి ఖాతాలో రూ.15 లక్షలు వేస్తామన్నారు. 15 పైసలు కూడా రాలేదు. డబ్బు ఎప్పుడు వేస్తారా అని ప్రజలు ఎదురుచూస్తూనే ఉన్నారు. రూ.15 లక్షలు పడేదాకా ఓట్లు వేస్తూనే ఉంటామని అనుకుంటున్నారా? మీరు ఇచ్చిన హామీల్లో ఒక్కటైనా నెరవేర్చారా? హైదరాబాద్లో మీరు నిర్వహించబోయే బహిరంగ సభలో నా ప్రశ్నలకు సమాధానం చెప్పాలి.
మన్మోహన్ హయాంలో రూపాయి విలువ పడిపోతున్నదంటూ మీరు లొల్లిలొల్లి చేశారు. మరి మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత.. ఇప్పుడు డాలర్ మారకం విలువ రూ.79. దేశ చరిత్రలో ఏ ప్రధాని హయాంలోనూ ఇలా జరుగలేదు. ఇది మీకు గొప్పగా అనిపిస్తున్నదా? ఇది మీ పాలన ఎంత గొప్పదో చెప్తున్నది. ‘నేపాల్ రూపాయి పడిపోతలేదు. బంగ్లాదేశ్ విలువ తగట్లేదు. భారతదేశ రూపాయి మాత్రమే ఎందుకు పడిపోతున్నది? నాకు తెలియాలి’ అంటూ గతంలో మీరు ప్రశ్నించారు. ఇప్పుడు నేను అడుగుతున్నా.. మన రూపాయి ఎందుకు పడిపోతున్నది? దేశం తెలుసుకోవాలకొంటున్నది. మీరు నిర్దోషులైతే.. మీ బహిరంగ సభలో ప్రజలకు వివరణ ఇవ్వండి.
మోదీ హయాంలో మకాన్ లేదు.. దుకాన్ లేదు.. పైసలు లేవు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు అన్నారు. ఒక్కటి కూడా ఇవ్వలేదు. పైగా ప్రైవేటీకరణ అంటూ ప్రభుత్వ సంస్థలను అమ్మేస్తున్నారు. ఆ సంస్థలను నమ్ముకున్న కుటుంబాలను రోడ్లమీద పడేస్తున్నారు. కొత్త ఉద్యోగాలు ఇవ్వకపోగా ఉన్నవాటిని కూడా తీసేస్తున్నారు. మోదీ.. మీ హయాంలో ఒక్కటైనా గొప్పపని చేశారా? ఆత్మవిమర్శ చేసుకోండి. మీ ప్రతి నిర్ణయం.. ప్రతి పాలసీ దేశానికి నష్టాన్ని కలిగిస్తున్నది.
గంగలో గతంలో అస్తికలే కలిపేవారు. వేల శవాలను గంగానదిలో తేల్చిన ఘనత మోదీదే. కరోనా కట్టడిలో ప్రధాని పూర్తిగా విఫలమయ్యారు. లక్షల ప్రాణాలు బలిగొన్నారు. రాత్రికి రాత్రే లాక్డౌన్ విధించడంతో స్వాతంత్య్రం తర్వాత దేశం అతిపెద్ద సంక్షోభాన్ని ఎదుర్కొన్నది. కోట్లమంది రోడ్డున పడ్డారు. కరోనా సమయంలో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించినప్పుడు నేను వలస కార్మికుల కోసం తాత్కాలికంగా రైళ్లను నడుపాలని కోరాను. ఎట్టిపరిస్థితుల్లోనూ ఉచితంగా రవాణా కల్పించబోమని మోదీ చెప్పారు. దేశ ప్రజల పట్ల మోదీ ప్రేమ ఇలా ఉంటుంది. బీహార్, బెంగాల్, యూపీకి చెందిన లక్షల మంది తెలంగాణలో పనిచేస్తున్నారు. ‘మోదీ ఇవ్వకపోయినా మీకు అండగా మేమున్నాం’ అని నేను వారికి భరోసా ఇచ్చాను. తెలంగాణ అభివృద్ధిలో వలస కార్మికుల శ్రమ కూడా ఉన్నది. అందుకే వారిని తెలంగాణ అభివృద్ధి ప్రతినిధులుగా భావించాం. ఉచితంగా నిత్యావసరాలు ఇచ్చాం. 178 రైళ్లలో సొంతూళ్లకు వెళ్లేలా చూశాం. ఆహారం, మంచినీరు, దారి ఖర్చులకు వెయ్యి ఇచ్చి గౌరవంగా పంపించాం. ప్రజల పట్ల మా నిబద్ధత ఇది.
మోదీ హయాంలో అంతర్జాతీయ సూచీల్లో భారత్ దిగజారిపోతున్నది. మానవాభివృద్ధిలో గతంలో 80వ స్థానంలో ఉంటే, మోదీ హయాంలో 131కి పడిపోయాం. హంగర్ ఇండెక్స్లో 63 నుంచి 101కి దిగజారాం. ఇండివిజువల్/ఫండమెంటల్ రైట్స్లో 85వ స్థానంలో ఉన్న దేశాన్ని మోదీ 119వ స్థానానికి తీసుకెళ్లారు. ప్రెస్ ఫ్రీడంలో 131 నుంచి 142కు పడిపోయాం. సంతోష సూచీలో 111 ర్యాంకు ఉంటే 136కు దిగజారింది. ఎన్విరాన్మెంట్ ఇండెక్స్లో 140 దేశాలకు ర్యాంకులిస్తే.. మనం అట్టడుగున. మోదీ రాకముందు 5.6% నిరుద్యోగిత ఉంటే.. ఇప్పుడు మోదీ గొప్ప పాలన వల్ల రికార్డు స్థాయిలో 8.1 శాతానికి పెరిగింది. ఇక దేశంలో గోదీ మీడియాను సృష్టించిన ఘనత కూడా మీదే. ఇదీ మన దేశం దుస్థితి. ఇదీ మీ పాలన. మోదీ పాలనలో జాతీయంగా, అంతర్జాతీయంగా దేశం పరువు పోతున్నది.