Congress | హైదరాబాద్, నవంబర్ 22 (నమస్తే తెలంగాణ): ‘సీఎం కేసీఆర్ గజ్వేల్ ప్రాంత రైతుల నుంచి వేల ఎకరాలను గుంజుకున్నడు. హైదరాబాద్ నగరం చుట్టూ 10 వేల ఎకరాలను ఆక్రమించుకున్నడు. గజ్వేల్లో సీఎం కేసీఆర్, ఆయన సుట్టపోళ్లు మొత్తం ఊడ్చేశారు. పేదల భూములను కబ్జా చేశారు. ఇప్పుడు కామారెడ్డిలో రూ.2 వేల కోట్ల భూములు గుంజుకునేందుకు కుట్ర చేస్తున్నారు’ – పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి చేస్తున్న విష ప్రచారం ఇది.
కొందరు దొంగలు ఒక బ్యాంకులో దొంగతనం చేయాలని ప్లాన్ చేశారు. కానీ.. దానికి 24 గంటలు ఒక కుక్క కాపలాగా ఉన్నది. అది ఉండగా బ్యాంకులోకి కాలు పెట్టడం సాధ్యం కాదని వారికి అర్థమైంది. దాని అడ్డు తొలగించుకోవడానికి ఓ పన్నాగం పన్నారు. అది పిచ్చికుక్క అనే ప్రచారం మొదలుపెట్టారు. ఆ కాలనీవాసులు దొంగల మాటలు నమ్మి ఆ కుక్కను కాలనీ నుంచి తరిమి కొట్టారు. మరునాడే బ్యాంకులో దొంగలు పడి మొత్తం సంపదను దోచుకుపోయారు. కాలనీవాసులు దాచుకున్న సొమ్ము మొత్తం దొంగలపాలైంది.
ఇప్పుడు ధరణి పోర్టల్ విషయంలో కాంగ్రెస్ అనుసరిస్తున్న విధానం ఇలాగే ఉన్నది. కుట్రపూరితంగా పోర్టల్పై పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తున్నది. నిజానికి రాష్ట్రంలోని రూ.లక్షల కోట్ల విలువైన భూములపై కాంగ్రెస్ నేతలు కన్నేశారు. ధరణి పోర్టల్ ఉండగా భూములను గుంజుకోవడం సాధ్యం కాదని వారికి తెలుసు. అందుకే ‘ఒక కుక్కను చంపే ముందు దానిపై పిచ్చిదనే ముద్ర వేయాలి’ అనే నానుడిని అనుసరిస్తూ ధరణిపై రెండు రకాల దుష్ప్రచారాలు చేస్తున్నారు. వీటిలో ఒకటి ధరణి పోర్టల్ మంచిది కాదని చెప్పడం. రెండోది బీఆర్ఎస్ నాయకులు భూములను ఆక్రమించారని ప్రచారం చేయడం. ఈ విషప్రచారంలో భాగంగానే సీఎం కేసీఆర్ భూములను గుంజుకున్నారంటూ పదే పదే చెప్తూ.. చెప్పిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఒకవేళ అధికారంలోకి రాగానే ధరణిని ఎత్తివేసినా ప్రజలు అడ్డుకోకుండా ముందస్తుగా దానిపై విషబీజాలు నాటే ప్రయత్నం చేస్తున్నారు.
ధరణిపై కాంగ్రెస్ నేతల దుష్ప్రచారానికి స్పష్టమైన కారణం ఉన్నది. గతంలో రాష్ట్రంలో జరుగుతున్న నేరాల్లో 60% భూమి చుట్టూనే ఉండేవి. పొలం పనులు చేసుకోవాల్సిన రైతులు.. గొడవలు, కొట్లాటలు, పంచాయితీలు, కోర్టు కేసులు అంటూ తిరిగేవారు. పట్టాల కోసం ఆఫీసుల చుట్టూ తిరుగుతూ లంచాలు ముట్టజెప్పేవారు. ఈ దుర్మార్గాలను నిలువరించే విధంగా, రైతుల భూములు కాపాడేవిధంగా పక్కా వ్యవస్థను రూపొందించాలని సీఎం కేసీఆర్ సంకల్పించారు. ముందుగా రికార్డుల ప్రక్షాళన చేపట్టారు. రాష్ట్రవ్యాప్తంగా 2.55 కోట్ల ఎకరాల భూ రికార్డులను అధికారులు పరిశీలించి, ప్రతి ఖాతాలోని భూముల వివరాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. రైతుల సమక్షంలోనే తుది జాబితాను ప్రదర్శించారు. అభ్యంతరాలు స్వీకరించి, పరిష్కరించారు. ఆ తర్వాతే భూము ల సమగ్ర వివరాలను డిజిటలైజ్ చేశారు. ఆ వివరాలతోనే ధరణి పోర్టల్ రూపుదిద్దుకున్నది. ఈ పోర్టల్లో ఉన్న నిబంధనల ప్రకారం ఇతరుల భూములను బలవంతంగా గుంజుకోవడం అసాధ్యం. ధరణిలో రెండే రకాల భూములు ఉన్నాయి. మొదటగా.. ప్రభుత్వ భూములన్నీ ‘నిషేధిత’ జాబితాలో ఉన్నాయి. వాటిని ఆక్రమించి, పట్టాలు చేసుకోవడం అసాధ్యం. రెండోది.. రైతుల భూములు. వీటి హక్కులు మారాలంటే.. అమ్మేవారు, కొనేవారి ఆధార్ వివరాలు, వేలిముద్రలు, ఐరిస్ లేకుండా సాధ్యం కాదు. అంటే ఇద్దరూ కలిసి సాక్షులను తీసుకొని తహసీల్దార్ కార్యాలయానికి వచ్చి రిజిస్ట్రేషన్ చేయాలి. అప్పుడే హక్కులు మారుతాయి. దీనిని బట్టే ప్రతిపక్షాల విమర్శల్లో ఏమాత్రం పస లేదని అర్థమవతున్నది.
కాంగ్రెస్ పార్టీ ధరణిపై, సీఎం కేసీఆర్పై, బీఆర్ఎస్పై చేస్తున్న ఆరోపణల వెనుక అసలు కుట్ర వేరే ఉన్నదన్నది బీఆర్ఎస్ నేతల మాట. రాష్ట్రంలో కాంగ్రెస్ను అధికారంలోకి తెచ్చేందుకు బెంగళూరు నుంచి అడ్డగోలుగా డబ్బులు పంపుతున్నారనే ఆరోపణలున్నాయి. అధికారంలోకి రాగానే ఆ ముఠాకు తిరిగి వడ్డీతో సహా ముట్టజెప్పాల్సి ఉంటుంది. పైగా ఇతర రాష్ర్టాల్లో ఎన్నికల కోసం, సార్వత్రిక ఎన్నికల కోసం ఢిల్లీకి డబ్బులు పంపాల్సి ఉంటుంది. రాష్ట్రంలో ప్రస్తుతం అమలవుతున్న పారదర్శక వ్యవస్థలతో ఇంత మొత్తంలో సంపాదించడం అసాధ్యం. గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు నేతల ప్రధాన సంపాదన మార్గాలు.. పథకాల్లో వాటాలు, భూముల ఆక్రమణలు, సెటిల్మెంట్లు. రూ.200 పెన్షన్లో కూడా కమీషన్ తీసుకున్న కాలం అది. తెలంగాణ వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ మొదలు అన్ని రకాల పథకాలను డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ (డీబీటీ) పద్ధతిలో నిర్వహిస్తున్నది. ప్రతి పైసా నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలోనే పడుతున్నాయి. దీంతో ఆయా పథకాల్లో తమకు వాటా వచ్చే పరిస్థితి లేదు. ధరణితో భూముల ఆక్రమణలకు, సెటిల్మెంట్లకు చెక్ పడింది. ఈ నేపథ్యంలో డీబీటీని ఎత్తివేయడం సాధ్యం కాదు. ఇక మిగిలింది భూములు. ప్రస్తుతం పెరిగిన ధరలతో అత్యంత వేగంగా సంపాదించగలిగే మార్గం కూడా భూములే. అయితే వారి దోపిడీకి, భూదందాలకు ధరణి అడ్డంకిగా తయారైంది. అందుకే.. ధరణిని పెద్ద భూతంగా చూపెట్టాలని ప్రయత్నిస్తున్నారు. చిన్నచిన్న సమస్యలను భూతద్దంలో చూపెట్టి భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. విష ప్రచారం చేస్తున్నారు. తాము అధికారంలోకి వస్తే దానిని ఎత్తేస్తామంటూ ఊదరగొడుతున్నారు. ఒకవేళ పొరపాటున కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ధరణి పోర్టల్ను తీసేసినా ప్రజల్లో వ్యతిరేకత రాకుండా చూసుకునేందుకు ఇప్పటినుంచే దానిపై విషప్రచారాలు మొదలుపెట్టారు. అప్పుడు మళ్లీ రాత పద్ధతి, పాత వ్యవస్థను తీసుకొచ్చి ఇష్టారాజ్యంగా భూములను ఆక్రమించవచ్చని కాంగ్రెస్ నేతల పన్నాగం. ఆ దుర్బుద్ధిలో భాగమే ధరణిపై అసత్య ఆరోపణలు. సీఎం కేసీఆర్ అమాయకుల భూములను ఆక్రమించారంటూ దుష్ప్రచారం.
అన్నదాతల సమస్యలను తరిమికొట్టడమే కాకుండా మళ్లీ ఆనాటి కష్ట, నష్టాల బారిన పడకుండా ధరణి పోర్టల్ కాపాడుతున్నది. ఈ సౌలభ్యాన్ని రైతుల నుంచి దూరం చేయాలన్నది కాంగ్రెస్ కుతంత్రం. పైరవీకారులను పక్కనబెట్టిన పోర్టల్ను పీకేయాలని కాంగ్రెస్ తహతహలాడుతున్నది.
ఒకవేళ కాంగ్రెస్ నాయకులు చెప్పినట్టుగా ధరణిని తీసేస్తే.. రైతు తన ఉనికిని కోల్పోతాడు. పాత, రాత రికార్డులు ముందుకొస్తాయి. మళ్లీ వీఆర్వో, ఇతర అధికార వ్యవస్థ వస్తుంది. ఒకే భూమికి రిజిస్ట్రేషన్ పత్రాల్లో ఒకరు, రెవెన్యూ రికార్డుల్లో మరొకరు, డబుల్, ట్రిపుల్ రిజిస్ట్రేషన్లతో మరో ఇద్దరు, ముగ్గురు యజమానులు వస్తారు. అసలు రైతు ఎవరో ఎవరికీ తెలియదు. పంట వేసిన ప్రతిసారీ ‘సార్.. నేనే నిజమైన రైతును. సర్టిఫికెట్ ఇవ్వండి’ అని అధికారుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. తాము అధికారంలోకి వస్తే రైతు భరోసా కింద ఎకరానికి రూ.15 వేలు ఇస్తామని చెప్తున్నారు. మరి ఆ డబ్బులు ఎవరికి ఇస్తారు? రిజిస్ట్రేషన్ పేపర్లు ఉన్నవాళ్లకా? రెవెన్యూ రికార్డుల్లోని పాత యజమానులకా? డబుల్ రిజిస్ట్రేషన్ చేసిన దొంగలకా? ట్రిపుల్ రిజిస్ట్రేషన్లు చేసుకన్న అక్రమార్కులకా? అనే ప్రశ్నకు సమాధానం లేదు. రైతుబంధు అందుకుంటున్నవారిలో 91% మంది సన్న, చిన్నకారు రైతులే. రైతుబంధు ఆగిపోతే వందకు 91 మంది రైతుల బతుకులు ఆగమైపోతాయి.
ఒకప్పుడు రాష్ట్రంలో ఎరువుల పంపిణీ అధ్వానంగా ఉండేది. అర్థరాత్రి నుంచే లైన్లలో నిలబడటం, ఎర్రటి ఎండలో ఎదురు చూపులు, చెప్పులు, పుస్తకాలు లైన్లలో ఉంచడం, ఎరువులను పోలీస్స్టేషన్లలో ఉంచడం, లాఠీచార్జీలు.. ఆ రోజులు తలుచుకుంటేనే ఒళ్లు జలదరిస్తుంది. రాష్ట్రంలో రైతులు ఎంతమంది? ఎంత విస్తీర్ణం? ఏయే పంటలు వేస్తున్నారు? వంటి కచ్చితమైన వివరాలేమీ ప్రభుత్వం దగ్గర లేకపోవడం వల్లే ఈ దుస్థితి. ఇక పంట అమ్ముకోవాలంటే బీట్ల వరకు పరిగెత్తాల్సిందే. రోజులపాటు ధాన్యం కుప్పల మీద గడపాల్సిందే. ఇప్పుడు, ధరణి పోర్టల్తో రైతుల వివరాలన్ని కచ్చితంగా ఉండటం, ఏఈవోలు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుండటంతో ఎరువుల లెక్కలు ఖచ్చితంగా ఉన్నాయి. దీంతో ప్రభుత్వం ముందస్తుగానే స్టాక్ పెడుతున్నది. ఎరువుల పంపిణీ ప్రశాంతంగా సాగుతున్నది. పంట కొనుగోళ్ల ప్రక్రియ సులభతరం అయ్యింది. ధరణిని ఎత్తేస్తే.. మళ్లీ రైతులు పాస్పుస్తకాలు, చెప్పులు లైన్లో ఉంచి పడిగాపులు కాయాల్సి వస్తుంది.
గతంలో రైతులు ఎవరైనా ఇతర రాష్ర్టాలకు వలస వెళ్లినా, విదేశాలకు వెళ్లినా.. భూములు వెంటనే అన్యాక్రాంతం అయ్యేవి. దొంగపత్రాలు సృష్టించి వాటిని కబ్జా చేసేవారు. వలస వెళ్లే రైతు కుటుంబాలు వృద్ధులనో, పిల్లలనో ఊళ్లలో ఉంచడానికి గల కారణాల్లో ఇది కూడా ఒకటి. విదేశాలకు వెళ్లాలనుకునే రైతుల పిల్లలైతే భూములు తమ పేర్ల మీద ఉంచుకోవడానికే ఇష్టపడేవారు కాదు. ఊళ్లల్లో భూములున్న ఎన్నారైలు పూటకో గండంగా గడిపేవారు. ఎప్పుడైనా సొంతూరుకు వస్తే సగం రోజులు భూ పంచాయితీలకే సరిపోయేది. ఏండ్లు గడిచినా అవి తెగకపోవడంతో దక్కిందే ప్రాప్తం అన్నట్టుగా అగ్గువకో, సగ్గువకో అమ్ముకొని వెళ్లిపోయేవారు. ధరణి పోర్టల్ వచ్చిన తర్వాత ఆ దుస్థితికి చెక్ పడింది. ఎన్నారైల కోసం ప్రత్యేకంగా పోర్టల్ అందుబాటులోకి వచ్చింది. పాస్పోర్ట్ నంబర్ లేదా వారు స్థిరపడిన దేశంలో ఇచ్చే పౌరసత్వ గుర్తింపు సంఖ్య ఆధారంగా భూముల వివరాలను ధరణిలో నమోదయ్యాయి. ఇప్పుడు ప్రపంచంలో ఏ మూలన ఉన్నా భూ యజమానులు నిబ్బరంగా ఉంటున్నారు. వారికి తెలియకుండా ఆ భూమి క్రయవిక్రయాలు జరిపే అవకాశమే లేకపోవడంతో గుండెమీద చేయి వేసుకొని నిద్రపోతున్నారు. అవసర సమయంలో భూములను అమ్మేందుకు ప్రత్యేకంగా జీపీఏ చేసే అవకాశం కూడా ఉండటంతో భరోసా వచ్చింది. ఒకవేళ ధరణి పోర్టల్ ఎత్తివేస్తే.. రూ.కోట్ల విలువైన భూమిని గాలికి వదిలేసి రైతుల పిల్లలు ఎవరైనా ఉద్యోగ, ఉపాధి నిమిత్తం ఇతర రాష్ర్టాలకో, విదేశాలకో వెళ్లగలుగుతారా? ఒకవేళ వెళ్లినా దళారులు, కబ్జాకోరుల నుంచి భూమిని కాపాడుకోగలరా? వారితో పోరాడి తిరిగి సాధించుకోగలరా? అనేది ఆలోచించాలి.
ప్రస్తుత పరిస్థితుల్లో ఒకరి భూమిని బలవంతంగా గుంజుకోవడం సాధ్యమేనా? తెలంగాణలో గుంట భూమి కోసం తలకాయలు పగలగొట్టుకున్న సందర్భాలున్నాయి. భూమిపై ఇక్కడి ప్రజలకు ఉన్న ప్రేమ అలాంటిది. ప్రస్తుతం పెరిగిన ధరలతో పోల్చుకుంటే.. ఎవరైనా భూములను గుంజుకుంటే చూస్తూ ఊరుకుంటారా? కాంగ్రెస్ ఆరోపణలు నిజమైతే అలాంటి ఘటనలు ఏమైనా జరిగాయా? చిన్నచిన్న విషయాలనే సోషల్మీడియాలో వైరల్ చేస్తున్న ఈరోజుల్లో ఎవరైనా భూమిని గుంజుకుంటే ఆ విషయం బయటికి రాకుండా ఆపగలగడం సాధ్యమా? మరి సీఎం కేసీఆర్గానీ, ఆయన బంధువులుగానీ తమ భూములను బలవంతంగా గుంజుకున్నారని సోషల్ మీడియాలో ఎన్నడైనా ప్రచారం జరిగిందా? ఆడియోనో, వీడియోనో బయటికి వచ్చిందా? ఒకవేళ ఎవరైనా భూములను బలవంతంగా గుంజుకున్నా.. వాటిపై హక్కులు రావడం సులభం కాదు. ధరణి నిబంధనల ప్రకారం అమ్మే వ్యక్తి, కొనే వ్యక్తి స్వయంగా తహసీల్దార్ కార్యాలయానికి రావాల్సి ఉంటుంది. అక్కడ ఆధార్ వివరాలతోపాటు ఇద్దరి వేలిముద్రలు, ఐరిస్ వంటివి నమోదు చేయాల్సి ఉంటుంది. కాళేళ్వరం నిర్మాణంలో భాగంగా ప్రభుత్వం అధికారికంగా నోటిఫికేషన్లు, నోటీసులు ఇచ్చి, చట్టప్రకారం పరిహారం చెల్లించి భూ సేకరణ చేపడితేనే కోర్టుల్లో వందల కేసులు పడ్డాయి. ధర్నాలు, రాస్తారోకోలు జరిగాయి. మరి.. సీఎం కేసీఆర్గానీ, ఆయన బంధువులుగానీ వేలాది ఎకరాలను ఆక్రమిస్తే ఈ లెక్కన ఎన్నికేసులు పడాలి? ఎన్నెన్ని రాస్తారోకోలు, ధర్నాలు జరగాలి? అలాంటి ఘటనలు ఏమైనా నమోదయ్యాయా?
ఉమ్మడి రాష్ట్రంలో భూరికార్డుల నిర్వహణ పూర్తిగా రాత పద్ధతిలో ఉండేది. ఆ రోజుల్లో కాంగ్రెస్ నేతలదే ఇష్టారాజ్యం. చోటా, మోటా లీడర్ల నుంచి రాష్ట్ర స్థాయి నేతల వరకు భూదందాలు సాగించేవారు. పెద్ద నేతలు తమ పరపతిని ఉపయోగించి భూరికార్డుల్లో రైతుల పేర్లను రాత్రికి రాత్రే మార్చేసేవారు. ఎకరాలకు ఎకరాల భూములను తమ పేర్లమీదికి బదలాయించుకునేవారు. ప్రభుత్వ భూములను స్వాహా చేసేవారు. అటవీభూములను గుటకాహస్వాహా అనేవారు. ఇలా వందల ఎకరాలను కబలించేవారు. ఒక్క రాష్ట్ర స్థాయి నేతలే కాదు.. మండల, జిల్లా స్థాయి నేతలదీ అదే తీరు. అదే దోపిడీ. గ్రామస్థాయిలోని నేతలు, గల్లీ లీడర్లు అధికారులతో కుమ్మక్కయ్యి.. కావాలనే రైతుల భూముల పేర్లను మార్చేవారు. రికార్డుల్లో తమ పేర్లు మారిన విషయాన్ని రైతులు గుర్తించగానే మళ్లీ ఆ నేతలే పైరవీకారుల అవతారం ఎత్తేవారు. భూమిని మళ్లీ తమ పేరు మీదికి మార్పిస్తామంటూ నమ్మబలికి ‘సెటిల్మెంట్లు’ చేసేవారు. ఆ భూమిలో కొంత వాటా తీసుకొని మిగిలింది తిరిగి పట్టా చేయించేవారు. లేదంటే రైతుల నుంచి వేలకు వేలు డబ్బులు వసూలు చేసేవారు. ఇలా ప్రతి గ్రామంలో కనీసం ఐదారుగురు కాంగ్రెస్ నేతలు, పైరవీకారులుగా చెలామణీ అయ్యేవారు.
ఇప్పుడు ధరణితో రైతుల వివరాలన్నీ ఒకేచోటికి చేరాయి. రకరకాల చేతి రాత పుక్తకాలతో పనిలేదు. అన్ని వివరాలు ఆన్లైన్లోకి ఎక్కాయి. ఎవరైనా, ఎప్పుడైనా, ఎక్కడి నుంచైనా తమ రికార్డులను ఆన్లైన్లోనే చెక్ చేసుకోవచ్చు. భూములు అమ్మినా, కొనుగోలు చేసినా రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ వెంటనే పూర్తవుతున్నాయి. పట్టాతోపాటు హక్కు మార్పిడి వెనువెంటనే జరిగిపోతున్నాయి. ఒక్కసారి లావాదేవీ పూర్తయితే ఇక ఆ రికార్డులను ఇష్టారాజ్యంగా మార్చడం అసాధ్యం. దీంతో ప్రభుత్వాలకు రైతులను గుర్తించడం చాలా సులభం అయ్యింది. అందుకే సీఎం కేసీఆర్ వెంటనే రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలను ప్రవేశపెట్టారు. పండించిన పంటను ముందస్తుగా అంచనా వేసి ప్రభుత్వం గ్రామాల్లోనే కొనుగోలు కేంద్రాలు తెరిచి ప్రతి గింజను కొనుగోలు చేస్తున్నది.
ప్రస్తుతం ధరణి వివరాల ఆధారంగా ప్రభుత్వం రైతుబీమా అమలు చేస్తున్నది. ఆన్లైన్ రికార్డు ప్రభుత్వంతోపాటు అటు ఎల్ఐసీకి దగ్గర కూడా ఉన్నది. ఒకవేళ దురదృష్టవశాత్తు ఎవరైనా రైతు మరణిస్తే.. వ్యవసాయ శాఖ అధికారికి చెప్పి, డెత్ సర్టిఫికెట్, నామినీ వివరాలు సమర్పిస్తే చాలు.. బీమా చెల్లింపు ప్రక్రియ మొదలైపోతుంది. కంపెనీ నుంచి నేరుగా నామినీ ఖాతాలో బీమా మొత్తం జమ అవుతుంది. ఇలా ఇప్పటివరకు 1,00,782 మంది రైతుల కుటుంబాలకు రూ.5,039 కోట్లు ఆర్థిక సాయం అందింది. ఇందులో ఎక్కడా దళారీలు, పైరవీకారుల ప్రమేయం లేదు. ధరణి పోర్టల్ను తీసేస్తే.. సరైన రికార్డు లేదు కాబట్టి బీమా ఇవ్వడానికి ఇన్స్యూరెన్స్ కంపెనీలు ముందుకు రావు. గతంలో మాదిరిగా ఆపద్బందు వంటి రాబంధు పథకం అమలు చేయాలి. అప్పుడు అధికారులందరికీ లంచాలిస్తూ, ఆరు నెలలపాటు ఆఫీసుల చుట్టూ చెప్పులరిగేలా తిరిగితే పదో పరకో చేతికి అందుతుంది. ఒకవేళ ఏదైనా బీమా కంపెనీ ముందుకొచ్చినా.. మరణించింది రైతే అని సర్టిఫికెట్ తీసుకోవడమే పెద్ద తతంగం. పంచాయితీ నుంచో, మున్సిపాలిటీ నుంచో డెత్ సర్టిఫికెట్ తీసుకోవాలి. దానికి ‘చనిపోయిన వ్యక్తి రైతు’ అని ధ్రువీకరించే పత్రాలు రెవెన్యూ, వ్యవసాయ శాఖల నుంచి తేవాలి. ఇందుకోసం ఓ పైరవీకారుడిని పట్టుకోవాలి. ఆ పత్రాలు జోడించి బీమా కోసం దరఖాస్తు చేసుకోవాలి. ఇన్స్యూరెన్స్ కంపెనీ నుంచి ప్రతినిధి వచ్చి వెరిఫికేషన్ చేయాలి. వాళ్లు వచ్చి మరణించిన వ్యక్తి నిజంగా రైతేనా? వారికి వ్యవసాయ భూమి ఉన్నదా? బీమా పరిహారం తీసుకోవడానికి అర్హులేనా? అని పరిశీలించాలి. వారు సేకరించిన వివరాలను పై అధికారి సర్టిఫై చేయాలి. ఆ తర్వాతే బీమా సాయం అందుతుంది. ఈ క్రమంలో డెత్ సర్టిఫికెట్, ఇరత సర్టిఫికెట్ల కోసం అధికారులకు, ఇన్స్యూరెన్స్ ఏజెంట్లకు, చెక్కు వచ్చిన తర్వాత ప్రజాప్రతినిధులకు.. ఇలా అన్ని దశల్లోనూ లంచాలు ఇవ్వాల్సిన దుస్థితి. చివరికి సగం కన్నా ఎక్కువ సొమ్ము లంచాలకే పోతుంది.