హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ తన ఢిల్లీ పర్యటనను ముగించుకుని.. ఆదివారం మధ్యాహ్నం హైదరాబాద్కు చేరుకున్నారు. ఈ నెల 25న ఢిల్లీ పర్యటనకు కేసీఆర్ వెళ్లిన సంగతి తెలిసిందే. ఢిల్లీ పర్యటనలో భాగంగా సీఎం కేసీఆర్ ఆయా పార్టీల రాజకీయ నాయకులతో సమావేశమయ్యారు. శుక్రవారం మధ్యాహ్నం ఢిల్లీ సీఎం కేసీఆర్తో సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ సమావేశమయ్యారు. ఈ భేటీ కేసీఆర్ నివాసంలో జరిగింది.
కేంద్రంలోని మోదీ సర్కారు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ఇద్దరు నేతలు విస్తృతంగా చర్చించినట్టు తెలిసింది. జీఎస్టీ పెంపు, ద్రవ్యోల్బణం, రూపాయి విలువ పతనం, పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలను పెంచి సామాన్యుడి బతుకును దుర్భరం చేస్తున్న మోదీ దిగిపోవాల్సిందేనని సీఎం కేసీఆర్ ఇటీవల హెచ్చరించిన సందర్భాన్ని అఖిలేశ్ ప్రత్యేకంగా ప్రస్తావించినట్టు సమాచారం.