హైదరాబాద్: దేశ వైద్యరంగంలో తెలంగాణ వేదికగా ఇవాళ సరికొత్త రికార్డు నమోదు కాబోతున్నది. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు చేతుల మీదుగా ఒకే రోజు తొమ్మిది ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో తరగతులు ప్రారంభం కానున్నాయి. కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, జయశంకర్ భూపాలపల్లి, కుమ్రంభీం ఆసిఫాబాద్, నిర్మల్, రాజన్న సిరిసిల్ల, వికారాబాద్, జనగాం జిల్లాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీల్లో తరగతులను సీఎం వర్చువల్గా ప్రారంభించనున్నారు.
ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం పండుగ వాతావరణంలో నిర్వహించనున్నది. ఈ మేరకు ఆయా జిల్లా కేంద్రాల్లో జరిగే కార్యక్రమాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొననున్నారు. కనీసం 15-20 వేల మందితో జిల్లా కేంద్రాల్లో భారీ ర్యాలీలు తీయనున్నారు. ఇందులో పెద్దఎత్తున యువతను, విద్యార్థులను భాగస్వాములు చేయనున్నారు. మెడికల్ కాలేజీ ఏర్పాటుతో విద్యార్థులకే కాకుండా దానికి అనుబంధంగా అందుబాటులోకి వచ్చే దవాఖానతో ప్రజలకు కూడా మేలు జరుగనుంది. కామారెడ్డిలో జరిగే కార్యక్రమంలో వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు పాల్గొననున్నట్టు సమాచారం.