హైదరాబాద్ : దేశ రాజకీయాలతో పాటు అన్ని అంశాలపై అవగాహన ఉన్న ప్రశాంత్ కిశోర్తో కలిసి పని చేస్తే తప్పేంటని ముఖ్యమంత్రి కేసీఆర్ మీడియాను ప్రశ్నించారు. టీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం ముగిసిన అనంతరం కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రశాంత్ కిశోర్ టీఆర్ఎస్ ఎన్నికల కోసం పని చేస్తున్నాడా అని ఓ మీడియా ప్రతినిధి కేసీఆర్ను ప్రశ్నించగా ఆయన సమాధానం ఇచ్చారు.
కిశోర్ తమతో కలిసి పని చేస్తుండు.. అది తప్పా.. ఆయన ఏమైనా రహస్యమా. ప్రశాంత్ కిశోర్ తనతో కలిసి పని చేస్తడు. దేశం గురించి ఆలోచన చేసినప్పుడు తెలంగాణ అంతర్భాగమే కదా? గత 8 ఏండ్ల నుంచి కిశోర్ తనకు మంచి స్నేహితుడు. ఆయన పైసల కోసం పని చేయడు. దేశం కోసం ఆయన చిత్తశుద్ధితో పని చేస్తున్నాడు. ఆయన పైసల కోసం పని చేస్తున్నట్లు మీ దగ్గర రిపోర్టు ఉందా? బీజేపీకి, జగన్కు, మమతకు పని చేసిండు. 12 రాష్ట్రాలతో పాటు దేశానికి పని చేసిండు.. దేశ రాజకీయాల మీద అవగాహన ఉంది కాబట్టి.. జాతీయ రాజకీయాలను ప్రభావితం చేయడానికి కిశోర్ను నేనే పిలిచాను. బ్రహ్మాండంగా పని చేస్తున్నాం. 100 శాతం ఆయన చిత్తశుద్దితో పని చేస్తున్నారు. ఆయన ఎన్నో దేశాల్లో పని చేశారని కేసీఆర్ గుర్తు చేశారు.