CM KCR | ఎన్నికలంటే ఆగం కావొద్దు.. ఆలోచించి ఓటేయాలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రజలకు పిలుపునిచ్చారు. అశ్వారావుపేట నియోజకవర్గం దమ్మపేటలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘మనకు స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు గడుస్తుంది. చాలా ముందుకు దూసుకుపోతున్న దేశాల్లో ప్రజాస్వామ్య పరిణితి వచ్చింది. మన దేశంలో ఇంకా కూడా రావాల్సినటువంటి పరిణి ఇంకా రాలేదు. ఎన్నికలు చాలా వస్తుంటయ్ పోతుంటాయ్. మీరు ఎన్నికల్లో చాలాసార్లు పాల్గొన్నారు. నేను మిమ్మల్ని ఒకటే కోరుతన్నా. ఎన్నికలు వచ్చాయంటే ఆగం కావొద్దు. నినాదంగా మంచీ చెడు ఆలోచించాలి. ఎన్నికలు వచ్చాయంటే పార్టీకి కొరు నిలబడుతరు. బీఆర్ఎస్ నుంచి నాగేశ్వర్రావు నిలబడ్డారు. కాంగ్రెస్, బీజేపీ నుంచి వేరేవాళ్లు నిలబడతారు. అన్నింటి కన్నా ముఖ్యంగా అభ్యర్థుల వెనుక పార్టీలు ఉన్నయ్. ఆ పార్టీల చరిత్ర, నడవడిక, ఆ పార్టీలకు అధికారం ఇస్తే ఏం ఆలోచిస్తారు.. బీదసాదల గురించి ఆ పార్టీల దృక్పథం ఏంటీ? ఆలోచన సరళి ఏంటీ అనే విషయం గ్రామాల్లో, పట్టణాల్లో చర్చ జరగాలి’ అన్నారు.
‘ఆ చర్చల్లో తేల్చినంక మాత్రమే ఓటు వేసే పరిస్థితి వస్తే.. ఎన్నికల్లో నాయకులు గెల్వడం కాదు. ప్రజలు గెలవడం అనేది ప్రారంభవుతుంది. ప్రజలు గెలిస్తే మంచి సత్ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాల్లో ఎన్నికలు వస్తే మనదగ్గరంత హడావుడి వుండదు. ఇంత పెద్ద సభలు కూడా జరుగవ్. టీవీ సందేశాలు, పాలసీ మెసేజ్ల ద్వారా జరుగుతుంటయ్. మన దేశంలో ఇంకా అలా లేదు. ఎన్నికలు వచ్చాయంటే అబద్ధాలు, అబండాలు, అలవిగానుటువంటి వాగ్ధాలు, అవి నెరవేర్చకపోవడాలు, ప్రజల్లో అసంతృప్తి చూస్తున్నారు. ఇదంతా పోవాలంటే నేను కోరుకున్న ప్రజాస్వామ్య పరిణితి రావాలి. మీ గ్రామాలు, బస్తీలకు వెళ్లిన తర్వాత గ్రామస్తులతో కలిసి నాలుగు అంశాలపై చర్చ జరిపి.. నిర్ణయం తీసుకొని ఓటు వేయాలి. తెలంగాణ రాష్ట్రంలో ఇది మూడోసారి జరుగుతున్నటువంటి ఎన్నిక. మీ అందరికీ తెలుసు తెలంగాణ రాష్ట్రం సాధించుకునేందుకు ఎంత పోరాటం చేయాల్సి వచ్చిందో.. ఎన్ని ఇబ్బందులుపడ్డమో మీ కండ్ల ముందు జరిగిన చరిత్ర’ అంటూ గుర్తు చేశారు.
‘తెలంగాణ రాష్ట్రం మనకే ఉండే.. దాన్ని బలవంతంగా తీసుకెళ్లి ఆంధ్రాలో తెలంగాణ ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా. హైదరాబాద్ స్టేట్ అలాగే ఉంటే.. ఈ పాటికి మన ప్రాజెక్టులు కంప్లీట్ అయి.. చాలా ధనిక రాష్ట్రంగా మనం ఉండేవాళ్లం. మన దరిద్రమంతా తీరిపోయేది. సమైక్య రాష్ట్రంలో కలవడం వల్ల వాళ్ల దృక్పథం ఎంత సేపు అవువైపు ఉండే తప్ప మన వైపు లేకుండే. అందువల్లనే బాధలు అనుభవించాం. కాంగ్రెస్ ఇవాళ మాట్లాడుతున్నది. అందుకే నేను పార్టీల చరిత్ర చూడాలన్నది. అసలు ఉన్న తెలంగాణను ఊడగొట్టి.. ఆంధ్రాలో కలిపిన పార్టీ ఏది? కాంగ్రెస్సే కదా.. ఎన్ని సార్లు ఉద్యమాలు వచ్చినా అణచివేసింది ఎవరు ? 1969లో ఉద్యమం వస్తే 400 మందిని కాల్చి చంపారు. మనం ఉద్యమం స్టార్ట్ చేసిన తర్వాత 2004లో మనతో పొత్తు పెట్టుకున్నారు. పొత్తు ప్రకారం న్యాయబద్ధంగా వ్యవహరిస్తే 2004, 2006లోనే తెలంగాణ ఇవ్వాల్సింది. కానీ, మోసం చేసి తెలంగాణ ఎగబెట్టే ప్రయత్నం చేశారు. మనం ఉధృతంగా పోరాటం, ఎదురొడ్డి పోరాటం చేసిన తర్వాత 14 సంవత్సరాల తర్వాత కేసీఆర్ సచ్చుడో.. తెలంగాణ వచ్చుడో అని నేను ఆమరణ దీక్షకు పూనుకుంటే అప్పుడు తెలంగాణను ప్రకటించారు. ఆ ప్రకటనపై కూడా నిలబడకుండా వెనక్కి వెళ్లారు. మళ్లీ సంవత్సరన్నర ఉధృతమైన పోరాటాలు చేస్తే అప్పుడు దిగివచ్చి తెలంగాణ వచ్చేందుకు సిద్ధపడ్డారు’ అంటూ గుర్తు చేశారు.