హైదరాబాద్, ఫిబ్రవరి 12 : ప్రధాని నరేంద్రమోదీ తెలంగాణతో ఎందుకు గొడవపెట్టుకొంటున్నారని, అసలు మనసులో ఆయన ఏమున్నదని ముఖ్యమంత్రి కేసీఆర్ నిలదీశారు. శనివారం యాదాద్రి భువనగిరిలో ఏర్పాటుచేసిన భారీ బహిరంగసభలో మాట్లాడిన సీఎం.. ‘తెలంగాణకోసం గంత కొట్లాడినం. మన బతుకు మనం బతుకుతున్నం. ఎవ్వరినీ ఏం అంటలేం. నిన్నగాక మొన్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ పార్లమెంట్లో ఏం మాట్లాడుతడు? మోదీ.. తెలంగాణతోని ఎందుకు గోక్కుంటున్నవు. నీ మనసులో ఏముంది?’ అని ప్రశ్నించారు. ప్రజలంతా మేల్కోకపోతే చాలా పెద్ద ప్రమాదంలో పడుతామని, జాగ్రత్తగా ఉండాలని పిలుపునిచ్చారు. ‘పొద్దాక కేసీఆర్ ఒక్కడే కొట్లాడడు. యావత్ తెలంగాణ సమాజం ఈ దొంగలతో జాగ్రత్తగా ఉండాలి. అందరు కలిసి పోరాటం చేయాలి. దానికి మనం సిద్ధంగా ఉన్నమా? ఎక్కడ దాకనైనా పోదామా? నేను అక్కసుతోనో.. మరో దానితో మాట్లాడటం లేదు. వీళ్లు (బీజేపీ) దేశాన్ని గుత్త పట్టినట్టు మాట్లాడుతున్నరు’ అని పేర్కొన్నారు.