CM KCR | హైదరాబాద్, అక్టోబర్ 27 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ పార్టీపై బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ కదనభేరి మోగించారు. తెలంగాణకు ఆ పార్టీ చేస్తున్న కుట్రలపై నిప్పులు చెరిగారు. రైతుబంధును ఎత్తగొట్టే కాంగ్రెస్ నేతల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘తెలంగాణకు కాంగ్రెస్ పార్టీ దోఖా చేస్తే కేసీఆర్ శవయాత్రనా? తెలంగాణ జైత్ర యాత్రనా? ఏదో ఒకటి జరుగాలని ఆమరణ దీక్షకు కూర్చుంటే…అనేక మోసాలు, ఇచ్చిన మాట భంగం చేసి కాంగ్రెస్ పార్టీ మోసం చేసినా మనం అలుపులేని పోరాటం చేసి తెలంగాణ తెచ్చుకున్నాం’ అని ఉద్యమచరిత్రను గుర్తుచేస్తూ సాధించుకున్న తెలంగాణను మళ్లీ ఇవ్వాళ కాంగ్రెస్ ఆగం చేయాలని చూస్తున్నదని ప్రజలను అప్రమత్తం చేశారు. ప్రజా ఆశీర్వాద సభల్లో భాగంగా శుక్రవారం కేసీఆర్ పాలేరు, మహబూబాబాద్, వర్ధన్నపేట నియోజకవర్గాల్లో ప్రసంగించారు. ఏది మంచి.. ఏది చెడో చెప్తూనే కాంగ్రెస్ పార్టీ నేతల కుత్సిత ప్రవర్తనపై మండిపడ్డారు. తొమ్మిదిన్నరేండ్లుగా తెలంగాణ సాధించిన ప్రగతిని ఆవిష్కరిస్తూనే ఆ ప్రగతిని అడ్డుకొనేందుకు ప్రతీఘాతక శక్తులపై ఉగ్రరూపం దాల్చారు. ఈటల్లాంటి మాటలతో కాంగ్రెస్ కుట్రలను తునాతునకలు చేశారు.
తెలంగాణ ఆత్మగౌరవాన్ని అహంకారంతో ఎగతాళి చేస్తున్న కాంగ్రెస్ నేతల తీరును కేసీఆర్ బెబ్బులిలా చీల్చిచెండాడారు. ‘డబ్బు కట్టల అహంకారం, పిచ్చి రాజకీయాలతో వచ్చే వాళ్లకు.. మాటలు మార్చేవారికి.. పూటకో పార్టీ మార్చేవారికి అవకాశం ఇస్తే వాళ్లు గెలుస్తరు కానీ ప్రజలు గెలువరు’ అని తేల్చిచెప్పారు. డబ్బుతో వచ్చేవారికి బుద్ధిచెప్పాలని ప్రజలకు కర్తవ్యబోధ చేశారు. డబ్బు అహంకారంతో పాలేరులో నిలబడాలని చూస్తున్నారని, కోట్లు, నోట్ల కట్టలు పట్టుకొని వచ్చేవాడు ఏమి చేయడని పరోక్షంగా పొంగులేటి తీరుపై పిడుగులు కురిపించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అసెంబ్లీలో అడుగుపెట్టనివ్వని అహంకారంతో మాట్లాడతడా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు ఓడిపోయి మూలకు కూర్చుంటే తానే పిలిచి పదవి, గౌరవాన్ని ఇచ్చిన వైనాన్ని కేసీఆర్ వివరించారు. ‘బీఆర్ఎస్.. తుమ్మలకు అన్యాయం చేసిందా? తుమ్మల.. బీఆర్ఎస్కు అన్యాయం చేసిండా? ఖమ్మం ప్రజలు గ్రహించాలని కోరారు.
పీసీసీ మాజీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి తెలంగాణ రైతాంగానికి చేస్తున్న మోసాలను కేసీఆర్ ఎండగట్టారు. ‘రైతుబంధు దుబారా’ అని అన్న ఉత్తమ్కుమార్రెడ్డిని, 3 గంటల కరెంట్ చాలు అని ప్రకటించిన రేవంత్రెడ్డి అసలు స్వరూపాన్ని ఆవిష్కరించి, ప్రజలను అప్రమత్తం చేశారు. అరాచక రాజకీయ శక్తులకు అవకాశమివ్వవద్దని చెప్పారు. గిరిజనులపై అహంకారంతో మాట్లాడే కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధిచెప్పాలని పిలుపునిచ్చారు.