నిజామాబాద్/సిద్దిపేట, అక్టోబర్ 30 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ రాకతో నారాయణఖేడ్ ఆనంద నృత్యం చేయగా.. మంజీరా తీరం పులకించిపోయింది. మూడు రాష్ర్టాల కూడలి గులాబీమయమైంది. జుక్కల్, బాన్సువాడ, నారాయణఖేడ్లో సోమవారం నిర్వహించిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలు దిగ్విజయవంతమయ్యాయి. తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటకకు అనుబంధంగా ఉన్న జుక్కల్తోపాటు బాన్సువాడకు ప్రజలు పోటెత్తారు. సీఎం కేసీఆర్ రాకతో భౌగోళిక త్రివేణి సంగమ ప్రాంతం పరవశించింది. రెండు గంటల వ్యవధిలో రెండు సభలకు కేసీఆర్ హాజరై రణన్నినాదం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని, పార్టీ అభ్యర్థులైన పోచారం శ్రీనివాస్రెడ్డి, హన్మంత్ షిండేలకు భారీ మెజార్టీ కట్టబెట్టాలని ప్రజలను కోరారు. ఈ ప్రచార సభలు జన సునామీని తలపించాయి. మధ్యాహ్నం 3 గంటలకు జుక్కల్ చౌరస్తాలోని సభకు కేసీఆర్ హాజరయ్యారు. ఆ తర్వాత సాయంత్రం 4 గంటలకు బాన్సువాడ పట్టణ కేంద్రంలోని వీక్లీ మార్కెట్ మైదానంలో నిర్వహించిన సభలోనూ ప్రసంగించారు. మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి, ఎంపీ బీబీపాటిల్ సభలో పాల్గొన్నారు. లక్షలాది మంది తరలి రావడంతో రెండు నియోజకవర్గాలు గులాబీమయమయ్యాయి. నిజాంసాగర్ ఆయకట్టు రైతులకు ఏటా రెండు పంటలు పండింకొనే అవకాశాన్ని కల్పించినందున రైతన్నలంతా తండోపతండాలుగా తరలి వచ్చి కేసీఆర్కు కృతజ్ఞతలు తెలియజేశారు. జుక్కల్, బాన్సువాడ సభలకు రైతన్నలు పచ్చ కండువాలతో తరలిరావడం ఆకట్టుకున్నది. ‘జై కేసీఆర్ జై కిసాన్’ అంటూ నినాదాలు చేస్తూ సభలో ప్రత్యేక ఆకర్షణగా
నిలిచారు.
పోచారం లక్ష్మీపుత్రుడు
బాన్సువాడ సభలో స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి రాజకీయ అనుభవాన్ని, ఆయన పనితీరును, ప్రజల కోసం ఆయన పాటుపడే అంశాలను కేసీఆర్ మరోసారి ప్రస్తావించారు. వ్యవసాయ మంత్రిగా పోచారం శ్రీనివాస్రెడ్డి పడిన శ్రమను సభ సాక్షిగా చెప్పడంతో ప్రజలంతా పెద్ద ఎత్తున హర్షధ్వానాలతో హోరెత్తించారు. లక్ష్మీపుత్రుడంటూ మరోమారు కీర్తించడంతో సభా వేదికపై పోచారం భావోద్వాగానికి గురై సీఎం కేసీఆర్కు నమస్కరిస్తూ కృతజ్ఞతలు తెలియజేశారు. వచ్చే ఎన్నికల్లో లక్ష మెజార్టీ ఖాయమైందని, వచ్చే ప్రభుత్వంలోనూ పోచారం శ్రీనివాస్రెడ్డికి సముచితమైన స్థానం కల్పిస్తామని, ఆయన పెద్ద పదవి అలంకరిస్తారని కేసీఆర్ ప్రకటించారు. జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండేను ప్రజల మనిషంటూ కీర్తించారు. ఏనాడూ తన వద్దకు వ్యక్తిగత పనుల గురించి రాలేదని, వచ్చినప్పుడల్లా నియోజకవర్గ ప్రజల సమస్యలను సాదకబాధకాలను తీర్చాలంటూ కోరారని కేసీఆర్ గుర్తు చేశారు. జుక్కల్లో షిండేకు భారీ మెజార్టీ ఇవ్వాలని ప్రజలను కేసీఆర్ కోరారు.
నారాయణఖేడ్ హీరో భూపాల్రెడ్డి
సంగారెడ్డి జిల్లాలోని నారాయణఖేడ్లో ప్రజా ఆశీర్వాద సభకు నియోజకవర్గ ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. సీఎం కేసీఆర్ తన ప్రసంగంలో ఇక్కడి ప్రాంతాన్ని గుర్తు చేసినప్పుడు ప్రజలు ఈలలు వేస్తూ హర్షధ్వానాలు చేశారు. నారాయణఖేడ్ హీరో భూపాల్రెడ్డి అని కేసీఆర్ అన్నప్పుడు ఈలలు, చప్పట్లతో సభ మార్మోగింది. భూపాల్రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కేసీఆర్ కోరారు. సభలో యువత కేసీఆర్ మాస్కులు ధరించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సభా ప్రాంగణం చుట్టూ ఉన్న భవనాలపై నుంచి ప్రజలు సీఎం ప్రసంగాన్ని ఆసక్తిగా విన్నారు. సభలో సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.