CM KCR | ఖమ్మం : పాలేరు సభలో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావుపై ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తుమ్మల ఓడిపోయి మూలకు కూర్చుంటే.. పిలిచి మంత్రిని చేశాను అని కేసీఆర్ తెలిపారు. ఎమ్మెల్యే చేసి ఐదేండ్లు ఖమ్మం జిల్లా మీద ఏకఛత్రాధిపత్యం ఇస్తే, ఒక్క సీటు రాకుండా చేశారని తుమ్మలపై కేసీఆర్ నిప్పులు చెరిగారు. పాలేరు నియోజకవర్గంలో ఏర్పాటు చేసి బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు.
మిత్రుడు తుమ్మల నాగేశ్వర్ రావుకు తాను అన్యాయం చేశానని ఆయన ప్రచారం చేస్తుండు. ఆయన ఖమ్మంలో పువ్వాడ అజయ్పై ఓడిపోయాడు. ఓడిపోవడంతో ఇంట్లకు పోయి మూలన కూర్చున్నాడు. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పాత స్నేహితం ఉందని, సీనియర్ నాయకులని చెప్పి ఆయనను తీసుకొచ్చి ఏ పదవి లేకున్నా మంత్రి పదవి ఇచ్చి, ఎమ్మెల్సీని చేశాను. ఆ తర్వాత పాలేరులో ఎమ్మెల్యే వెంకట్ రెడ్డి చనిపోయారు. ఆయన భార్యను పోటీలో పెట్టాలని అనుకున్నాం. కానీ ఈయన వచ్చి అన్న నా నియోజకవర్గం రిజర్వ్ అయింది. అవకాశం ఇస్తే పాలేరు సేవకు చేస్తా, కాపాడుకుంటాను అని చెప్తే ఉప ఎన్నికల్లో టికెట్ ఇచ్చి మేమంతా వచ్చి దండం పెడితే 42 వేల మెజార్టీతో గెలిపించారు. ఈ సత్యం మీకు తెలుసు. ఓట్లు వేసింది మీరే అని కేసీఆర్ తెలిపారు.
నేను ఒక్కటే మాట అడుగుతున్నాను. మంత్రిని చేసి, ఎమ్మెల్సీని చేసి, ఎమ్మెల్యేను చేసి ఐదేండ్లు జిల్లా మీద ఏకఛత్రాధిపత్యం ఇస్తే నీవు చేసింది సున్నా గుండు సున్నా. ఖమ్మం జిల్లాలో ఒక్క సీటు రాకుండా చేశారు. ఎవరు ద్రోహం చేశారు. ఎవరికి ఎవరు నష్టం చేశారు. బీఆర్ఎస్కు తుమ్మల అన్యాయం చేసిండా..? బీఆర్ఎస్ తుమ్మలకు అన్యాయం చేసిందా..? న్యాయం చెప్పాలింది మీరు. ఈ చరిత్ర అంతా మీ కండ్ల ముందు జరిగిన చరిత్ర. ఇవన్నీ మరిచిపోలేం. ఇవాళ నోరు ఉందని అడ్డగోలుగా మాట్లాడితే రాజకీయం కాదు. ప్రజాస్వామ్యం కాదు. అది అరాచకం. అరాచకాల్ని తిప్పికొట్టాలి. అరాచక రాజకీయవేత్తలకు బుద్ది చెప్పాలని కేసీఆర్ పాలేరు నియోజకవర్గ ప్రజలకు పిలుపునిచ్చారు.