CM KCR | గజ్వేల్ : ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ శాంతిభద్రతలకు ఆలవాలంగా ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ రాజ్యంలో ఊ అంటే, ఆ అంటే మతకల్లోలం, కర్ఫ్యూ ఉండేదని కేసీఆర్ మండిపడ్డారు. గజ్వేల్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు.
కాంగ్రెస్ రాజ్యంలో మాట్లాడితే కర్ఫ్యూ, ఇవాళ పదేండ్లలో ఒక్క రోజు కూడా కర్ఫ్యూ లేదు. మతకల్లోలాలు జరగలేదు. కారణం ఏందంటే అన్ని వర్గాలు, మతాల ప్రజలను సమానంగా చూసుకుంటూ మంచిగా ముందుకు పోతున్నాం. కాబట్టి గొడవల్లేని ప్రశాంత వాతావరణం ఉంది. కాబట్టి ఐటీ, పరిశ్రమల రంగంలో పెట్టుబడులు వస్తున్నాయి. పట్టణాల్లో మౌలిక వసతులు ఏర్పాటు చేసుకుంటున్నాం. హైదరాబాద్ నగరం కండ్లు చెదిరిపోయేలా అద్భుతమైన విశ్వనగరంగా రూపుదిద్దుకుంటోంది. చాలా గొప్ప అభివృద్ధి జరుగుతుంది అని కేసీఆర్ తెలిపారు.
ప్రతిపక్షాలు ఎన్ని అడ్డంకులు కలిగించిన ఇరిగేషన్ ప్రాజెక్టులు కానీ, పట్టణాలు, గ్రామాల అభివృద్ధి కానీ ఏకదీక్షతోని చేసుకుంటూ ముందుకు సాగుతున్నాం. ఈ రాష్ట్రం ఎలా తయారైందంటే తెలంగాణ ఆచరిస్తుంది.. దేశం అనుసరిస్తుంది అనే పద్ధతుల్లో తయారైంది. చిన్న రాష్ట్రం పదేండ్ల వయసున్నప్పటికీ, ఈ దేశానికి ఒక రోల్ మోడల్గా ఈ రాష్ట్రాన్ని మనం తయారు చేసుకున్నాం. ఈ విధంగా ముందుకు పోవాలంటే చాలా జరగాలి. తెచ్చుకున్న రాష్ట్రాన్ని ఒక దరికి తెచ్చుకున్నాం. ఈ రాష్ట్రం ఇంకా బాగుపడాలి అని కేసీఆర్ అన్నారు.
పంటల ఉత్పత్తి పెరిగింది తెలంగాణలో, పంటల వైవిధ్యం కూడా పెంచాలి. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు రావాలి. ప్రతి మండలం, ప్రతి నియోజకవర్గంలో ఎక్కడికక్కడ ఆ పరిశ్రమలు రావాలి. దాంట్లో రైతులందరూ వాటాదారులు కావాలి. రైతుల బిడ్డలందరికి దాంట్లో ఉద్యోగాలు దొరకాలి. అటువంటి గొప్ప ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీగా తెలంగాణ తయారు కావాలని నా కలలు ఉన్నాయి. అదే విధంగా పేదరికాన్ని తగ్గించే విషయంలో మనం ముందుకు పురోగమిస్తున్నాం. ఇంకా పురోగమించాలి. కులం, మతం, జాతి అనే తేడా లేకుండా శాంతి భద్రతలను కాపాడుకుంటూ అన్ని వర్గాల ప్రజలను, అన్ని రంగాల్లో ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవాలి. అదే ఆశయంగా ఈ రోజు నేను పని చేస్తున్నా. మీ అందరితో ఒక్కటే మాట కోరుతున్నా. గజ్వేల్లో నన్ను రెండుసార్లు గెలిపించారు. భగవంతుడు అవకాశం, శక్తి ఇచ్చినంత మేర గ్రామాలు, పట్టణాలు, రైతుల గురించి కార్యక్రమాలు తీసుకున్నాం. ఈసారి మళ్లీ మీరు ఆశీర్వదిస్తే రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వమే వస్తుంది అని కేసీఆర్ పేర్కొన్నారు.