CM KCR | పరకాల : తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిపేందుకు ఈ పదేండ్లు ఎంతో కష్టపడ్డాం అని, తలసరి ఆదాయంలో రాష్ట్రం నంబర్వన్గా నిలిచిందని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. మరి ఇప్పుడు ఎవడో వస్తే, వానికి ఓటు వేస్తే.. ఈ పదేండ్లు పడ్డ కష్టం బూడిదలో పోసిన పన్నీరు కావాల్నా..? ఆలోచించండి అని కేసీఆర్ సూచించారు. పరకాల నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాదలో కేసీఆర్ పాల్గొని చల్లా ధర్మారెడ్డికి మద్దతుగా ప్రసంగించారు.
తెలంగాణను అన్ని రంగాల్లో అగ్రభాగాన నిలిచేందుకు పది ఏండ్ల నుంచి మేం కష్టపడ్డాం.. తెలంగాణ రాష్ట్రం వచ్చిననాడు తలసరి ఆదాయంలో మన ర్యాంకు 19, 20 ఉండే. మేం పడ్డ కష్టానికి తలసరి ఆదాయంలో ఇవాళ ఇండియాలో తెలంగాణ నంబర్ వన్లో ఉంది. ఒకప్పుడు కరువుతో గొడగొడ ఏడ్సిన తెలంగాణ ఇది. భీవండికి బతుకపోయిన తెలంగాణ ఇది. కానీ అనేక మంచి కార్యక్రమాలు చేపట్టిన తర్వాత ఇవాళ 3 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం పండిస్తుంది. ఇంకా చిన్న చిన్న ప్రాజెక్టులు పూర్తయితే నాలుగు కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం పండించి, దేశానికే అన్నం పెట్టే తెలంగాణ తయారైతది. మరి మేం ఈ పదేండ్లు పడ్డ కష్టం బూడిదలో పోపిన సన్నీరు కావాల్నా..? ఇదే ప్రగతి కొనసాగాలంటే బీఆర్ఎస్సే ఉండాల్నా..? అనేది మీరు చర్చించి, నిర్ణయించాలి. అనేక సంక్షేమ కార్యక్రమాలు, మంచి పనులు బీఆర్ఎస్ చేసింది. ఇవన్నీ మీ కండ్ల ముందున్నాయి అని కేసీఆర్ తెలిపారు.
తెలంగాణలో వ్యవసాయాన్ని నిలబెట్టాలని చెప్పి.. అనేక కార్యక్రమాలు అమలు చేశాం. రైతు బాగుంటేనే దేశం బాగుంటది.. గ్రామాలు మంచిగా అయితవని కఠినమైన నిర్ణయాలు తీసుకొని కొన్ని కార్యక్రమాలు అమలు చేసుకున్నాం. గతంలో ప్రాజెక్టు కింద నీళ్లు పారితే పన్నులు వసూళ్లు చేసేవారు. ఇవాళ నీటి తిరువా పన్ను లేదు. బకాయిలు రద్దు చేశాం. 24 గంటల నాణ్యమైన కరెంట్ ఇస్తున్నాం. రైతుబంధు పథకాన్ని పుట్టించి, పెట్టుబడి అందిస్తున్నాం. అదృష్టం బాగాలేక రైతు చనిపోతే 5 లక్షలు బీమా ఇస్తున్నాం. పండించిన ధాన్యాన్ని ప్రభుత్వమే మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేస్తుంది. ఇవన్నీ మీ కండ్ల ముందు జరుగుతున్నాయి అని కేసీఆర్ తెలిపారు.
కేసీఆర్కు పని లేదు.. రైతుబంధు ఇచ్చి డబ్బులు వేస్ట్ చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు అంటున్నరు. 10 వేల రైతుబంధును 16 వేలకు తీసుకుపోతాం. ఎప్పుడంటే చల్లా ధర్మారెడ్డి గెలిస్తే. అదే విధంగా 24 గంటల కరెంట్ అవసరం లేదని రేవంత్ అంటుండు. 3 గంటలు చాలు అంటుండు. పొలం ఎలా పారుతది అంటే 10 హెచ్పీ మోటార్ పెట్టుకోవాలని అంటుండు. దానికి సొమ్ము ఎవ్వడు ఇవ్వాలా..? నీ అయ్యా ఇవ్వాలా..? 30 లక్షల మోటార్లు ఎవరు మార్చాలా..? నోట్లకెళ్లి ఉట్టిగా మాట్లాడితే అయిపోతదా..? నెత్తా కత్తా.. ఏది పడితే అది మాట్లాడితే ఎట్ల.. ఇది వాళ్ల వైఖరి అని కేసీఆర్ తెలిపారు.