CM KCR | హుజురాబాద్ : తెలంగాణ ప్రజలు బీజేపీకి ఎందుకు ఓటేయ్యాలి..? రాష్ట్రానికి రావాల్సిన రూ. 25 వేల కోట్లు కోత విధించినందుకా..? అని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రశ్నించారు. గుడ్డిగా ఏదో ఊపులో ఓటేయడం కాదు.. ఆలోచన చేసి విచక్షణతో ఓటు వేయాలి అని కేసీఆర్ పిలుపునిచ్చారు. హుజురాబాద్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొని, పాడి కౌశిక్ రెడ్డికి మద్దతుగా ప్రసంగించారు.
10 ఏండ్ల నుంచి కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది. కేంద్రం 150 మెడికల్ కాలేజీలు మంజూరు చేసింది. కానీ తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజీ ఇవ్వలేదు. నేనే స్వయంగా 100 ఉత్తరాలు రాశాను. ఒక్కటంటే ఒక్క మెడికల్ కాలేజీ ఇవ్వలేదు. పార్లమెంట్లో పాస్ చేసిన చట్టాన్ని కూడా మోదీ ఉల్లంఘించారు. ఏ రాష్ట్రంలో ఎన్ని జిల్లాలు ఉంటే అన్ని నవోదయ పాఠశాలలు స్థాపించాలని చట్టం ఉంది. ఇది కండీషన్. చట్టాన్ని కూడా బేఖాతరు చేసి నవోదయ పాఠశాల ఒక్కటి కూడా ఇవ్వలేదు. మనం పన్నులు కడుతలేమా..? దేశంలో మనం భాగం కాదా..? ఇక్కడున్న బీజేపీ నాయకులు పెద్దగ నీలుగుతారు. మోదీతో ఎందుకు మాట్లాడలేదు. నలుగురు బీజేపీ ఎంపీలు ఏం చేయలేదు. ఒక్క మెడికల్ కాలేజీ ఇవ్వని బీజేపీకి ఒక్క ఓటు ఎందుకు వేయాలి. చట్ట ప్రకారం రావాల్సిన పాఠశాలలు ఇవ్వకుండా మన మీద పగ పట్టినటువంటి బీజేపీకి ఎందుకోసం ఓటేయాలి. ఎవరి ముఖం చూసి ఓటేయాలి. ఏమొస్తది బీజేపీకి ఓటు వేస్తే అని ఆలోచించాలి అని కేసీఆర్ సూచించారు.
రైతుల మోటార్లకు మీటర్లు పెట్టాలన్నారు మోదీ. చచ్చినా పెట్టను అని చెప్పాను. మోటార్లకు మీటర్లు పెట్టకుపోతే ఏడాదికి వచ్చే రూ. 5 వేల కోట్లు కట్ చేస్తా అని చెబితే, కట్ చేయమని చెప్పాను. ఐదేండ్లకు రూ. 25 వేల కోట్లు కోత విధించారు. మరి ఇక్కడున్న బీజేపీ నాయకులు ఏం చేశారు. ఈ నాయకులు మనకు ఎందుకు..? వాళ్లు ఎందుకు పనికి వస్తరు. రాష్ట్రం ఇట్ల నాశనం అయిపోతుండే. రావాల్సినవి రాకపోతే.. వీళ్లు గెలిచి చేసింది ఏది.. పొడిచేది ఏందీ..? అని కేసీఆర్ ఘాటుగా విమర్శించారు.
ఇవాళ మూడు ప్రధాన పార్టీలు ఉన్నాయి. బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ కోసం. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం కోసం. తెలంగాణ ప్రజల హక్కులు కాపాడటం కోసం. మిగతా రెండు పార్టీలకు కూడా చరిత్రలు ఉన్నాయి. కాంగ్రెస్ చరిత్ర ఏంది..? బీజేపీ చరిత్ర ఏంది..? వారి వైఖరి మన రాష్ట్రం మీద ఏవిధంగా ఉందని చూడాలి. అవి కూడా దయచేసి ఆలోచించి అప్పుడే ఓటు వేయాలి. బామ్మర్ది, చిన్నాయన చెప్పిండని చెప్పి పొరపాటున ఓటు వేయొద్దు. ఆషామాషీగా ఓటు వేస్తే నష్టపోతాం. మంచివాళ్లకు ఓటేస్తే డెఫినెట్గా మంచి జరుగుతది అని కేసీఆర్ సూచించారు.