హైదరాబాద్ : దేశానికి అన్నం పెట్టే రైతులను నిర్లక్ష్యం చేస్తున్న కేంద్ర ప్రభుత్వంపై సీఎం కేసీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఇందిరాపార్క్ వద్ద నిర్వహించిన టీఆర్ఎస్ మహాధర్నాలో కేసీఆర్ ప్రసంగించారు.
ఈ గోల్ మాల్ గాళ్లకు, ఈ గోల్ గుండం గాళ్లకు కరెంట్ ఉన్న వాడలేని అసమర్థులకు, దేశంలో నీళ్లు ఉన్న ప్రజలకు ఇవ్వలేని అసమర్థులకు చరమగీతం పాడితినే ఈ దేశానికి నిష్కృతి. కచ్చితంగా జెండా లేవాల్సిందే. దేశ వ్యాప్తంగా ఉద్యమం రగలాల్సిందే. ఈ విషయాలు దేశంలో ప్రతి ఇంటికి చేరాల్సిందే. మరో పోరాటానికి తెలంగాణ ఇవాళ నాయకత్వం వహించాల్సిందే. మనం సిద్ధం కావాల్సిందే. మన సమస్యలకు పరిష్కారం మన దగ్గర్నే దొరకదు. చిప్ప పట్టుకుంటే దొరకదు. బతిమాలిడితే దొరకదు. బిచ్చమెత్తుకుంటే దొరకదు. ఈ దేశ ప్రజలు బిచ్చగాళ్లు కాదు. మనం కూడా బిచ్చగాళ్లం కాదు. పండించాం.. దేశానికి అన్నం పెడుతామంటే తీసుకునే తెలివి లేక ఇవాళ గోల్ మాల్ చేస్తున్నారు. ఆరాచకం సృష్టిస్తున్నారు. ఈ కిరికిరి పెట్టి, గోల్ మాల్ చేస్తున్నారు. దేశం మూగబోతోంది. మాట్లాడితే మీ మీద కేసులు పెడుతాం. దా పెట్టుదా.. ఏం పెడుతావో పెట్టు అని కేసీఆర్ సవాల్ చేశారు.
ఇంకోడు మాట్లాడుతాడు. కేసీఆర్ భయమంటే ఏందో చూపిస్తడంటా. కేసీఆర్ భయపడుతాడా? కేసీఆర్ భయపడితే తెలంగాణ వచ్చేదా? అని కేసీఆర్ అన్నారు. ఎన్ని రోజులు కొట్లాడినం.. ఎక్కడిదాకా కొట్లాడినం. కాబట్టి ఈ పిచ్చికూతలు మానుకోవాలి. ఒకటే ఒక మాట.. మీకు దమ్ము, చిత్తశుద్ధి ఉంటే.. మీ పార్టీ ప్రజలకు నాయకత్వం వహిస్తుందని నమ్మితే, సూటిగా చెప్పండి.. వర్షాకాలంలో వచ్చే వడ్లు కొంటరా? కొనరా? గత యాసంగిలో ఇచ్చిన ధాన్యం గోదాముల్లో మూలుగుతున్నది. దాన్ని కొంటరా? కొనరా? యాసంగిలో వరి వేయమంటరా? తప్పు చెప్పామని ముక్కు నేలకు రాస్తారా? అనే విషయాలపై సమాధానం చెప్పాలి అని కేసీఆర్ డిమాండ్ చేశారు.
ఇది రాజకీయ సమస్య కాదు.. రైతుల జీవన్మరణ సమస్య. రైతుల బతుకుదెరువు సమస్య. పంటే వేసి కొనుగోలుకు పోకపోతే రైతు ఏం చేయాలి. మళ్లీ విషం తాగి చావలా? మళ్లీ చెట్లకు శవాలు వేలాడాలా? ఇంత ఆరాచకంగా కేంద్రానికి నాయకత్వం వహిస్తున్న ప్రభుత్వం వ్యవహరించొచ్చా? ఈ దేశంలో ఇది రాజకీయమా? ఈ రాజకీయాన్ని ఎదురించే అవసరం లేదా? దీన్ని ప్రశ్నించే అవసరం లేదా? ప్రజలు మూగబోవాలా? మీ యొక్క దుర్మార్గమైన చట్టాల కింద నలిగిపోవాలా? నాశనం కావాలా? ఇలా అనేక ప్రశ్నలు మన ముందున్నాయి అని కేసీఆర్ పేర్కొన్నారు.