CM KCR | ముథోల్ : రాష్ట్రానికి ఒక్క మెడికల్ కాలేజీ, ఒక్క నవోదయ పాఠశాల ఇవ్వని బీజేపీకి ఓటు ఎందుకు వేయాలని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. గ్రామాల్లోకి వచ్చే బీజేపీ అభ్యర్థులను ఈ అంశాలపై నిలదీయాలని కేసీఆర్ ప్రజలకు సూచించారు. ముథోల్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు.
ముథోల్లో ఇవాళ బీజేపీ పార్టీ అభ్యర్థిని మీరు క్వశ్చన్ అడగాలి అని కేసీఆర్ సూచించారు. మోదీకి ప్రయివేటైజేషన్ పిచ్చి పట్టుకుంది. విమానాలు, ఓడరేవులు, రైల్వేలు, లోకమంతా ప్రయివేటు. చివరకు కరెంట్ కూడా ప్రయివేటు. బోర్ మోటార్ల కాడా మీటర్లు పెట్టాలని ఆర్డర్ చేశారు. నేను చెప్పిన పాణం పోయినా తల తెగిపడ్డా పెట్టను అని చెప్పను. ఏడాదికి వచ్చే రూ. 5 వేల కోట్లు కట్ చేస్తానని చెప్పాడు. అలా ఐదేండ్లకు కలిసి రూ. 25 వేల కోట్లు నష్టం చేసిండు. మనకు రావాల్సింది రాకుండా.. మీటర్లు పెట్టలేదు అని బంద్ పెట్టిండు. రైతాంగం నిలబడాలి. రైతులు ఆగమైపోయారు. రైతులు కచ్చితంగా బాగుపడాలి. వ్యవసాయం బాగుండాలనే సిద్ధాంతో ఎంత ఒత్తిడి చేసినా మీటర్లు పెట్టలేదు. భవిష్యత్లో కూడా మీటర్లు పెట్టం. మీటర్లు పెట్టేటోళ్లకు ఓట్లు వేయమని చెప్పాలి. రూ. 25 వేల కోట్లు కట్ చేసిన పార్టీ ఇవాళ ఏముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతున్నావని ప్రశ్నించాలి. దేశంలో 157 మెడికల్ కాలేజీలు మంజూరు చేశారు. కానీ తెలంగాణకు ఒక్కటి ఇవ్వలేదు. 50 ఉత్తరాలు రాశాను. ఎందుకు ఇవ్వలే. ఇదేం వివక్ష. ఒక్క మెడికల్ కాలేజీ ఇవ్వని బీజేపీకి ఒక్క ఓటు ఎందుకు వేయాలి. నవోదయ విద్యాయాలు ఇవ్వలేదు. 33 జిల్లాలకు నవోదయ విద్యాలయాలు రావాలి. పదేండ్ల నుంచి అడుగుతున్నా ఒక్కటి కూడా మంజూరు చేయలేదు. మరి నవోదయ పాఠశాల ఇవ్వని నాయకులు ఏ ముఖం పెట్టుకుని బీజేపీ మనల్ని ఓట్లు అడుగుతుది. వారికి బుద్ధి చెప్పాలి. బుద్ధి చెప్పకపోతే మనమీదనే దాడి చేస్తరు అని కేసీఆర్ పేర్కొన్నారు.
భైంసా ఎలా అభివృద్ధి చెందిందో మీరు చూస్తున్నారు అని కేసీఆర్ తెలిపారు. కులం, మతం లేదు. తెలంగాణ ప్రజలందరూ మన బిడ్డలే. దళిత సమాజం ఎప్పట్నుంచో వెనుకబడి ఉన్నారు. అణిచివతేకు గురయ్యారు. వారు సాటి మనషులు కారా..? దళితుల కోసం కాంగ్రెస్ పార్టీ ఆలోచించి ఉంటే ఇవాళ ఈ పరిస్థితి ఎందుకు ఉండేది. ఓటు బ్యాంకుగా వాడుకున్నారు. ఈ దళిత బంధు స్కీం తెచ్చింది కేసీఆర్. తప్పకుండా ప్రతి దళిత కుటుంబానికి సాయం అందిస్తాం. దళితులు కూడా ఆలోచించి ఓటేయాలి అని కేసీఆర్ సూచించారు.
భైంసా, ముథోల్, నిర్మల్, ఆదిలాబాద్, హైదరాబాద్లో ముస్లింలు హిందువులు ఉన్నారని కేసీఆర్ గుర్తు చేశారు. వందల ఏండ్ల నుంచి కలిసి బతుకుతున్నాం. తాకులాటలు పెట్టి మతపిచ్చి లేపి భైంసా అంటేనే యుద్ధమన్నట్టు చిత్రీకరించి, తన్నుకు చస్తారని అబద్ధాలు చెప్పి ప్రజల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో పదేండ్లలో కర్ఫ్యూ లేదు. లాఠీ ఛార్జి లేదు. ఫైరింగ్ లేదు. ప్రశాంతంగా ఉన్నది తెలంగాణ. ఇలానే ప్రశాంతంగా ఉండాల్నా.. మతపిచ్చి మంటలతోటి నెత్తురు పారాలా..? మీరు ఆలోచించాలి. ఎవరి బతుకు వారు బతుకకా.. ద్వేషం పెట్టుకుని ఏం సాధిస్తాం. ఏమోస్తది. కలిసిమెలిసి బతకడంలోనే శాంతియుతమైన సహజీవనం ఉంటది. అందరం గొప్పగా బతుకగలుగుతాం. మన రాష్ట్రంలో ఉన్న అన్ని మతాలు, కులాల వారు కలిసి ముందుకు పోవాలి అని కేసీఆర్ పిలుపునిచ్చారు.