తుఫాన్ ప్రభావంతో మరో రెండ్రోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయనే వాతావరణశాఖ హెచ్చరికల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరుగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. భారీ వర్షాలతో రాష్ట్రంలో ఏర్పడిన పరిస్థితులపై సోమవారం ఢిల్లీ నుంచి సీఎస్ సోమేశ్తో కలిసి సమీక్షించారు. పోలీస్, రెవెన్యూ తదితర శాఖలు సమన్వయంతో పనిచేయాలని సీఎం కేసీఆర్ అధికారులకు సూచించారు. అన్ని కలెక్టర్ కార్యాలయాల్లో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేసి మానిటరింగ్చేయాలని, ఎప్పటికప్పుడు సమాచారాన్ని సచివాలయంలోని కంట్రోల్ రూమ్కు అం దించాలని తెలిపారు.
సీఎంతో సమీక్ష సమావేశం అనంతరం సీఎస్ సోమేశ్కుమార్ మరోసారి జిల్లా కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. అవసరమైతే, హైదరాబాద్, కొత్తగూడెం, వరంగల్లోని ఎన్డీఆర్ఎఫ్ బృందాల సేవలను వినియోగించుకోవాలని సూచించారు. లోతట్టు ప్రాంతాలు , చెరువులు, కుంటలు, బ్రిడ్జిల వద్ద ప్రత్యేకంగా అధికారులను నియమించి పరిస్థితులను సమీక్షించాలని పేర్కొన్నారు. డీజీపీ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ.. జిల్లా కలెక్టర్లతో సమన్వయంతో పనిచేయాలని పోలీస్ కమిషనర్లు, ఎస్పీలను ఆదేశించారు. సమావేశంలో రోడ్లు భవనాలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్ శర్మ, పంచాయతీరాజ్శాఖ కార్యదర్శి సందీప్ సుల్తానియా, విపత్తుల నిర్వహణశాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా పాల్గొన్నారు.
వర్షాలతో జాగ్రత్త: గవర్నర్ సూచన
రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీవర్షాలపై అప్రమత్తంగా ఉండాలని గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్ సూచించారు. సోమవారం సాయంత్రం సీఎస్ సోమేశ్కుమార్కు ఫోన్ చేసిన గవర్నర్ వర్షం పరిస్థితి, పరిపాలన యంత్రాంగం సన్నద్ధతపై ఆరాతీశారు. రెస్క్యూ, సహాయక బృందాలను అప్రమత్తంగా ఉంచాలని సూచించారు. అన్ని జిల్లాల్లో ఎన్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధంగా ఉంచామని, కంట్రోల్రూమ్లను ఏర్పాటు చేశామని సీఎస్ గవర్నర్కు వివరించారు. ఎలాంటి పరిస్థితిలోనైనా త్వరగా స్పందించేందుకు పరిపాలన యంత్రంగా సిద్ధంగా ఉందని చెప్పారు.
అత్యవసరంలో డయల్ 100
లోతట్టు ప్రాంతాల్లో వరద సహాయక చర్యలపై పోలీసులు ప్రత్యేకంగా దృష్టిపెట్టాలని డీజీపీ ఎం మహేందర్రెడ్డి ఆదేశించారు. ఎస్పీలు, పోలీసు కమిషనర్లు ఇందుకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. అత్యవసర సహాయం కోసం ప్రజలు డయల్ 100కు కాల్ చేస్తే, స్థానిక పోలీసులు వెంటనే అందుబాటులోకి వస్తారని పోలీస్ ఉన్నతాధికారులు పేర్కొన్నారు. వరదపీడిత ప్రాంతాల్లోని వాగులు, చెరువులు, జలాశయాల వద్ద పోలీస్ సిబ్బంది అందుబాటులో ఉండి ప్రజలను అప్రమత్తం చేస్తున్నట్టు తెలిపారు. నీటిప్రవాహం ప్రమాదకరంగా ఉన్న ప్రాంతాల్లో వంతెనలపైన వాహనాలను అనుమతించడం లేదు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత స్థావరాలకు తరలించడంలో రెవెన్యూ, ఇతర ప్రభుత్వ విభాగాలకు పోలీసులు సహకరిస్తున్నారు.
బ్రాహ్మణ పరిషత్తు ఇంటర్వ్యూలు వాయిదా
భారీ వర్షాల కారణంగా ప్రభుత్వం మంగళవారం సెలవు ప్రకటించిన నేపథ్యంలో బెస్ట్ పథకం ఇంటర్వ్యూలను వాయిదా వేసినట్టు తెలంగాణ బ్రాహ్మణ పరిషత్తు ప్రకటించింది. వీటిని తిరిగి బుధవారం నిర్వహించనున్నట్టు ఆ పరిషత్తు పరిపాలనాధికారి కే చంద్రమోహన్ వెల్లడించారు.