నమ్మి వెంట నడిచేవారిని కండ్లల్లో పెట్టి కాపాడుకొంటారని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు మరోసారి నిరూపించారు. తెలంగాణ ఉద్యమంలో తన వెంట నడిచి, స్వరాష్ట్ర సాధనకు కృషిచేసిన అనేకమంది ఉద్యమకారులను ఇప్పటికే సమున్నతంగా గౌరవించారు. తాజాగా మరో ఐదుగురు ఉద్యమకారులకు రాష్ట్రస్థాయి పదవులిచ్చి ప్రత్యేకతను చాటుకొన్నారు. పార్టీ నేతలు ఆకుల లలిత, గజ్జెల నాగేశ్, పాటిమీది జగన్మోహన్, దూదిమెట్ల బాలరాజుతోపాటు కవి, రచయిత జూలూరు గౌరీశంకర్ను వివిధ సంస్థలకు చైర్పర్సన్లుగా నియమించారు.
హైదరాబాద్, డిసెంబర్ 17 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఐదు కార్పొరేషన్లకు ప్రభుత్వం కొత్త చైర్పర్సన్లను నియమించింది. తెలంగాణ ఉమెన్స్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్పర్సన్గా మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత, తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్గా రాష్ట్ర బీసీ కమిషన్ మాజీ సభ్యుడు జూలూరి గౌరీశంకర్, తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్గా గజ్జెల నాగేశ్, తెలంగాణ స్టేట్ టెక్నలాజికల్ సర్వీసెస్ చైర్మన్గా పాటిమీది జగన్మోహన్రావు, తెలంగాణ షీప్ అండ్ గోట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా దూదిమెట్ల బాలరాజు యాదవ్ను నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. బాధ్యతలు చేపట్టిన రోజునుంచి వీరు రెండేండ్లు పదవిలో కొనసాగుతారని పేర్కొన్నారు. చైర్పర్సన్లుగా నియమితులైనవారంతా తెలంగాణ ఉద్యమకారులే కావటం విశేషం. వీరిలో బాలరాజు యాదవ్, జగన్మోహన్రావు టీఆర్ఎస్వీలో కీలక పాత్ర పోషించారు. ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడిన తర్వాత వీరంతా శుక్రవారం ప్రగతిభవన్లో సీఎం కేసీఆర్ను కలిసి ఆశీర్వాదం తీసుకొన్నారు. వారికి సీఎం అభినందనలు తెలిపారు.
తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్గా నియమితులైన జూలూరు గౌరీశంకర్ మూడున్నర దశాబ్దాలుగా సాహితీ సేవ చేస్తున్నారు. పాత్రికేయుడిగా, వ్యాసకర్తగా, పుస్తక సంపాదకుడిగా విశేష కృషిచేశారు. సూర్యాపేట జిల్లా నడిగూడెంకు చెందిన ఆయన కొంతకాలం తెలుగు లెక్చరర్గా పనిచేశారు. పలు దినపత్రికల్లో సుదీర్ఘకాలం జర్నలిస్ట్గా సేవలందించారు. సామాజిక స్పృహగల పుస్తకాలను ముద్రించారు. తెలంగాణ తొలి బీసీ కమిషన్ సభ్యుడిగా పనిచేశారు.
నల్లగొండ జిల్లా నకిరేకల్ మండలం పాలెం గ్రామానికి చెందిన దూదిమెట్ల బాలరాజు యాదవ్ కాకతీయ, ఉస్మానియా విశ్వవిద్యాలయాల్లో ఉన్నత విద్యను అభ్యసించారు. తెలంగాణ ఉద్యమంలో విద్యార్థి నాయకుడిగా కీలకపాత్ర పోషించారు. ఉద్యమ సమయంలో ఆయనపై పోలీసులు 150 కేసులు పెట్టారు. ఆయన రెండుసార్లు జైలుకు కూడా వెళ్లారు. 21 రోజులపాటు తెలంగాణ వ్యాప్తంగా 721 కిలోమీటర్లు మహాపాదయాత్ర చేశారు. హైదరాబాద్లోని ఎల్బీస్టేడియంలో సమైక్యాంధ్రవాదుల సభను అడ్డుకున్నందుకు దాడికి గురయ్యారు.
టీఆర్ఎస్లో గజ్జెల నాగేశ్ను గుర్తుపట్టని నాయకులు, కార్యకర్త ఉండరంటే అతిశయోక్తి కాదు. టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి పార్టీలోనే పనిచేస్తున్న ఉద్యమ కార్యకర్త ఆయన. టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు చేపట్టిన అనేక ఉద్యమాల్లో చురుకుగా పనిచేశారు.
నాపై విశ్వాసంతో పదవి ఇచ్చిన సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు. సంస్థను అభివృద్ధి దిశగా నడిపేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తా. పార్టీకి, ప్రభుత్వానికి మంచిపేరు తీసుకొస్తా.
–గజ్జెల నాగేశ్
మహిళా స్వయంశక్తికి నిదర్శనం ఆకుల లలిత నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా పనిచేసిన ఆకుల లలిత 2001 నుంచి నిజామాబాద్ జిల్లాలో ఎంపీటీసీగా, ఎంపీపీగా, జడ్పీటీసీగా పనిచేశారు. మహిళా స్వయం సహాయక సంఘాల బలోపేతానికి కృషిచేశారు. మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు, ఆర్థిక స్వావలంబనకు పాటుపడ్డారు.
నన్ను తెలంగాణ ఉమెన్స్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్పర్సన్గా నియమించడం సంతోషంగా ఉన్నది. రాష్ట్రస్థాయి పదవి దక్కడం అదృష్టంగా భావిస్తున్నాను. ఈ పదవి అప్పగించిన సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు. నాపై నమ్మకంతో అప్పగించిన పదవికి వన్నె తెచ్చేందుకు శాయశక్తులా కృషిచేస్తాను.
–ఆకుల లలిత
ఉద్యమ నినాదం జగన్మోహన్రావు పాటిమీది జగన్మోహన్రావు హైదరాబాద్లోని కూకట్పల్లికి చెందిన ఉన్నత విద్యావంతుడు. తెలంగాణ ఉద్యమంలో విద్యార్థి నాయకుడిగా చురుకైన పాత్ర పోషించారు. తెలంగాణ వెనుకబాటుతనంపై శ్రీకృష్ణకమిటీకి ఢిల్లీలోని విజ్ఞాన్భవన్లో పవర్పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. టీఆర్ఎస్లో చురుకైన కార్యకర్తగా, గ్రేటర్ హైదరాబాద్ టీఆర్ఎస్ కమిటీకి యువజన విభాగం ఇన్చార్జిగా పనిచేశారు.
సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ స్ఫూర్తితోనే రాజకీయాల్లోకి వచ్చాను. పార్టీ అధిష్ఠానం అప్పగించిన బాధ్యతలను సమర్థంగా నిర్వహించాను. తెలంగాణ టెక్నలాజికల్ సర్వీసెస్ చైర్మన్గా నన్ను నియమించినందుకు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్కు ధన్యవాదాలు. ఈ పదవిలో మరింత బాధ్యతగా పనిచేస్తా. పార్టీలో ఉద్యమ నేతలతోపాటు అన్ని సామాజిక వర్గాలకు సమ ప్రాధాన్యమిస్తూ పదవులు అప్పగిస్తున్న సీఎం కేసీఆర్కు జీవితాంతం రుణపడి ఉంటా.
-పాటిమీది జగన్మోహన్