నడిచివచ్చిన బాటను, ఇచ్చిన మాటను మరువని ప్రభుత్వం కేసీఆర్దేనని మరోమారు రుజువైంది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి ఇది దశాబ్ది సందర్భం. 21రోజులపాటు అట్టహాసంగా ఉత్సవాల నిర్వహణకు సిద్ధమవుతున్న ప్రభుత్వం.. సబ్బండ వర్ణాలకు మరింత సంక్షేమాన్ని కానుకగా అందిస్తున్నది. ఇప్పటికే 111 జీవో రద్దు, వీఆర్ఏ, జేపీఎస్ల క్రమబద్ధీకరణకు ఆమోదముద్ర వేసిన ప్రభుత్వం.. కులవృత్తులకు ఆర్థిక చేయూత అందించనున్నట్టు ప్రకటించింది. అదే వరుసలో తాజాగా మంగళవారం ఉన్నతస్థాయి సమీక్షలో పాల్గొన్న ముఖ్యమంత్రి కేసీఆర్ మరిన్ని కీలక నిర్ణయాలను ప్రకటించారు. జూన్ 5 నుంచి రెండోవిడత గొర్రెలను పంపిణీ చేయనుండగా, 14 నుంచి పోడు పట్టాలను అందజేయనున్నారు. 14న నిమ్స్ విస్తరణకు శంకుస్థాపన చేయడంతోపాటు.. గృహలక్ష్మి, దళితబంధు పంపిణీకి ఏర్పాట్లు చేయనున్నారు.
హైదరాబాద్, మే 23 (నమస్తే తెలంగాణ): ఆదివాసీలు ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న పోడు భూముల పట్టాల పంపిణీ కార్యక్రమం వచ్చే నెల ప్రారంభం కానున్నది. జూన్ 24వ తేదీ నుంచి 30 వరకు అర్హులకు పట్టాలు పంపిణీ చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. నిమ్స్ విస్తరణ పనులకు వచ్చే నెల 14న శంకుస్థాపన చేయాలని, గృహలక్ష్మి పథకాన్ని జూలైలో ప్రారంభించాలని నిర్ణయించారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల నిర్వహణ నేపథ్యంలో రోజువారీ కార్యక్రమాల షెడ్యూల్ ఖరారు, పోడు భూముల పట్టాల పంపిణీ, తదితర అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై సీఎం కేసీఆర్ మంగళవారం సచివాలయంలో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు నిర్ణయాలు తీసుకొన్నారు.
లక్షన్నర మందికి పోడు పట్టాలు జూన్ 24 నుంచి 30 వరకు గిరిజనులకు పోడు భూముల పట్టాల పంపిణీ కార్యక్రమం నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు.
నూతనంగా పోడు పట్టాలు పొందే గిరిజనుల వివరాలు సేకరించి రైతుబంధు వర్తింపచేయాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటికే ఆర్ఓఎఫ్ఆర్ ద్వారా రైతుబంధు పొందుతున్నవారితోపాటు నూతనంగా పోడు పట్టాలు అందుకోబోతున్న గిరిజన లబ్ధిదారులను క్రోడికరించి, రాష్ట్రంలోని మిగతా రైతుల మాదిరిగానే రైతుబంధు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పోడు భూముల పట్టాల యాజమానులకు ప్రభుత్వమే బ్యాంకు అకౌంట్ తెరిచి, నేరుగా రైతుబంధును జమచేస్తుందని తెలిపారు. ఈ మేరకు నూతనంగా పోడు పట్టాలు అందుకొనే గిరిజన రైతుల బ్యాంకు ఖాతాల వివరాలను ఆర్థిక శాఖకు అందజేయాలని సూచించారు. ఈ దిశగా చర్యలు తీసుకోవాలని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ను సీఎం ఆదేశించారు. పోడు భూముల పంపిణీ కార్యక్రమానికి తానే స్వయంగా హాజరవుతానని సీఎం తెలిపారు.
4 లక్షల ఎకరాలు పంపిణీ
పోడు భూముల పట్టాల పంపిణీని వచ్చే నెల 24వ తేదీ నుంచి ప్రారంభించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం 4 లక్షల ఎకరాలకు రైతులు హక్కుదారులు కానున్నారు. గత నెల 30వ తేదీన నూతన సచివాలయం ప్రారంభోత్సవం సందర్భంగా పోడు పట్టాల పంపిణీ ఫైల్పై సీఎం కేసీఆర్ సంతకం చేశారు. తాజాగా పట్టాల పంపిణీ తేదీని ఖరారు చేశారు. అర్హులైన రైతులను గుర్తించేందుకు రాష్ట్ర ప్రభుత్వం 28 జిల్లాలు, 295 మండలాలు, 2,845 గ్రామ పంచాయతీల పరిధిలో ఫారెస్ట్ రైట్ కమిటీలను ఏర్పాటు చేసింది. ఈ కమిటీలు రైతుల నుంచి క్లెయిములను స్వీకరించాయి. గత ఏడాది సెప్టెంబర్- డిసెంబర్ మధ్య కమిటీలు క్షేత్రస్థాయిలో విస్తృతంగా పరిశీలన జరిపాయి. గ్రామస్థాయి, సబ్ డివిజనల్, జిల్లా స్థాయిలో మూడు దశలుగా ఫారెస్ట్ రైట్ కమిటీలు పనిచేశాయి.
రాష్ట్రంలోని 12,49,296 ఎకరాలకు సంబంధించి 4,14,353 క్లెయిమ్స్ను పరిశీలించాయి. అన్ని స్థాయిల వడబోతల అనంతరం 28 జిల్లాల పరిధిలో 4,00,903 ఎకరాలకు సంబంధించి 1,55,393 మంది లబ్ధిదారులు పట్టాలకు అర్హత సాధించారు. పట్టాల పంపిణీ తర్వాత అటవీ భూమి ఒక ఇంచు కూడా అన్యాక్రాంతం కాకుండా ఉండేందుకు పాలిగన్ టెక్నాలజీని వినియోగించారు. భూమి సర్వే నెంబర్, పంపిణీ చేసే భూమి విస్తీర్ణం, ఆ భూమి ఏ అకాంక్ష, రేఖాంశాల మధ్య ఉన్నది? భూమి హద్దులు వంటి అంశాలను గూగుల్ మ్యాపింగ్ వివరాలతోపాటు హోలోగ్రామ్ను పోడు పట్టాలో పొందుపరుచనున్నారు. గిరిజన, అటవీ, రెవెన్యూ శాఖల అధికారుల సంతకంతోపాటు లబ్ధిదారుని ఫొటో ఉండేలా పట్టాదార్ పాస్బుక్లు సిద్ధమైనట్టు సమాచారం.
4 లక్షల మందికి గృహలక్ష్మి
పేదల ఇండ్ల నిర్మాణానికి ఆర్థిక సాయం అందించే గృహలక్ష్మి పథకానికి మార్గదర్శకాలను రూపొందించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. జూలైలో గృహలక్ష్మి పథకం ప్రారంభించాలని సూచించారు. జూలైలోనే దళితబంధు కొనసాగింపు కోసం ఏర్పాట్లు చేయాలని సీఎస్ను ఆదేశించారు. సొంత జాగా ఉండి, ఇల్లు కట్టుకోవాలని కలలుగనే పేదలకు ఆర్థిక సా యం చేసేందుకు ‘గృహలక్ష్మి’ పథకాన్ని అమలు చేయనున్నది. ఈ ఏడాది బడ్జెట్లో ఈ పథకాన్ని ప్రభుత్వం ప్రకటించి రూ.12 వేల కోట్లు కేటాయించింది. మార్చి 9న జరిగిన క్యాబినెట్లో సీఎం కేసీఆర్ ఈ పథకానికి ‘గృహలక్ష్మి’ అని పేరు పెట్టారు. ఇల్లు లేనివారు, గతంలో ఇల్లు ఉండి కూలిపోయినవారికి ఈ పథకం వర్తిస్తుంది.
పేదలకు ప్రభుత్వం ఇంటి స్థలం కోసం పట్టాలు ఇచ్చినవారికి కూడా వర్తిస్తుంది. ఇందులో భాగంగా 4 లక్షల ఇండ్లకు ప్రభుత్వం గ్రాంటు ఇస్తుంది. ఒక్కొక్క నియోజకవర్గానికి మూడు వేల ఇండ్ల చొప్పున 119 నియోజకవర్గాల్లో 4 లక్షల ఇండ్లు నిర్మించాలని నిర్ణయించారు. ఇవి కాకుండా 43 వేల ఇండ్లు రాష్ట్ర కోటాలో మంజూరు చేస్తారు. ఇవన్నీ మహిళల పేరుమీదే మంజూరు చేస్తారు. రూ.3 లక్షల గ్రాంటును మూడు దఫాలుగా రూ.లక్ష చొప్పున లబ్ధిదారుడి ఖాతాలో జమచేస్తారు. పునాది సమయంలో రూ.లక్ష, స్లాబు వేసిన తర్వాత రూ.లక్ష, నిర్మాణం పూర్తయ్యి సున్నాలు వేసే దశలో రూ.లక్ష అందజేయనున్నారు. లబ్దిదారులు తమకు నచ్చిన విధంగా ఇల్లు కట్టుకునే వెసులుబాటు కల్పించారు.
25న కలెక్టర్లతో కాన్ఫరెన్స్
రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించేందుకు చేపట్టాల్సిన ఏర్పాట్లు, కార్యాచరణకు సంబంధించి ఈ నెల 25న జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్స్ నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ సమావేశంలో మంత్రులు, జిల్లా ఎస్పీలు కూడా పాల్గొననున్నారు.
ఇండ్ల స్థలాల పంపిణీ
దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా అర్హులకు ఇండ్ల స్థలాల పట్టాల పంపిణీ చేపట్టాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. అర్హులైన నిరుపేదలను గుర్తించి ఆయా గ్రామాల్లో ఇంకా మిగిలి ఉన్న నివాసయోగ్యమైన ప్రభుత్వ భూములను వారి ఇండ్ల నిర్మాణాల కోసం కేటాయించాలని ఆదేశించారు.
33 ఎకరాల్లో నిమ్స్ విస్తరణ
వైద్యారోగ్య దినోత్సవం సందర్భంగా జూన్ 14వ తేదీన నిమ్స్ దవాఖాన విస్తరణ పనులకు సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టనున్నారు. 2 వేల పడకలతో నూతనంగా నిర్మించనున్న సూపర్ స్పెషాలిటీ దివాఖాన భవన నిర్మాణానికి స్వయంగా శంఖుస్థాపన చేయనున్నారు. మొత్తం 33 ఎకరాల్లో రూ.1,571 కోట్లతో నిమ్స్ విస్తరణ పనులు చేపట్టనున్నారు. మూడు బ్లాకులతో భవనం నిర్మించనున్నారు. ఓపీ, ఐపీ, ఎమర్జెన్సీ సేవలకు ప్రత్యేకంగా బ్లాక్లు ఏర్పాటు కానున్నాయి. ప్రస్తుతం నిమ్స్కు రోజుకు సగటున 2,000-3,000 ఓపీ నమోదవుతున్నది. ప్రస్తుత భవనం సామర్థ్యానికి ఇది చాలా ఎక్కువ. దీంతో కొత్త భవనంలో ప్రత్యేకంగా ఓపీ సేవల కోసమే ఒక బ్లాక్ను ఏర్పాటు చేయనున్నారు. భవిష్యత్తులో పెరుగనున్న రద్దీ, విస్తృతం కానున్న స్పెషాలిటీ సేవలను దృష్టిలో పెట్టుకొని ఏకంగా ఎనిమిది అంతస్తుల్లో ఓపీ బ్లాక్ను నిర్మించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఎమర్జెన్సీ కేసులకు నిమ్స్ కేరాఫ్గా ఉన్నది.
దీంతో ఎమర్జెన్సీ విభాగంలో నిత్యం పడకల సమస్య ఎదురవుతున్నది. దీంతో విస్తరణలో భాగంగా ఎమర్జెన్సీ సేవల కోసం ప్రత్యేకంగా 8 అంతస్తులతో బ్లాక్ను నిర్మిస్తున్నారు. ఇన్పేషెంట్ల కోసం 13 అంతస్తులతో మరో బ్లాక్ ఏర్పాటు నిర్మిస్తారు. కొత్త భవనంలో మొత్తం 30 ఆపరేషన్ థియేటర్లు ఉంటాయి. 2000 పడకలు అందుబాటులోకి వస్తుండగా అన్నింటికీ ఆక్సిజన్ సరఫరా ఉంటుంది. అందుబాటులోకి వచ్చే పడకల్లో 1200 ఆక్సిజన్ బెడ్లు ఉంటాయి. మరో 500 ఐసీయూ బెడ్లు ఉంటాయి. మిగతావి పేయింగ్ రూమ్స్లో ఉంటాయి. కాస్త డబ్బు ఖర్చయినా ఫర్వాలేదు ప్రత్యేకంగా గది కావాలనుకొనే రోగుల కోసం కొత్తగా పేయింగ్ రూమ్స్ సేవలను అందుబాటులోకి తేనున్నారు. 300 గదులు ఇందుకోసం కేటాయిస్తారు. ప్రస్తుతం నిమ్స్లో 30 విభాగాలు సేవలు అందిస్తుండగా.. విస్తరణతో వీటి సంఖ్య 35కు పెరుగుతుంది.
నిమ్స్ స్వరూపం