సిద్దిపేట, ఆగస్టు 15 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ముఖ్యమంత్రి కేసీఆర్ పరిపాలనలో తెలంగాణ రాష్ట్రం పదేండ్లలోనే వందేండ్ల అభివృద్ధి సాధించిందని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు దేశానికే దిక్సూచిగా మారాయని చెప్పారు. మంగళవారం ఆయన 76వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల పరేడ్గ్రౌండ్లో జాతీయజెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ.. స్వరాష్ట్రంలో వ్యవసాయం అద్భుత ప్రగతి సాధించిందని వివరించారు. నాడు కరువు కాటకాలతో కటకటలాడిన సిద్దిపేట జిల్లా నేడు కల్పతరువుగా మారిందని పేర్కొన్నారు. రాళ్లురప్పల భూముల రూపురేఖలు మారిపోయి నేడు సిరుల పంటలు పండుతున్నాయని పేర్కొన్నారు. రైతులకు ఇచ్చిన మాట ప్రకారం సీఎం కేసీఆర్ రుణమాఫీ చేశారని తెలిపారు. సమైక్య రాష్ట్రంలో ఆనాటి పాలకులు తెలంగాణలో వ్యవసాయాన్ని చిన్నచూపు చూశారని, రైతుల బాధలను అవహేళన చేశారని హరీశ్రావు ఆవేదన వ్యక్తంచేశారు. వ్యవసాయం దండగ అంటూ చిత్రీకరించారని పేర్కొన్నారు. కానీ తెలంగాణ నేడు సగం దేశానికి అన్నం పెడుతుందని కలలో కూడా ఊహించి ఉండమని చెప్పారు. వ్యవసాయాన్ని పండుగలా మార్చి, రైతుల కండ్లలో సంతోషాన్ని నింపుతున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమని తెలిపారు. ఈ సందర్భంగా సిద్దిపేట జిల్లాలో సాధించిన ప్రగతిని సోదాహరణంగా వివరించారు. కొద్దిరోజుల్లోనే సిద్దిపేటకు రైల్వే సదుపాయం కూడా అందివస్తుందని చెప్పారు. కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటీల్, పోలీస్ కమిషనర్ ఎన్ శ్వేత, జడ్పీ చైర్పర్సన్ వేలేటి రోజాశర్మ, ఎమ్మెల్యే వొడితెల సతీశ్కుమార్, ఎమ్మెల్సీ రఘోత్తంరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వాతంత్య్ర సమరయోధులను మంత్రి సన్మానించారు.