హైదరాబాద్, మార్చి 17 (నమస్తే తెలంగాణ): సికింద్రాబాద్లోని స్వప్నలోక్ కాంప్లెక్స్లో జరిగిన అగ్ని ప్రమాదం పట్ల సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఈ దుర్ఘటనలో ప్రాణనష్టం జరగటంతోపాటు పలువురు గాయపడటంపై సీఎం విచారం వ్యక్తంచేశారు. మృతుల కుటుబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. మరణించినవారి కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియాను ప్రకటించారు.
గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలతోపాటు గాయపడినవారికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని స్పష్టంచేశారు. క్షేత్రస్థాయిలో ఉండి పరిస్థితులను పరిశీలిస్తూ అవసరమైన చర్యలు చేపట్టాల్సిందిగా మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్యాదవ్కు సీఎం సూచించారు. ఈ ఘటనపై ప్రధాని మోదీ సైతం దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున, క్షతగాత్రులకు రూ.50 వేల చొప్పున పరిహారం ప్రకటించారు.