బాన్సువాడ: కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలం తిమ్మాపూర్ గ్రామంలోని శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వరస్వామి కళ్యాణోత్సవంలో సీఎం కేసీఆర్ దంపతులు పాల్గొన్నారు. అక్కడ ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో వారికి స్వాగతం పలికారు. ఆ తర్వాత సీఎం కేసీఆర్ దంపతులు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం సతీమణి శోభ.. దాతల సహకారంతో స్వామివారి కోసం తయారు చేయించిన 2 కిలోల బంగారు కిరీటాన్ని సీఎం కేసీఆర్ చేతుల మీదుగా స్వామివారికి సమర్పించారు.
అనంతరం సీఎం దంపతులను వేదపండితులు ఆశీర్వదించారు. ఈ కళ్యాణ మహోత్సవంలో సీఎం దంపతుల వెంట స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి, మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి, ఎంపీలు సంతోష్కుమార్, బీబీ పాటిల్, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు ఉన్నారు. కాగా, అంతకుముందు బాన్సువాడకు చేరుకున్న ముఖ్యమంత్రి దంపతులకు స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఘనస్వాగతం పలికారు.
అనంతరం అక్కడి నుంచి బయలుదేరి కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలం తిమ్మాపూర్ గ్రామంలోని వేంకటేశ్వరస్వామి ఆలయానికి చేరుకున్న సీఎం దంపతులు కళ్యాణోత్సవంలో పాల్గొన్నారు. కాగా, తిమ్మాపూర్లో శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. కన్నుల పండువలా జరుగుతున్న ఈ బ్రహ్మోత్సవాలను వీక్షించేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలిరావడంతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక శోభతో కళకళలాడుతున్నాయి.
బాన్సువాడ నియోజకవర్గంలోని బీర్కూర్ మండలం తిమ్మాపూర్ శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవ వేడుకల్లో పాల్గొంటున్న సీఎం శ్రీ కేసీఆర్. https://t.co/hGGAxnfh3n
— BRS Party (@BRSparty) March 1, 2023