హైదరాబాద్, ఫిబ్రవరి 5 (నమస్తే తెలంగాణ): దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏండ్లు గడిచినా గత పాలకులు నదులపై ఒక్కటంటే ఒక్కటి కూడా చెప్పుకోదగ్గ ఆనకట్ట కట్టలేకపోయారని సీఎం కేసీఆర్ విమర్శించారు. ఇంతకాలం దేశాన్ని ఏలిన పాలకులు దీనికి ఏమి సమాధానం చెప్తారని నిలదీశారు. నాందేడ్ బీఆర్ఎస్ బహిరంగసభలో ప్రసంగించిన అనంతరం సీఎం కేసీఆర్, వివిధ రంగాలలో మన దేశంతోపాటు ఇతర దేశాలు సాధించిన ప్రగతి గణాంకాలను విడుదల చేశారు.
ఈ సందర్భంగా ప్రపంచంలో మనకన్నా ఎంతో చిన్న దేశాలు అతిపెద్ద డ్యామ్లను నిర్మించినట్టు తెలిపారు. యూరప్, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, ఆఫ్రికా, చైనా తదితర దేశాల్లో ప్రపంచంలోనే అతిపెద్ద డ్యామ్లు నిర్మించారని చెప్పారు. జింబాబ్వేలో ప్రపంచంలోనే అతిపెద్ద డ్యామ్ 1959 లోనే నిర్మించినట్టు వెల్లడించారు. ప్రపంచంలోని అతిపెద్ద డ్యామ్లలో మన దేశానికి స్థానం లేకపోవడంపై విచారం వ్యక్తంచేశారు. ఇంతకాలం దేశాన్ని ఏలిన పాలకుల దివాళాకోరుతనం వల్లనే నేడు దేశానికి ఈ గతి పట్టిందని సీఎం విమర్శించారు.