హైదరాబాద్, ఫిబ్రవరి 12 (నమస్తే తెలంగాణ): దేశంలో ఏటా 50 వేల టీఎంసీల నీళ్లు సముద్రంలో కలుస్తున్నాయని, మిగులు జలా లు ఉన్నా నీళ్ల కోసం రాష్ర్టాల మధ్య యుద్ధాలు ఎందుకు జరుగుతున్నాయని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు కేంద్రాన్ని నిలదీశారు. పనికిరాని ఇరిగేషన్ చట్టాలను సముద్రంలో పడేసి, కొత్త చట్టాలు తేవాలని అన్నారు. కేటాయింపులు, అనుమతులు వేగంగా ఇస్తే తప్పేంటని ప్రశ్నించారు.
ఆదివారం అసెంబ్లీలో ద్రవ్య వినిమయ బిల్లుపై జరిగిన చర్చలో సీఎం కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు. ‘దేశంలో వర్షపాతం 1.40 లక్షల టీఎంసీలు. ఇందులో 75 వేల టీఎంసీలు ఆవిరవుతాయి. అంటే.. అం దుబాటులో ఉన్న శుద్ధమైన నదీజలాలు సుమారు 75 వేల టీఎంసీలు. ఇవి సీడబ్ల్యూసీ లెక్కలే. ప్రస్తుతం దేశం వాడుతున్నది 20-21వేల టీఎంసీలు మాత్రమే. మిగతా 50వేలకుపైగా టీఎంసీల నీళ్లు సముద్రంలో కలుస్తున్నాయి’ అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. దేశ నదుల్లో ఇన్ని నీళ్లున్నా నీళ్ల కోసం యుద్ధాలు ఎందుకు జరుగుతున్నాయని ప్రశ్నించారు.
‘వై వాటర్ వార్స్ ఇన్ ఇండియా?’ అని నిలదీశారు. ‘సట్లెజ్, రావి, బియాస్ నదుల గురించి పంజాబ్, హర్యానా, రాజస్థాన్ కొట్లాడుకోవాల్నా? మహానది నీళ్ల గురించి ఛత్తీస్గఢ్, ఒడిశా, మహారాష్ట్ర మధ్య పంచాయితీ కొనసాగాల్నా? కావేరీ నది గురించి కర్ణాటక, తమిళనాడు ప్రతి సంవత్సరం సుప్రీంకోర్టుకు పోవడం, కేసులు వేసుకోవడం జరగాలా? కృష్ణా, గోదావరి నదుల గురించి తెలంగాణ, మహారాష్ట్ర, ఏపీ, మధ్యప్రదేశ్ పొ ద్దున లేస్తే కొట్లాట పెట్టుకోవాల్నా?’ అని ప్రశ్నించారు. వ్యవసాయ రంగానికి 40 వేల టీఎంసీలు ఇస్తే దేశం సుభిక్షం అవుతుందని, 10వేల టీఎంసీలు తాగడానికి, పరిశ్రమలకు సరిపోతాయని, అయినా 30 వేల టీఎంసీల మిగులు జలాలు ఉంటాయని వివరించారు. ‘ఈ నీళ్ల కోసం ప్రపంచ బ్యాంకును అడిగే అక్కర లేదు. అమెరికా కాళ్లు మొక్కే అవసరం లేదు. ఇంటర్నేషనల్ డిప్లమసీ అవసరం లేదు. దీనికి విశ్వగురువులే అవసరం లేదు. దేశ గురువులు చా లు. అందుకే భారత ప్రజలు ఈ విశ్వగురువులు వద్దు.. దేశ గురువులు కావాలని మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నరు’ అని పేర్కొన్నారు.
నీళ్ల లెక్కలు తేల్చడం చేతకాదా?
బ్రిజేశ్ ట్రిబ్యునల్ను 2004లో వేశారని, 20 ఏండ్లయినా ఇప్పటికీ తెగలేదని గుర్తు చేశారు. ‘నీళ్ల లెక్క తేల్చడానికి 20 ఏండ్లా? కేటాయింపులు జరపడానికే 20-30 ఏండ్లు పడితే ఆ తర్వాత రకరకాల పర్మిషన్లు ఎప్పుడు రావాలి? డిజైన్లు ఎప్పుడు పూర్తికావాలి? ప్రాజెక్టు ఎప్పుడు కట్టాలి? ప్రజలకు నీళ్లు ఎప్పుడు రావాలి? నీళ్ల లెక్కలు తేల్చే చేతగాదా? చట్టాలు సరిగా లేకుంటే తీసేసి, కొత్తవి తేవాలి’ అని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో తాను, కేంద్రంలో మోదీ దాదాపు ఒకేసారి బాధ్యతలు చేపట్టామని గుర్తు చేశారు. ‘దేశం నాశనం అవుతుంటే చూడబుద్ధి కావడం లేదు. ఈ ఎనిమిదిన్నరేండ్లు చూసీ చూసీ యాష్టకొచ్చి రిటైర్ అయ్యే టైంలో ఈ బాధ్యతను తీసుకొన్నా. ఇటీవల మహారాష్ట్రకు చెందిన మాజీ సీఎం నన్ను కలిసి బాబ్లీ పంచాయితీ పరిష్కరించాలని కోరారు.
ఆ పంచాయితీ 0.4 టీఎంసీలది. తెలంగాణలో ఇంద్రావతి, ప్రాణహిత కలిసిన తర్వాత ఏటా 2 వేల టీఎంసీలు సముద్రంలో కలిసిపోతున్నాయి. అన్ని నీళ్లు సముద్రంలో కలుస్తుంటే 0.4 టీఎంసీల కోసం కొట్లాడుదామా? ఇంకెంత కాలం? ఈ సెంట్రల్ గవర్నమెంట్ సన్నాసులు ఎట్లాగూ చేయరు, దమ్ముంటే హైదరాబాద్కు రండి, పక్క రాష్ర్టాల సీఎంలను పిలవండి, మనం మనం మాట్లాడుకుని ఒప్పందం చేసుకుందాం’ అని చెప్పానన్నారు. ‘హరీశ్రావు నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు మహారాష్ట్ర సీఎంతో చర్చలు జరిపి ఒప్పందాలు చేసుకోలేదా? ఇయ్యాల బాజాప్తా కాళేశ్వరం నుంచి 240 టీఎంసీలు తీసుకుంటలేమా?’ అని ప్రశ్నించారు.‘నదుల్లోని నీళ్లు సముద్రంలోకి పోయే బదులు భూమి మీదికి రావాలి, పంటలు పండాలి, కరువు పోవాలి, ఆకలి బాధ తీరాలి’ అన్నదే తన లక్ష్యమని చెప్పారు.
త్వరలో పంజాబ్ను దాటిపోతం
ఏదైనా చెప్పడానికి ఆత్మవిశ్వాసం కావాలని, మొదట్లో జోక్లాగా అనిపిస్తుందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. వాక్ శుద్ధి, చిత్తశుద్ధి, సంకల్ప శుద్ధి ఉంటే నిజంగా ప్రజలకు మేలు కలగాలని అనుకుంటే భగవంతుడు కూడా సహకరిస్తాడని చెప్పారు. ఒకనాడు తాను ‘ఏపీ నుంచి పోతు న్నా.. తెలంగాణ రాష్ట్రంలోనే మళ్లీ దిగుతా అని చెప్పిన. భగవంతుని దయ, అందరి సహకారం తో నేను చెప్పినట్టే జరిగింది. తెలంగాణ రాష్ట్రం లో అడుగుపెట్టిన’ అని గుర్తు చేశారు. రాష్ట్రంలో బ్రహ్మాండంగా 24 గంటల కరెంటు ఇస్తూ, ప్రా జెక్టుల ద్వారా నీళ్లు తీసుకొచ్చి, చెరువులు నింపి, చెక్డ్యామ్లు కట్టి పంజాబ్ను తలదన్నే పరిస్థితికి పోతున్నామని చెప్పారు. ఇప్పుడు తెలంగాణ ఇండియాలో రెండో స్థానంలో ఉన్నదని, త్వరలో మొదటి స్థానానికి చేరుకుంటుందని స్పష్టం చేశారు. ‘కచ్చితంగా రేపు మా గవర్నమెంటే వస్తది. చేసి చూపిస్తం. ప్రతి ఎకరానికి నీళ్లు ఇస్తాం. ఐదారేండ్లలో ప్రతి ఇంటికీ నల్లా నీ ళ్లు ఇస్తాం’ అని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.
కరువొస్తే మన పరిస్థితి ఏంది?
ఇంత అద్భుతమైన వర్షపాతం, ఇన్ని జీవనదులు ఉన్న దేశంలో ఒక్క భారీ రిజర్వాయర్ కూడా లేదని సీఎం కేసీఆర్ గుర్తు చేశారు. ప్రపంచంలో అతిపెద్ద నీటి రిజర్వాయర్ ఉండొద్దా? అని ప్రశ్నించారు. చిన్న దేశం జింబాబ్వేలో ప్రపంచంలోనే అతిపెద్ద రిజర్వాయర్ ఉన్నదని గుర్తు చేశారు. మన దేశంలో అతిపెద్ద రిజర్వాయర్ మధ్యప్రదేశ్లోని ఇందిరాసాగర్ అని, దాని సామర్థ్యం 450 టీఎంసీలు అని పేర్కొన్నారు. నాగార్జునసాగర్ 403 టీఎంసీలతో రెండో స్థానంలో ఉన్నదని చెప్పారు. అయితే వీటిల్లో 100 టీఎంసీల మేర పూడిక పేరుకుపోయి సామర్థ్యం తగ్గిందని వివరించారు.
మన దేశంలో ఏటా ఏదో ఒక మూల కరువు, మరో మూల వరదలు చూస్తుంటామని, 140 కోట్ల జనాభాకు రెండు, మూడు భారీ రిజర్వాయర్లు నిర్మించకపోతే పెద్ద కరువు వస్తే పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. ‘పనికిమాలిన ట్రిబ్యునళ్లను పక్కకు పడేసి.. కేంద్రం ఒక ఏడాదిలో వాటర్ డిస్ట్రిబ్యూషన్ చేయరాదా? చకచకా పర్మిషన్లు ఇయ్యరాదా? రెండేండ్లలో వర్క్స్ స్టార్ట్ చేయరాదా? ప్రత్యేకమైన చట్టం చేయరాదా?’ అని నిలదీశారు. దమ్మున్న గవర్నమెంట్ ఉంటే ఇవి సాధ్యం అవుతాయని, అవి చేయడానికే బీఆర్ఎస్ వచ్చిందన్నారు. ‘నీళ్లు ఉంటాయి.. కానీ మంచి నీళ్లు, సాగునీళ్లు రాక ప్రజలు వంచించబడతారు. శతాబ్దాలకు సరిపోయే కరెంటు ఉత్పత్తి చేసే బొగ్గు ఉంటది.. కానీ కరెంటు రాదు. మరి ఏం ఉంటది? ఉపన్యాసాలా? జబ్బలు చరుసుకునుడా? బస్తీమే సవాలా? తు కిత్తా.. అంటే మై కిత్తా అనుడా? ఈ తూ కిత్తా.. మై కిత్తా కలిసి 70 ఏండ్లు గడిశిపోయాయి కదా.. అందుకే మార్పు రావాలి’ అని స్పష్టం చేశారు.
వాగుల్లో నీళ్లు పారినట్టే.. డబ్బాల్లో ఓట్లు పారుతాయి
‘ఒకప్పుడు చంద్రబాబు ఇంకుడు గుంతలు అంటే.. రాజశేఖర్రెడ్డి బొంకుడు గుంతలు అన్నడు. అవన్నీ పో యాయి. ఇప్పుడు రాష్ట్రంలో ఒక్కొక్క కాలువలో 9 నెలలు నీళ్లు పారుతున్నయి. కాకతీయ కాలువ నిండు గర్భిణిలా ప్రవహిస్తున్నదని నేను గర్వంగా చెప్తున్నా. నీళ్లను చూసి ప్రజలు హర్షిస్తున్నరు’ అని పేర్కొన్నారు. ‘కూడవెళ్లి, హల్దీ, మంజీరా వాగుల్లోకి నీళ్లు వదిలినం. దుమ్ములేసి ఎండిపోయిన వాగుల్లో చెక్డ్యామ్లు కట్టి, నీళ్లు వదిలి వాటిని జలవనరుల్లాగా వాడుకుంటున్నాం’ అని పేర్కొన్నారు. తాము కథలు చెప్పడం లేదని, 650కిపైగా చెక్ డ్యామ్లు కట్టామని గుర్తు చేశారు. రెండో దశ నిర్మాణాలు త్వరలో మొదలు పెడతామన్నారు.
వరదలకు ఎక్కడైనా ధ్వంసమైతే మరమ్మతులు చేయిస్తామన్నారు. చెరువులు ఎండకాలంలో కూడా అలుగులు పారుతున్నాయని, ఇవి బీఆర్ఎస్ విజయాలు కావా? అని ప్రశ్నించారు. ప్రతి ఇంటిలో రోజూ నల్లాల నుంచి దూకే స్వచ్ఛమైన గోదావరి, కృష్ణా నీళ్లు కనిపిస్తలేవా? ‘5 వేల ఎకరాలకు ఒక క్లస్టర్ చేసి 2,601 రైతు క్లస్టర్లలో 2,601 రైతు వేదికలు నిర్మితమై కండ్లముం దు కనిపిస్తలే వా?’ అని ప్రశ్నించారు. ఇవ న్నీ నిజం కా వా? ఇవన్నీ బీఆర్ఎస్ ప్రభు త్వ విజయాలు కాదా? అని ప్రతిపక్షాలను అడిగారు. ‘ఇప్పుడు కాకతీయ కాలువలో, కూడవెళ్లి వాగులో, మంజీరా వాగులో, ఆకే రు వాగులో, ఊకచెట్టు వాగులో నీళ్లు పారుతున్నట్టే.. రేపు ఎలక్షన్లలో మా డబ్బాల్లో ఓట్లు పారుతాయి’ అని ప్రకటించారు.
బర్రె గుద్దితే పచ్చడైన వందేభారత్
మోదీ గొప్పగా చెప్పుకొనే వందేభారత్ రైలు బర్రె గుద్దినా పచ్చడి పచ్చడి అవుతున్నదని సీఎం కేసీఆర్ ఎద్దేవా చేశారు. అంతకుముందు శతాబ్ది, రాజధాని పేరుతో అనేక రైళ్లు వచ్చినా, అరుదైన సందర్భం ఉంటే తప్ప ఎప్పుడూ నేరుగా ప్రధాని వాటిని ప్రారంభించలేదని చెప్పారు. కానీ.. బర్రె గుద్దితే పచ్చడయ్యే రైలును ప్రధానమంత్రి 14 సార్లు ప్రారంభించారని ఎద్దేవా చేశారు. ‘ముఖం కడిగి పౌడర్ అద్దినట్టు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్కు మరమ్మతులు చేసే పనులకు ప్రధానమంత్రి వచ్చి ఫౌండేషన్ ఏస్తడట. ఇంతకన్నా ఘోరం ఉంటదా?’ అని ప్రశ్నించారు. కేంద్ర మంత్రి ప్రయాణికుల లిఫ్ట్ను జాతికి అంకితం చేశారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి కౌంటర్ వేశారు. ఇదా దేశాన్ని నడిపే పద్ధతి అని మండిపడ్డారు.
దేశంలో బలహీనమైన మౌలిక వసతులు
కాంగ్రెస్, బీజేపీలు 70 ఏండ్లు ఈ దేశాన్ని పాలించినా ఇప్పటికీ మన మౌలిక వసతులు బలహీనంగా ఉన్నాయని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ఇందుకు పలు ఉదాహరణలు చెప్పారు. 193 కిలోమీటర్ల చుట్టుకొలత కలిగిన సింగపూర్లో ఒకటే పోర్టు ఉంటుందని, కానీ ఏకంగా 3.73 కోట్ల కంటెయినర్లను హ్యాండిల్ చేస్తున్నదని చెప్పారు. చైనా 21 కోట్ల కంటెయినర్లను హ్యాండిల్ చేస్తున్నదని తెలిపారు. ఇదే సమయంలో దాదాపు 8 వేల కిలోమీటర్ల సముద్ర తీరం కలిగి, ఎన్నో పోర్టులు ఉన్న భారత దేశం మాత్రం 2.57 కోట్ల కంటెయినర్లకే పరిమితం అయ్యిందని వివరించారు. గూడ్స్ రైళ్ల వేగంలోనూ దారుణం అని వ్యాఖ్యానించారు. ‘ఇదా దేశం.. రైల్వే స్టేషన్లు కంజెషన్, రైల్వే ట్రాకులు కంజెషన్, ఎయిర్పోర్టులు కంజెషన్, నేషనల్ హైవేలు కంజెషన్, మన ఖర్మానికి ఢిల్లీకి పోతే ఎయిర్పోర్టులో జాగా లేక 30-40 నిమిషాలు గాలిలో తిరగాలె. మౌలిక వసతులు పెరుగవు, ఎగుమతులు పెరుగవు, పారిశ్రామిక ప్రగతి ఉండదు, నిరుద్యోగం మాత్రం పెరుగుతుంది. అన్ని రంగాల్లో దేశం కుప్పకూలుతుంది. అయినా డోలు బజావో అన్నట్టు గొప్పలు చెప్పుకుంటరు. ఇట్లా ఉంటే ఎప్పుడు విశ్వగురువు అవుతాం?’ అని ప్రశ్నించారు.
దేశం : గూడ్స్ రైళ్ల వేగం-గంటకు
చైనా : 120 కి.మీ.
ఆస్ట్రేలియా : 80 కి.మీ.
అమెరికా : 78 కి.మీ.
ఇంగ్లండ్ : 75 కి.మీ.
జర్మనీ : 60 కి.మీ.
భారత్ : 24 కి.మీ.
ట్రక్కుల ప్రయాణ వేగం
దేశం : వేగం
అమెరికా : 95-115 కి.మీ.
భారత్ : 55 కి.మీ.
దేశం కోసం నెహ్రూ తపన
స్వాతంత్య్రం వచ్చిన కొత్తలో దేశానికి దశ, దిశ చూపెట్టాల్సిన బాధ్యత నెహ్రూపై ఉన్నదని సీఎం కేసీఆర్ తెలిపారు. పైగా ఆయన దేశం కోసం కొట్లాడి, జైలు వెళ్లిన వ్యక్తి కాబట్టి ఈ దేశం కోసం తపన పడ్డారని చెప్పారు. ఆయన హయాంలో వార్షిక ప్రణాళిక, పంచవర్ష ప్రణాళిక అంటూ దేశానికి ఒక దారి చూపెట్టారని గుర్తుచేశారు. అప్పట్లో అధికారులు సైతం కమిటెడ్గా ఉండి పని చేశారని వెల్లడించారు. నెహ్రూ తర్వాత భారతదేశం ఆగమైందని, దశాబ్దాలు గడిచినా ఇప్పటికీ కోలుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఎన్నికల్లో గెలువడమే లక్ష్యమా?
కాంగ్రెస్, బీజేపీలు ఇన్నేండ్లుగా ప్రజలను, ప్రజాప్రతినిధులను చీకట్లో ఉంచి మభ్యపెట్టాయని సీఎం కేసీఆర్ మండిపడ్డారు. ‘అతని కంటే ఘనుడు ఆచం ట మల్లన్న అన్నట్టు, కాంగ్రెస్, బీజేపీ దొందూ దొం దే. ఒకరిని మించినోళ్లు ఒకరు’ అని ఎద్దేవా చేశారు. ‘ఈ రోజు దేశానికి లక్ష్యం ఉన్నదా? లక్ష్యం కోల్పో యి బట్కాయిస్తున్నమా? గుమ్రా అయిపోయినమా ? ఎక్కడికి పోతున్నం? దేశానికి ఒక సామూహిక లక్ష్యం ఉండాలె కదా. లక్ష్యం లేని సమాజం, దేశం ఎటువైపు పోతుంది? చివరికి ఎక్కడికి వెళ్తుంది?’ అని ప్రశ్నించారు. డబ్బు వెదజల్లి, తాగించి, గొడవలు సృష్టించి, విద్వేషాలు రెట్టగొట్టి ఏదైనా చేసి ఎన్నికల్లో గెలవడమే ఇప్పుడు లక్ష్యంగా మారిందని, గెలవగానే లక్ష్యం పూర్తవుతున్నదని పేర్కొన్నారు. ఇలాంటి లక్ష్యాలతో ఉంటే దేశం ఎక్కడికిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ‘మా వడ్లు కొనుమని రాష్ట్ర మంత్రులు పోతే.. వడ్లు కొనం మీ ప్రజలకు నూక లు తినుమని అంటున్నరు. ఒక కేంద్ర మంత్రి ఇలా అనొచ్చా? అహంకారమా? దేశాన్ని ఎక్కడికి తీసుకుపోతున్నరు? అందుకే దేశంలో కూడా తెలంగాణ వంటి ప్రభుత్వమే రావాలె’ అని స్పష్టం చేశారు.