మేడ్చల్ ఒకప్పుడు చిన్న ఊరు.. ప్లాట్ కొందామన్నా అంతదూరం ఎందుకని ప్రజలు వెనక్కి తగ్గిన సందర్భం.. హైదరాబాద్ ప్రజలకు అది ఒక డంపింగ్ కేంద్రం.. చెరువులన్నీ కాలుష్యంతో కంపుకొట్టిన ప్రాంతం.. ఇక్కడ కూడా ప్రజలు జీవిస్తారా అనేంత దుర్భరం.. ఉమ్మడి పాలకుల పట్టింపు లేక మేడ్చల్లో జీవించడమే నరకంగా భావించిన ప్రజానీకం.. నేడు అక్కడ గజం స్థలం సుమారు లక్ష.. ఎడ్యుకేషన్ హబ్.. ఐటీ హబ్.. ఇండస్ట్రీయల్ హబ్, అధునాతన వసతులు.. కొత్తరూపు సంతరించుకున్న జవహర్నగర్ డంపింగ్ యార్డ్.. పరిశుభ్రంగా చెరువులు, వాటికి బండ్లు.. ఇలా స్వరాష్ట్రంలో మేడ్చల్ రూపురేఖలే మారిపోయాయి. పదేండ్లలో అభివృద్ధిలో మేడ్చల్ హల్చల్ చేస్తున్నది.
మేడ్చల్, అక్టోబర్ 17 (నమస్తే తెలంగాణ): ఉమ్మడి పాలనలో చిన్న ఊరును తలపించిన మేడ్చల్.. స్వరాష్ట్రంలో పదేండ్లలోనే అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించింది. ఇండస్ట్రీయల్ కారిడార్గా, ఐటీ, ఎడ్యుకేషన్ హబ్గా ప్రగతి పరుగులు పెట్టింది. హెచ్ఎండీఏ పరిధిలోని మేడ్చల్.. సీఎం కేసీఆర్ చొరవతో మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాగా ఏర్పాటైంది. వేల కోట్ల నిధులతో జరిగిన అభివృద్ధి పనులతో ఆ ప్రాంత రూపురేఖలే మారిపోయాయి. ప్రజలకు సౌకర్యాలు మెరుగుపడ్డాయి. నియోజకవర్గంలో రూ.4,006 కోట్లతో అనేక అభివృద్ధి పనులు జరిగాయి. జవహర్నగర్ డంపింగ్యార్డ్ కొత్త రూపు సంతరించుకున్నది. అక్కడ దుర్వాసన రాకుండా ఎప్పటికప్పుడు చెత్త రిసైక్లింగ్ చేస్తున్నారు. ఇక్కడ చెత్తతో కరెంట్ తయారుచేస్తున్నారు. రూ.1500 కోట్లతో విద్యుత్తు ఉత్పత్తి కేంద్రం ఏర్పాటుచేశారు. ఆ ప్రాంతంలో గాలి, నీరు కలుషితం కాకుండా రూ.144 కోట్లతో చర్యలు చేపట్టారు. ఎనిమిది చెరువుల్లో రూ.200 కోట్లతో నీటి కాలుష్య నివారణ పనులు శరవేగంగా సాగుతున్నాయి.
దమ్మాయిగూడ, జవహర్నగర్, ఘట్కేసర్, నాగారం మున్సిపాలిటీల్లో జాతీయ రహదారుల లింక్ రోడ్ల అనుసంధానం, వరద నీటికాలువల నిర్మాణానికి రూ.1,100 కోట్ల పనులు జరుగుతున్నాయి. పీర్జాదిగూడ, బోడుప్పల్ కార్పొరేషన్ల పరిధిలో శాశ్వత వరదనీటి సమస్య పరిష్కారానికి రూ.110 కోట్లతో చేపట్టిన పనులు చివరిదశకు చేరాయి. మిషన్ భగీరథ పథకం ద్వారా తాగునీటి సరఫరాకు ఔటర్లోపలి గ్రామాలకు రూ. 200 కోట్లను వెచ్చించారు. రూ.400 కోట్లతో కొంపల్లిలో గేట్వే ఐటీ పార్క్ ఏర్పాటుకు భూమి పూజ చేసి టెండర్లను ఆహ్వానించారు. రూ.40 కోట్లతో మిషన్ కాకతీయ పథకంలో చెరువులు అభివృద్ధి చేశారు. రూ.183 కోట్ల నిధులతో పారిశ్రామివాడల్లో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. శామీర్పేట్ మం డలం అంతాయిపల్లిలో రూ.50 కోట్లతో సమీకృత కలెక్టరేట్ భవనాన్ని నిర్మించారు. ప్రజలకు పరిపాలనను అందుబాటులోకి తెచ్చారు. సీఎం కేసీఆర్ దత్తత గ్రామాలను రూ.69 కోట్ల నిధులతో అభివృద్ధి చేశారు. రోడ్లు, గ్రామపంచాయతీ భవనాలు, కమ్యూనిటీ హాళ్లను నిర్మించారు. కాళేశ్వరం జలాలతో జిల్లాలోని చెరువులను నింపారు. తద్వారా సుమారు 10వేల ఎకరాలకు సాగునీరు అందుతున్నది. స్థానిక ఎమ్మెల్యే, మంత్రి మల్లారెడ్డి చొరవతో నియోజకవర్గం అభివృద్ధి పథంలో సాగుతున్నది.
మున్సిపాలిటీ నిధులతో వైకుంఠధామాలు, పార్కులు, అండర్గ్రౌండ్ డ్రైనేజీలు, సీసీరోడ్లు, నూతన కాలనీల్లో మౌలిక సదుపాయాలను కల్పించారు. ఎమ్మెల్యే, ముఖ్యమంత్రి ప్రత్యేక నిధులతో ప్రజలకు అవసరమైన చోట అభివృద్ధి పనులు చేపట్టారు. నియోజకవర్గంలోని జవహర్నగర్, బొడుప్పల్, పీర్జాదిగూడ కార్పొరేషన్లు కాగా, మేడ్చల్, గుండ్లపోచంపల్లి, తూకుంట, దమ్మాయిగూడ, నాగారం, పోచారం, ఘట్కేసర్ మున్సిపాలిటీలు, మరో 61 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. మున్సిపాలిటీలతోపాటు గ్రామపంచాయతీల్లో ప్రజలకు అన్ని రకాల మౌలిక సదుపాయాలకు ఎమ్మెల్యే మల్లారెడ్డి నిధులు మంజూరు చేశారు. మౌలిక సదుపాయాలను కల్పించారు. అభివృద్ధితోపాటు అర్హులైన వారికి సంక్షేమ పథకాలు అందజేస్తున్నారు.