హైదరాబాద్, మార్చి 21 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ‘శోభకృత్’ నామ ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. వ్యవసాయ సంవత్సరంగా పరిగణించే ఈ ఉగాది.. రైతులకు, ప్రజలకు అన్ని రంగాల్లో శుభాలను చేకూర్చనున్నదని సీఎం కేసీఆర్ ఆశాభావం వ్యక్తంచేశారు.
తాగు, సాగు నీరు, పచ్చని పంటలతో తెలంగాణలో నిత్య వసంతం నెలకొన్నదని పేర్కొన్నారు. వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయడం ద్వారా దాని అనుబంధ రంగాలు, వృత్తులు బలపడి తెలంగాణ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్ఠమైనదని సీఎం కేసీఆర్ తెలిపారు. తెలంగాణ సాధించిన ప్రగతి దేశానికే ఆదర్శంగా నిలిచిందని స్పష్టంచేశారు. ‘శోభకృత్’ నామ సంవత్సరంలో తెలంగాణతో పాటు భారతదేశం మరింత గొప్పగా అభివృద్ధి సాధించాలని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు.