హైదరాబాద్, మార్చి 12 (నమస్తే తెలంగాణ): జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్యకు భారతరత్న ఇవ్వాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి లేఖ రాశారు. స్వతంత్ర భారతం 75వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్యను సత్కరించుకోవడం సముచితమని పేర్కొన్నారు. జాతీయ జెండాకు రూపకల్పన జరిగి వందేండ్లు పూర్తయిన సందర్భంగా పింగళి వెంకయ్య కుటుంబాన్ని శుక్రవారం ఏపీ సీఎం జగన్ కలిశారు. గుంటూరు జిల్లా మాచర్లలో నివసిస్తున్న ఆయన కుమార్తె ఘంటసాల సీతామహాలక్ష్మిని ఘనంగా సన్మానించారు. ఆమెకు రూ. 75 లక్షల ఆర్థిక సాయం మంజూరు చేశారు.
పింగళి ఏపీలోని కృష్ణా జిల్లా మచిలీపట్నం సమీపాన భట్ల పెనుమర్రు గ్రామంలో జన్మించారు. 19 ఏండ్ల వయస్సులో బ్రిటీష్ సైన్యంలో చేరి దక్షిణాఫ్రికాలో జరిగిన బోయర్ యుద్ధంలో పాల్గొన్నారు. అక్కడే గాంధీజీతో పరిచయం ఏర్పడింది. ఆయన రూపకల్పన చేసిన జాతీయ పతాకాన్ని 1916లో లక్నోలో జరిగిన జాతీయకాంగ్రెస్ సభలో ఆవిష్కరించారు. పలు మార్పుల తర్వాత 1921లో బెజవాడలో జరిగిన సభలో రాట్నం చిహ్నంగల త్రివర్ణ పతాకానికి తుదిరూపునిచ్చారు.