హైదరాబాద్, సెప్టెంబర్ 17 (నమస్తే తెలంగాణ): తిరుమల బ్రహ్మోత్సవాలకు ఆదివారం అంకురార్పణ చేశారు. సీఎం జగన్ ఏపీ ప్రభుత్వం తరపున సోమవారం శ్రీవారికి పట్టు వస్ర్తాలు సమర్పిస్తారు. సాయంత్రం నిర్వహించే ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. బ్రహ్మోత్సవాల్లో ఉదయం 8 నుంచి 10 గంటల వరకు, రాత్రి 7 నుంచి 9 గంటల వరకు వాహన సేవలు కొనసాగుతాయి. సోమవారం సాయంత్రం శ్రీమలయప్పస్వామివారి సమక్షంలో గరుడ ధ్వజాన్ని ఎగురవేస్తారు. తర్వాత రాత్రి 9 నుంచి 11 గంటల వరకు పెద్ద శేషవాహన సేవ ఉంటుంది. 22న గరుడ సేవ నేపథ్యంలో ఘాట్ రోడ్లలో ద్విచక్ర వాహనాల రాకపోకలు రద్దు చేశారు. ఆఖరి రోజైన 26న చక్రస్నానం వేడుకకు టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేసింది. సంయమనంతో స్నానమాచరించాలని టీటీడీ భక్తులకు విజ్ఞప్తి చేసింది. బ్రహ్మోత్సవాల వేళ సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇస్తామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు. ఆన్లైన్లో 1.30 లక్షల ప్రత్యేక దర్శన టికెట్లు, సర్వదర్శనం భక్తులకు 24 వేల ఉచిత టికెట్లు అందించనున్నట్టు తెలిపారు. బ్రహ్మోత్సవాలను 2 లక్షల మంది వీక్షించేలా ఏర్పాట్లు చేశామని చెప్పారు.