హైదరాబాద్ : ప్రముఖ కవి, గేయ రచయిత కందికొండ యాదగిరి మరణం పట్ల ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. గత కొద్దికాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న కందికొండ మృతికి సీఎం కేసీఆర్ సంతాపం తెలిపారు. తెలంగాణ సబ్బండ వర్గాల సంస్కృతిని తన పాట ద్వారా అజరామరంగా నిలిపిన, వరంగల్ బిడ్డ కందికొండ మరణం, తెలంగాణ సాహిత్య లోకానికి సబ్బండ వర్గాలకు తీరని లోటని సీఎం అన్నారు.
పాటల రచయితగా తెలుగు సినీ సాహిత్య రంగంలో తనదైన ముద్రను సృష్టించిన తెలంగాణ బిడ్డ కందికొండ అని సీఎం కేసీఆర్ స్మరించుకున్నారు. కందికొండను కాపాడుకునేందుకు ప్రభుత్వం పలు ప్రయత్నాలు చేసినా ఫలించకపోవడం దురదృష్టమని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు సీఎం కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.