చింతకాని, సెప్టెంబర్ 11: దళితబంధు పథకంతో దళితుల జీవితాల్లో వెలుగులు నిండనున్నాయని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఖమ్మం జిల్లా చింతకాని మండలం పొద్దుటూరు ఎస్సీకాలనీలో శనివారం జరిగిన కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రం లో దళితబంధు పథకం అమలుకు ప్రభు త్వం పైలట్ ప్రాజెక్టుగా నాలుగు ఎస్సీ నియోజకవర్గాల్లోని నాలుగు మండలాలను ఎంపిక చేసిందని గుర్తుచేశారు. వీటిలో మూడింటికి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తుండగా ఒకటి తన నియోజకవర్గం అని తెలిపారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యే లు ఉన్న ఎస్సీ నియోజకవర్గాలు ఇంకా అనేకం ఉన్నప్పటికీ ప్రభుత్వం మధిరను ఎంపిక చేయడం విశేషమని పేర్కొన్నారు. ఈ పథకం కింద పార్టీలకతీతంగా దళితులందరి ఖాతాల్లో రూ.10 లక్షలు పడతాయని చెప్పారు. పైరవీలు, సిఫారసులు లేకుండా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోనే డబ్బు పడేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసిందని తెలిపారు. ఈ డబ్బుతో వ్యాపారాలు చేసుకొని భవిష్యత్తుకు భరోసా ఏర్పరచుకోవాలని చెప్పారు. ఈ డబ్బును పెండ్లి చేయడానికి, ఇల్లు కట్టుకోవడానికి లేదా ఇతరమైనవాటికి ఖర్చు చేయవద్దని సూచించారు. ఈ డబ్బుతో అర ఎకరం భూమి లభిస్తే కొనుక్కోవచ్చని, ఆ భూమికి రైతుబంధు కూడా వస్తుందని తెలిపారు. దళితబంధు కోసం ఎవరికీ లంచాలు ఇవ్వాల్సిన అవసరం లేదని అన్నారు. చింతకాని మండలంలోని అన్ని దళిత కుటుంబాలతోపాటు రాష్ట్రమంతా పథకాన్ని విస్తరింపజేసి అమలుచేయాలని ప్రభుత్వాన్ని కోరినట్లు చెప్పారు. దళిత బంధు ద్వారా లబ్ధిదారుల ఖాతాల్లోకి డబ్బులు జమ కానున్నాయని, వాటిని ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఖర్చుచేసి బలోపేతం కావాలని కోరారు.