హైదరాబాద్, సెప్టెంబర్ 1 (నమస్తే తెలంగాణ): స్వాతంత్య్ర భారత వజ్రోత్సవాల ముగింపు కార్యక్రమం శుక్రవారం హైదరాబాద్ హెచ్ఐసీసీలో కన్నుల పండువగా సాగింది. హెచ్ఐసీసీ వేదికగా నిర్వహించిన ఈ వేడుకకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించిన అనంతరం సీఎం కేసీఆర్ జాతీయ పతాకాన్ని ఆవిషరించి, వందనం సమర్పించారు. జాతీయ గీతాలాపన చేశారు. వేదిక ముందు ఏర్పాటు చేసిన మహాత్మాగాంధీ విగ్రహానికి సీఎం పుష్పాంజలి ఘటించారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. వేడుకకు స్వాతంత్య్ర భారత వజ్రోత్సవాల కమిటీ చైర్మన్, ఎంపీ కే కేశవరావు, శాసనసభా స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, సీఎస్ శాంతికుమారి, డీజీపీ అంజనీకుమార్ తదితరులు హాజరయ్యారు.
స్వాతంత్య్ర పోరాట స్ఫూర్తిని నింపేలా: సీఎస్ శాంతికుమారి
ఈ వజ్రోత్సవాలతో స్వాతంత్య్ర పోరాట స్ఫూర్తిని, చైతన్యదీప్తిని భావితరాలకు తెలియచేసే గొప్ప ప్రయత్నాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేసిందని సీఎస్ శాంతికుమారి స్వాగత ఉపన్యాసంలో పేర్కొన్నారు. దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా నిరుడు ఆగస్టు 8న ప్రారంభించి ఏడాదికి పైగా అనేక కార్యక్రమాలను, ఉత్సవాలను నిర్వహించామని చెప్పారు. మహనీయుల పోరాటస్ఫూర్తి, ఈ తరాలకు తెలపాలనే ఆశయంతో సీఎం కేసీఆర్ ఆదేశాలతో ‘జాతిపిత’ గాంధీ మహాత్ముని సినిమాను అన్ని థియేటర్లలో ఉచితంగా ప్రదర్శించామని గుర్తుచేశారు. రికార్డుస్థాయిలో సుమారు 35 లక్షల మంది విద్యార్థులు, ఇతరులు ‘గాంధీ’ సినిమాను చూసి ప్రేరణ పొందారని వెల్లడించారు. దాదాపు 2.40 కోట్ల జాతీయ జెండాలను ఉచితంగా ఇంటింటికీ పంపిణీ చేశామని పేర్కొన్నారు. ఈ ముగింపు సంబురంలో ఆగస్టు 26న 1.30 కోట్ల మొకలు నాటడంతోపాటు ఫ్రీడం పారులలో కూడా పెద్ద ఎత్తున మొకల నాటామని వివరించారు. స్వాతంత్య్ర సమరయోధులనూ, వారి కుటుంబాలను సన్మానించడం ద్వారా వారి త్యాగాలు స్మరించుకున్నామని, ఫ్రీడం ర్యాలీలు, కళాప్రదర్శనలు, సామూహిక గేయాలాపనలు, క్రీడా, సాంసృతిక, సాహిత్య కార్యక్రమాలను ఘనంగా నిర్వహించామని తెలిపారు. తెలంగాణ అన్ని రంగాల్లో అద్భుత ప్రగతి సాధించిందని, 2014లో రూ.1,12,162 ఉన్న తలసరి ఆదాయం, ప్రస్తుతం రూ. 3,17,115 పెరిగిందని, 2014లో రూ.5.06 లక్షల కోట్లు ఉన్న జీఎస్డీపీ నేడు రూ.13.13 లక్షల కోట్లకు పెరిగిందని సీఎస్ శాంతికుమారి వివరించారు.
అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు
తెలంగాణ భాషా సాంసృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, సంగీత నాట క అకాడమీ ఆధ్వర్యంలో దాదాపు గంటన్నరపాటు పలు సాంసృతిక కార్యక్రమాలు నిర్వహించారు. అత్యంత శోభాయమానంగా ప్రదర్శించిన సాంసృతిక కార్యక్రమాలు దేశ ఔనత్యాన్ని చాటు తూ తెలంగాణ ప్రగతికి అద్దం పట్టాయి. ముందుగా.. వారోత్సవాల ముగింపు సందర్భంగా రాష్ట్ర సమాచార శాఖ రూపొందించిన షార్ట్ ఫిల్మ్ను ముఖ్యమంత్రి కేసీఆర్ వీక్షించారు. అనంతరం.. రాఘవాచారి బ్రదర్స్ నిర్వహించిన ‘రఘుపతి రాఘవ రాజారాం’ అనే గానంతో సంగీత విభావరి ప్రారంభమైంది. ఆయాచితం నటేశ్వరశర్మ రాసిన ‘తెలంగాణ అవతరణం తెలంగాణ అవతరణం.. తొలిపొద్దు నవకిరణం.. భరత మాత ఆభరణం’ అం టూ సాగిన నృత్య ప్రదర్శన.. కాళేశ్వరం ప్రాజెక్టుతోపాటు దళితబంధు, రైతుబంధు వంటి పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు, రాష్ట్ర అభివృద్ధి కార్యక్రమాలను వర్ణిస్తూ నృత్య రూపకం సాగింది. కూచిపూడి, భరత నాట్యం, పేరిణి, మోహినీ అట్టంతోపాటు ఆరు రకాల భారతీయ నృత్యరీతులతో కూడిన ఏక ప్రదర్శన ఇచ్చారు. మొత్తంగా వజ్రోత్సవాల ముగింపు వేడుకల సందర్భంగా ఆయా సాంసృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. చివరలో సీఎం కేసీఆర్ వజ్రోత్సవ వేడుకల ముగింపు సందేశాన్ని అందించారు.