హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పీవీ నరిసింహారావు వెటర్నరీ యూనివర్సిటీ దేశానికే ఆదర్శంగా నిలువనుందని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. రాజేంద్రనగర్లోని పీవీ నరసింహారావు వెటర్నరీ యూనివర్సిటీ ఆవరణలో నూతనంగా రూ. 12.75 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన మోడ్రన్ వెటర్నరీ క్లినికల్ కాంప్లెక్స్ను మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి కలిసి మంగళవారం ప్రారంభించారు. అనంతరం నూతనంగా ఏర్పాటు చేసిన అత్యాధునిక వైద్య పరికరాలను పరిశీలించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. ఉమ్మడి రాష్ట్రంలో తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర పశువైద్య విశ్వ విద్యాలయంలో పశువైద్య సంబంధ కోర్సుల విద్యను అభ్యసించేవారని తెలిపారు. దీనిని దృష్టిలో ఉంచుకొని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 5 నెలల్లోనే పీవీ నరసింహారావు పేరుతో వెటర్నరీ యూనివర్సిటీ ని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఈ యూనివర్సిటీలో అనేకమంది పశువైద్యులను తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు.
నూతనంగా నిర్మించిన వెటర్నరీ క్లినికల్ కాంప్లెక్స్లో మెడిసిన్, గైనకాలజీ, డయాగ్నసిస్ ల్యాబ్, స్మార్ట్ క్లాస్ రూమ్స్ అన్ని ఒకే భవనంలో విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని తెలిపారు. త్వరలో ఎండోస్కోపీ, స్కానింగ్, బ్లడ్ బ్యాంక్ అందుబాటులోకి తీసుకురానున్నట్లు చెప్పారు. ఇతర రాష్ట్రాల విద్యార్ధులను సైతం ఆకర్షించే విధంగా అత్యాధునిక పరికరాలతో కూడిన వెటర్నరీ క్లినికల్ కాంప్లెక్స్ను ఏర్పాటు చేసిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికే దక్కుతుందని అన్నారు.
ఈ క్లినికల్ కాంప్లెక్స్ వలన పశువులు, చిన్న జీవాలు, పెట్స్ వంటి తదితర జీవాలకు అన్ని రకాల వైద్య సేవలు, ఇన్సెంటివ్ కేర్ యూనిట్లు అందుబాటులో ఉంటాయని చెప్పారు. ఇది పశువైద్య విద్యను అభ్యసిస్తున్న విద్యార్ధులు, జీవాల పెంపకం దారులకు అందరికీ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. రానున్న రోజులలో పశువైద్య రంగ నిపుణులు, పరిశోధకులకు ఎంతో ప్రయోజనకారిగా మారుతుందని చెప్పారు.
ఈ యూనివర్సిటీకి అనుబంధంగా వరంగల్ జిల్లా మామునూరు, జగిత్యాల జిల్లా కోరుట్లలో వెటర్నరీ సైన్స్ కళాశాలలు, వనపర్తి జిల్లా పెబ్బేరులో మత్స్య కళాశాలలను ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తుచేశారు. వీటికి అదనంగా నూతనంగా కరీంనగర్, మహబూబ్ నగర్, వరంగల్, సిద్ధిపేట ప్రాంతాలలో వెటర్నరీ పాలిటెక్నిక్ కళాశాలలు, లైవ్ స్టాక్ రీసెర్చ్ సెంటర్లు, ఫిషరీస్ రీసెర్చ్ సెంటర్లు, పౌల్ట్రీ సీడ్స్ సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.
పశువైద్యుల కొరతను అధిగమించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవతో సిద్ధిపేట, నిజామాబాద్, నల్లగొండ తదితర ప్రాంతాలలో నూతనంగా వెటర్నరీ కళాశాలలను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకొని మంచి విద్యావంతులుగా అభివృద్ధి సాధించాలని పశువైద్య విద్యనూ అభ్యసిస్తున్న విద్యార్ధులకు మంత్రి పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్రం అన్ని రంగాలలో ఎంతో అభివృద్దిని సాధించిందని చెప్పారు. జీవాలకు అందించే వైద్య సేవలలో గణనీయమైన మార్పులు తెలంగాణ రాష్ట్రంలోనే తీసుకొచ్చినట్లు తెలిపారు. ఈ సమావేశంలో చేవెళ్ళ ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్సీ సురభి వాణిదేవి, షీఫ్ ఫెడరేషన్ చైర్మన్ దూదిమెట్ల బాలరాజ్ యాదవ్, డైరీ చైర్మన్ సోమా భరత్ కుమార్, జడ్పీ చైర్మన్ అనిత, పశుసంవర్ధక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ ఆదార్ సిన్హా, మత్స్య శాఖ కమిషనర్ లచ్చిరాం బూక్యా, పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ రాంచందర్ యూనివర్సిటీ వైస్ చాన్స్ లర్ రవీందర్ రెడ్డి, రిజి స్ట్రార్ వీరోజిరావు, మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.