ఏటూరునాగారం, ఫిబ్రవరి 5: ఎస్సీ లబ్ధిదారులకు గత ప్రభుత్వం మంజూరు చేసిన దళితబంధు నిధులను వెంటనే విడుదల చేసి ఖాతాల్లో జమ చేయాలని కోరుతూ ఆ పథకం లబ్ధిదారులు ములుగు జిల్లా ఏటూరునాగారంలోని బస్టాండు సెంటర్లోని ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహం ఎదుట సోమవారం నిరాహార దీక్ష చేపట్టారు. ఈ నెల 8న నిర్వహించే అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వం దళితబంధు పథకంపై స్పష్టమైన ప్రకటన చేయాలని లబ్ధిదారుల సంఘం జిల్లా అధ్యక్షుడు కోగిల మహేశ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు దీక్షలో పాల్గొన్న ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో పెట్టిన విధంగా అంబేద్కర్ అభయహస్తం పథకం కింద రూ.12 లక్షలను లబ్ధిదారులకు విడుదల చేయాలని కోరారు. లేనిపక్షంలో అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు.
రాజకీయ పార్టీలు దళితుల పట్ల అంకితభావంతో పనిచేయాలని సూచించారు. అన్యాయం చేయాలని చూస్తే పార్లమెంట్ ఎన్నికల్లో తమ బలం చూపిస్తామని హెచ్చరించారు. పెండింగ్ లేకుండా 30 వేల మంది లబ్ధిదారులకు నిధులు విడుదల చేసేలా నూతన ప్రభుత్వం జిల్లా యంత్రాంగానికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలని కోరారు. ములుగు జిల్లాలో రెండో విడత 1,100 మంది లబ్ధిదారుల ఖాతాల్లో వెంటనే నిధులు జమచేయాలని కోరారు. నిరాహార దీక్షలో జిల్లా కార్యదర్శి మడికిండ రమేశ్, గౌరవ సలహాదారుడు చిట్టిమల్ల సమ్మయ్య, గోవిందరావుపేట మండల కమిటీ అధ్యక్షుడు దర్శనాల సంజీవ, సలహాదారుడు చుక్క గట్టయ్య, జిల్లా, మండల కమిటీ నాయకులతో పాటు సుమారు 50 మంది లబ్ధిదారులు పాల్గొన్నారు. పీఏసీఎస్ చైర్మన్ కూనూరు అశోక్, బీఆర్ఎస్ మండల శాఖ అధ్యక్షుడు గడదాసు సునీల్, నాయకులు దన్నపునేని కిరణ్, అంతటి నాగరాజు తదితరులు దీక్షకు మద్దతు ప్రకటించారు.