Mission Bhagiratha | మెదక్, జూన్ 17 (నమస్తే తెలంగాణ): సమైక్య పాలకుల హయాంలో గుకెడు మంచినీటికి తహతహలాడిన పల్లెలు ప్రస్తుతం శుద్ధమైన నీటిని తాగుతున్నాయి. సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన మిషన్ భగీరథ పథకంలో భాగంగా మెదక్ జిల్లాలోని అన్ని గ్రామాల్లో ఇంటింటికీ నల్లా నీళ్లు సరఫరా అవుతున్నాయి. తెలంగాణ ఏర్పాటు తర్వాత తీసుకున్న విప్లవాత్మక నిర్ణయంతో ప్రస్తుతం నదీజలాలను శుద్ధిచేసి ప్రజలకు అందిస్తున్నారు. జిల్లాలోని ప్రతి పల్లెకూ, ప్రతి తండాకూ స్వచ్ఛమైన తాగునీరు నల్లాల ద్వారా నిరంతరాయంగా అందుతున్నది. మహిళలు బిందెలు పట్టుకొని పొలాల వద్దకు, ఊరు శివారు ప్రాంతాలకు, రోడ్లెకి నిరసన తెలిపిన రోజులు పోయాయి. ఇప్పుడు ఇంటి ముందుకే తాగునీరు వస్తుండడంతో మహిళలు సంతోషం వ్యక్తంచేస్తూ సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.
మిషన్ భగీరథ పథకంతో నీటి కష్టాలు దూరం..
ప్రజలకు స్వచ్ఛమైన తాగునీటిని అందించాలనే లక్ష్యంతో ప్రారంభించిన మిషన్ భగీరథ పథకంతో గ్రామాల్లో తాగునీటి కష్టాలు తొలిగాయి. రాష్ట్రం ఏర్పడక ముందు మెదక్ జిల్లాలోని మారుమూల తండాలతోపాటు గ్రామాల్లో తాగునీటి కోసం పడరాని పాట్లు పడేవారు. ఎండాకాలం, వానకాలం అనే తేడా లేకుండా నీటి కోసం ఇబ్బందులు పడేవారు. వ్యవసాయ బోరుబావుల నుంచి, వాగుల్లోని చెలిమెల నుంచి తాగేందుకు నీటిని తెచ్చుకునే వారు. తెలంగాణ వచ్చాక సీఎం కేసీఆర్ ప్రారంభించిన మిషన్ భగీరథ పథకంతో ప్రస్తుతం మెదక్ జిల్లాలోని 469 గ్రామాలతోపాటు నాలుగు మున్సిపాలిటీల్లో ప్రతి ఇంటికీ నల్లాల ద్వారా శుద్ధమైన తాగునీరు సరఫరా అవుతుంది.
మిషన్ భగీరథ పథకం ముఖ్యఉద్దేశం…
మిషన్ భగీరథ పథకం ముఖ్యఉద్దేశం తాగునీటి సమస్యను పరిష్కరించడం, గ్రామాల్లో ప్రతి ఇంటికీ నల్లాలు ఏర్పాటు చేయడం, ప్రస్తుతం ఉన్న తాగునీటి వ్యవస్థను మరింత మెరుగుపర్చాలి. అలాగే అవసరమైన చోట అదనపు బోర్లు వేసి పైపులైన్ ఏర్పాటు చేయడంతోపాటు మిషన్ భగీరథ ట్యాంకులు నిర్మించడం, ప్రతి ఇంటికీ నల్లా కనెక్షన్లు ఏర్పాటు చేసి స్వచ్ఛమైన తాగునీరు అందించడం.
గతంలో రోడ్లపై ధర్నాలు..
ఉమ్మడి రాష్ట్రంలో పలు గ్రామాల్లో మహిళలు ఖాళీ బిందెలతో రోడ్లపై బైఠాయించి నిరసన తెలిపిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. ఉన్న కొద్దిపాటి కుళాయిలు, చేతిపంపుల వద్ద నీటి కోసం మినీయుద్ధాలు (కొట్లాటలు) జరిగేవి. సీఎం కేసీఆర్ మిషన్ భగీరథ పథకం ప్రకటించిన అనంతరం పనులు పూర్తి చేసి క్రమంతప్పకుండా ఇంటింటికీ స్వచ్ఛమైన నీటిని అందిస్తున్నారు. దీంతో మహిళలు రోడ్డెకాల్సిన అవసరం లేకుండా పోయింది. గడప దగ్గర ఉదయాన్నే నల్లా తిప్పితే జలసిరులు కురుస్తున్నాయి. దీంతో మహిళలు సంతోషపడుతూ..సీఎం కేసీఆర్ పాలనపై హర్షం వ్యక్తం చేస్తున్నారు.
గ్రామగ్రామానికీ భగీరథ..
మిషన్ భగీరథ పథకం ద్వారా జిల్లాలోని అన్ని గ్రామాలకు తాగునీరు సరఫరా అవుతున్నది. ప్రతిఒకరికీ 100 లీటర్ల స్వచ్ఛమైన నీటిని అందించాలనే లక్ష్యంతో ప్రారంభించిన మిషన్ భగీరథ పథకం ద్వారా జిల్లాలోని 469 గ్రామాలకు 4535.48 కిలోమీటర్ల గ్రిడ్, అంతర్గత పైపులైన్ వేశారు. దీంతోపాటు 668 తాగునీటి సరఫరా ట్యాంకులను నూతనంగా నిర్మించారు. 192857 నల్లా కనెక్షన్లు ఇచ్చారు.
అప్పట్లో గోసపడ్డం
తాగునీటికి అప్పట్లో గోస పడ్డం. మంచినీళ్లు తెచ్చుకోవాలంటే వరి పొలాల్లో కిందపడుతూ లేస్తూ కిలోమీటర్లు నడిచి తెచ్చుకునేటోళ్లం. ఇంట్లో నీళ్లు అయిపోతే భయం పుట్టేది. ఇంట్లోకి నీళ్లు తెచ్చుకోవాలంటే ఓ సాహసమే చేయాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు సీఎం కేసీఆర్ పుణ్యమా అని మా కష్టాలు తీరిపోయాయి. మిషన్ భగీరథ నీళ్లు ఇంటి ముందరకే వస్తున్నాయి. ఉదయం లేవగానే సరిపడా నీళ్లు వస్తున్నాయి. గ్రామాల్లో మహిళలు ఇబ్బంది పడవద్దనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ మిషన్ భగీరథ నీళ్లు ఇస్తున్నాడు. ఆయనకు ఎప్పుడూ రుణపడివుంటాం.
– కర్రె బాలమణి, నర్సాపూర్
నాడు..
తెలంగాణ రాకముందు చేద బావులు ఇంటి నీటి అవసరాలకు ఆధారాలుగా ఉండేవి. గ్రామస్తులు చేతిపంపుల దగ్గరకెళ్లి నీళ్లుతెచ్చుకునే వాళ్లు. చేతిపంపు నీళ్లు తెచ్చుకోవడం ఇబ్బందిగా ఉండేది. ఆ తర్వాత పైపు నీటి సరఫరా పథకాలు(ఎస్వీఎస్/పీడబ్ల్యుఎస్) ప్రవేశపెట్టారు. ఇక్కడ బోరునీటిని ఓహెచ్ఎస్ఆర్కి పంపు చేసేవారు. పబ్లిక్ స్టాండ్ పోస్టులు, జీఎల్ఎస్ఆర్ ద్వారా నీటిని గృహాలకు సరఫరా చేసేవారు. కానీ, ఆ నీటిని శుద్ధి లేదా ఫిల్టర్ చేసేవారు కాదు. మూలాలు ఎండిపోయినప్పుడల్లా, వ్యవసాయ/వాణిజ్య బోరు బావుల నుంచి నీటిని రవాణా చేసేవారు. ఈ నీటి కోసం గ్రామస్తులు ఎదురుచూసే పరిస్థితులు ఉండేవి. ఆ తర్వాత సమీపంలోని నది, ఉపరితల నీటిని శుద్ధి కర్మాగారాలుకు పంప్చేయడంతో సమగ్ర నీటి సరఫరా పథకాలు ప్రవేశపెట్టారు. ఇక్కడ శుద్ధి చేసి జిల్లాలోని కొన్ని నివాస ప్రాంతాలకు మాత్రమే ఫిల్టర్ చేసి సరఫరా చేస్తుండేవారు.
నేడు..
మెదక్ జిల్లాలో 20 మండలాలు… రూ.1005.57 కోట్లతో పనులు..మిషన్ భగీరథ పథకం కింద మెదక్ జిల్లాలోని 20 మండలాలకు సింగూరు, మంజీరా లేదా హెచ్ఎండబ్ల్యుఎస్ఎస్బీ(గోదావరి) నీటిని శుద్ధి చేసి సరఫరా చేస్తున్నారు. ఇందుకు రూ.1005.57 కోట్లతో పనులు పూర్తయ్యాయి. ఈ పథకంలో 668 నీటి ట్యాంకులు (ఓహెచ్ఎస్ఆర్)లు, 26 ఓహెబీర్లు, 13 సంపులు, 14 పంపింగ్ స్టేషన్లు నిర్మించారు. 4535.48 కిలోమీటర్ల గ్రిడ్, అంతర్గత పైపులైన్ వేసి, 1,92,857 నల్లా కనెక్షన్లు ఇచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లోని 873 పాఠశాలలు, 974 అంగన్వాడీలు ఎంబీ ట్యాప్ కనెక్షన్లతో అనుసంధానించారు. 76 రైతు వేదికలు ఎంబీ ట్యాప్ కనెక్షన్లతో అనుసంధానించారు. జిల్లాలో పూర్తయిన అన్ని డబుల్ బెడ్రూం ఇండ్లకు కూడాఎంబీ నీటితో అనుసంధానించారు. జిల్లాలోని 469 వైకుంఠధామాలకు నీటి కనెక్షన్లు అందించడం చివరి దశకు చేరుకుంది.