హైదరాబాద్, జూలై 5 (నమస్తే తెలంగాణ): జీవో-111 మార్గదర్శకాలపై మరో 15 రోజు ల్లో స్పష్టత వస్తుందని ఐటీ, పురపాలక శాఖల మంత్రి కే తారకరామారావు తెలిపారు. ఈ జీవో పరిధిలో దాదాపు 1.32 లక్షల ఎకరాల విస్తీర్ణం ఉన్నందున ఇప్పుడున్న నగరానికి సమానంగా మరో కొత్త నగరం ఏర్పటయ్యే వీలున్నదని పేర్కొన్నారు. బుధవారం పట్టణాభివృద్ధిశాఖ ప్రగతి నివేదికను విడుదల చేస్తున్న సందర్భంగా మీడియా అడిగిన ప్రశ్నలకు మం త్రి కేటీఆర్ స్పందిస్తూ.. ‘జీవో-111ను రద్దు చేశాం. ఈ అంశాన్ని ప్రధాన రాజకీయ పార్టీలన్నీ 2018 ఎన్నికల మ్యానిఫెస్టోలో పెట్టాయి.
మేము కూడా చెప్పాం. ఈ మేరకు రద్దు చేశాం. ఇప్పుడు నిర్మాణ అనుమతులపై గైడ్లైన్స్ ఇవ్వాల్సి ఉన్నది. ఈ జీవో పరిధిలో 1.32 ల క్షల ఎకరాలు బయోకన్జర్వేషన్ జోన్లో ఉన్నది. ఎక్కడ రోడ్లు నిర్మించాలి? ఎక్కడ నిర్మాణాలకు అనుమతులు ఇవ్వాలి? ఎక్కడ పార్కులు ఏర్పాటుచేయాలి? అనే విషయంపై ప్లానింగ్ విభాగం నిపుణులు కసరత్తు చేస్తున్నారు. ఈ ప్రక్రియ కొనసాగుతున్నది. మరో 15 రోజుల్లో అధికారులు దీనిపై ఓ నిర్ణయం తీసుకుంటారు’ అని వివరించారు.
జంట జలాశయాలు కాలు ష్యం బారిన పడకుండా రూ.85 కోట్లతో సీవరేజి ట్రీట్మెంట్ ప్లాంట్లను నిర్మించేందుకు టెం డర్లు పిలిచామని వెల్లడించారు. కొండపోచమ్మసాగర్ ద్వారా ముత్తంగి మీదుగా గ్రావిటీతో హైదరాబాద్కు మంచినీటిని సరఫరా చేయాలనే ఆలోచన ఉన్నదని చెప్పారు. ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ రింగ్మెయిన్ నిర్మిస్తున్నామని, ఇప్పటికే 48 కిలోమీటర్లు పూర్తయిందని తెలిపారు. దీంతో నగరంలో ఎక్కడి నుంచైనా నీళ్లు తరలించే వీలు కలుగుతుందని వివరించారు.
భారీ ప్రణాళికలు
హైదరాబాద్ నగరానికి రూ.11-12 వేల కోట్లతో సమగ్ర మురుగునీటి పారుదల వ్యవస్థను ఏర్పాటు చేయాల్సి ఉన్నదని కేటీఆర్ తెలిపారు. ఎస్సార్డీపీలో భాగంగా ఇంకో రూ. 5,000 కోట్లతో పనులు చేపట్టాల్సి ఉన్నదని, రూ.10,000 కోట్లతో మూసీ సుందరీకరణతోపాటు మూసీపై వెస్ట్-ఈస్ట్ ఎక్స్ప్రెస్వే నిర్మించాల్సి ఉన్నదని వివరించారు. హైదరాబాద్లో ప్రజారవాణా వ్యవస్థను మెరుగుపర్చడంతోపాటు పాతబస్తీకి మెట్రోరైలు ప్రాజెక్టును పూర్తిచేయాల్సి ఉన్నదని పేర్కొన్నారు.
ఎయిర్పోర్టుకు మెట్రో రైలును విస్తరిస్తే 101 కిలోమీటర్లకు పెరుగుతుందని, దీనిని 250 కిలోమీటర్లకు విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. మెట్రో ప్రయాణికుల సంఖ్యను 15 లక్షల పెంచాలని నిర్ణయించామని తెలిపారు. 3,800 బస్సులను ఎలక్ట్రిఫై చేయాలన్నది లక్ష్యమని మొదటి దశలో వెయ్యిఎలక్ట్రిక్ బస్సులు రాబోతున్నాయని చెప్పారు. మంచినీళ్లు, రోడ్లు, విద్యుత్తు, ఫ్లైఓవర్లు తదితర అంశాల్లో ఇంకా చేయాల్సింది ఉన్నదని పేర్కొన్నారు. భవిష్యత్తులో 24 గం టలూ మంచినీటి సరఫరా చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు.
డల్లాస్ చేస్తామంటే నవ్వారు
‘సినీనటుడు రజినీకాంత్ హైదరాబాద్ నగ రం న్యూయార్క్లాగా ఉన్నదని ప్రశంసించా రు. సీఎం కేసీఆర్ హైదరాబాద్ను డల్లాస్ మా దిరిగా చేస్తానంటే కొందరు నవ్వారు. ఇప్పుడు ఏమంటరు?’ అయినా ఇంకా చేయాల్సింది చాలా ఉన్నది. మేము రియలిస్టిక్ పీపుల్. మాది రియలిస్టిక్ గవర్నమెంట్. ఉప్పల్లో మాదిరి మెహిదీపట్నంలో త్వరలో స్కైవాక్ను నిర్మిస్తాం అని కేటీఆర్ పేర్కొన్నారు.
కేంద్రమంత్రులు మారినా భూములు రాలె
హైదరాబాద్లో స్కైవేల నిర్మాణం కోసం రక్షణశాఖ భూములు ఇవ్వాలని కేంద్రాన్ని అనేకసార్లు కోరామని, అరుణ్జైట్లీ, సుష్మాస్వరాజ్, మనోహర్ పారికర్, నిర్మలా సీతారామన్, రా జ్నాధ్సింగ్ ఇలా రక్షణశాఖకు ఐదుగురు కేంద్ర మంత్రులు మారినా సమస్య పరిష్కారం కాలేదని కేటీఆర్ ఆవేదన వ్యక్తంచేశారు. తన నియోజకవర్గం పరిధిలోనే ఉన్నప్పటికీ రక్షణశాఖకు సహాయ మంత్రిగా పనిచేసిన కిషన్రెడ్డి కూడా ఈ విషయంలో ఏమీ చేయలేదని అసంతృప్తి వ్యక్తంచేశారు. ‘భవిష్యత్తులో మాకు స హకరించే కేంద్ర ప్రభుత్వం వస్తే వారితో సా ధించుకుంటాం. ఈ ప్రభుత్వం పోతదని ఆశిస్తున్నాం’ అని కేటీఆర్ పేర్కొన్నారు. కంటోన్మెంట్లో మంచినీరు అందిస్తున్నామని, రోడ్లు వేస్తున్నామని, కంటోన్మెంట్ను జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని కేంద్రాన్ని కోరారు.