BRS | హైదరాబాద్, సెప్టెంబర్ 13 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ గుండెలు ఉప్పొంగే ప్రతి సందర్భంలోనూ గులాబీ శ్రేణులు చరిత్రాత్మక పాత్రను పోషిస్తాయని నిరూపించేందుకు మరోసారి సిద్ధమవుతున్నాయి. విష జ్వరాలకే నాడు వణికిన తెలంగాణ నేడు అత్యాధునిక వైద్యానికి చిరునామా మారిన తీరును సమాజానికి వివరించనున్నాయి. దశాబ్దాల పాలమూరు నీటి కలను నిజం చేసిన సందర్భాన్ని రాష్ట్ర ప్రజలు కండ్ల ముందు పెట్టనున్నాయి. జాతీయ సమైక్యతా దినోత్సవ ప్రాధాన్యం, పేదలకు సొంతింటి కలను నిజం చేసిన సీఎం కేసీఆర్ విజన్ను తెలంగాణ ఎదుట సాక్షాత్కరించనున్నాయి. ఈ నెల 15 నుంచి 21 వరకు వరుస కార్యక్రమాలతో ప్రజలతో మమేకమయ్యేందుకు బీఆర్ఎస్ శ్రేణులు కార్యాచరణ రూపొందించుకున్నాయి.
కొత్తగా ఏర్పాటు చేసిన 9 మెడికల్ కాలేజీల్లో తరగతులను 15న సీఎం కేసీఆర్ ఏకకాలంలో ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని మంత్రులు కేటీఆర్, హరీశ్రావు శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. కాలేజీలు ప్రారంభం కానున్న కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, జయశంకర్ భూపాలపల్లి, కుమ్రంభీం ఆసిఫాబాద్, నిర్మల్, రాజన్న సిరిసిల్ల, వికారాబాద్, జనగామ జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలతో మంత్రులు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయా జిల్లా కేంద్రాల్లో 15 వేల నుంచి 20 వేల మందితో భారీ ర్యాలీలు నిర్వహించేందుకు ఆయా జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు సన్నద్ధం అవుతున్నారు.
16న ‘పాలమూరు’ ప్రాజెక్టు కోసం తెలంగాణ వేయి కన్నులతో ఎదురుచూస్తున్నది. పాలమూరు ఎత్తిపోతల ప్రారంభ కార్యక్రమాన్ని ప్రభుత్వమే నిర్వహిస్తున్నది. ఈ కార్యక్రమ విజయవంతానికి ఉమ్మడి పాలమూరు, రంగారెడ్డి జిల్లాల పరిధిలోని ప్రజాప్రతినిధులు, పార్టీ ప్రతినిధులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రాజెక్టును సీఎం కేసీఆర్ ప్రారంభించిన తెల్లారి (ఈ నెల 17న) ఉమ్మడి మహబూబ్నగర్, రంగారెడ్డి జిల్లాల్లోని ప్రతి పల్లె నుంచి సర్పంచులు, ఇతర స్థానిక ప్రజాప్రతినిధులు కలశాలతో కృష్ణమ్మ నీటిని ఊరేగింపుతో తెచ్చి గ్రామాల్లోని దైవాల పాదాలకు అభిషేకం చేయాలని సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేయటంతో పార్టీ శ్రేణులు అందుకోసం ప్రజలను సమాయత్తం చేస్తున్నాయి.
భారత యూనియన్లో తెలంగాణ విలీనమైన సందర్భాన్ని పురస్కరించుకొని 17న అన్ని జిల్లాల్లో కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు సాగుతున్నాయి. హైదరాబాద్లో సీఎం కేసీఆర్, ఇతర 32 జిల్లాల్లో జెండావిష్కరణ కార్యక్రమాలను చేయనున్నారు. 21న హైదరాబాద్లో రూ.50 నుంచి 60 వేల కోట్ల విలువ చేసే (మార్కెట్ విలువ ప్రకారం) డబుల్బెడ్రూం ఇండ్లను ఇండ్లులేని నిరుపేదలకు పంపిణీ చేయనున్నది. మొత్తానికి ప్రతి సందర్భంలో బీఆర్ఎస్ శ్రేణులు అటు ప్రభుత్వానికి ఇటు ప్రజలకు మధ్య సంధానకర్తగా వ్యవహరిస్తుండటం విశేషం.