న్యూఢిల్లీ, జూలై 17: దేశంలోని అన్ని యూనివర్సిటీలు, కాలేజీల్లో అక్టోబర్ 1 నుంచి కొత్త విద్యా సంవత్సరానికి తరగతులు ప్రారంభమవుతాయని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) తెలిపింది. సెప్టెంబర్ 30నాటికి అన్ని కాలేజీల్లో డిగ్రీ, పీజీ అడ్మిషన్ల ప్రక్రియను పూర్తి చేయాలని సూచించింది. విద్యార్థులకు చివరి ఏడాది పరీక్షలను ఆగస్టు 31లోపు తప్పనిసరిగా నిర్వహించాలని ఆదేశించింది. ఈ మేరకు 2021-22 విద్యాసంవత్సరానికి సంబంధించి కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ, ఆయా రాష్ర్టాల బోర్డు ఫలితాలు విడుదల అయ్యాకనే అండర్గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాల ప్రక్రియను మొదలుపెట్టాలన్న యూనివర్సిటీలు, ఉన్నతవిద్యా సంస్థల విజ్ఞప్తులను ఈ మేరకు పరిగణనలోకి తీసుకున్నట్టు తెలిపింది. ‘జూలై 31లోపు 12వ తరగతికి సంబంధించిన ఫలితాలను అన్ని స్కూల్ బోర్డులు ప్రకటిస్తాయని భావిస్తున్నాం. ఒకవేళ ఈ ఫలితాల్లో జాప్యం జరిగితే, ఆయా విద్యాసంస్థలు కొత్త విద్యాసంవత్సరాన్ని అక్టోబర్ 18 నుంచి ప్రారంభించుకోవచ్చు’ అని యూజీసీ వివరించింది.