నవాబుపేట, మార్చి 22: ఓ ఉపాధ్యాయుడి నిర్వాకానికి తొమ్మిదో తరగతి విద్యార్థి బలయ్యాడు. 20 లీటర్ల క్యాన్లో నీళ్లు తేవాలని బైక్ ఇచ్చి పంపడంతో రోడ్డు బారిన పడి మరణించాడు. అతడి వెంట ఉన్న మరో విద్యార్థి గాయాలపాలయ్యాడు. ఈ ఘటన వికారాబాద్ జిల్లా నవాబుపేట మండలంలో జరిగింది. అర్కతల గ్రామానికి చెందిన కొత్తగాడి కార్తీక్ (14) తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. శుక్రవారం పాఠశాలకు వెళ్లిన తర్వాత ఇంగ్లిష్ టీచర్ బుచ్చిరెడ్డి మంచినీళ్లు తేవాలంటూ వాటర్ బబుల్ ఇచ్చి కార్తీక్, వేణును పంపాడు. వీరికి బైక్ ఇచ్చాడు. విద్యార్థులు ప్రయాణిస్తున్న బైక్ను ఆర్టీసీ బస్సు ఢీ కొట్టడంతో కార్తీక్, వేణు ఇద్దరు కూడా కిందపడిపోయారు. తీవ్రంగా గాయపడిన కార్తీక్ చికిత్స పొందుతూ మృతిచెందాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.