హైదరాబాద్ : ఇంటర్నల్ అసెస్మెంట్ మార్కుల ఆధారంగా పదో తరగతి విద్యార్థులకు ప్రభుత్వం గ్రేడ్లు ప్రదానం చేయనుంది. ఈ మేరకు ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. పదో తరగతి విద్యార్థులకు 20 శాతం మార్కులను ఇంటర్నల్ అసెస్మెంట్గా నిర్వహించే విషయం తెలిసిందే. ఈ 20 శాతాన్ని ప్రస్తుతం 100 శాతానికి స్కేల్ చేయనున్నారు.
కరోనా సెకండ్ వేవ్ ఉధృతి నేపథ్యంలో ప్రభుత్వం పదో తరగతి పరీక్షలను ఇప్పటికే రద్దు చేసిన సంగతి తెలిసిందే. 2020-21 అకాడమిక్ విద్యార్థులను పై తరగతులకు ప్రమోట్ చేస్తూ నిర్ణయం వెలువరించింది. పరీక్షలు తిరిగి నిర్వహించలేని పరిస్థితులు ఏర్పడటంతో ఇప్పటికే నిర్వహించిన ఇంటర్నల్ అసెస్మెంట్ ఆధారంగా విద్యార్థులకు గ్రేడ్లు కేటాయించనుంది. ఫలితాలపై ఎవరికైనా సంతృప్తి లేకపోతే పరీక్షలకు అవకాశమిస్తామని పేర్కొంది.
అదేవిధంగా ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులను ప్రమోట్ చేయనున్నట్లు స్పష్టం చేసింది. ఇంటర్ ద్వితీయ సంవత్సర పరీక్షలపై జూన్ రెండో వారంలో సమీక్షించి నిర్ణయం తీసుకుంటామంది. బ్యాక్లాగ్ ఉన్న రెండో సంవత్సరం విద్యార్థులకు కనీస పాస్ మార్కులు వేస్తామని ప్రభుత్వం గతంలోనే తెలిపింది.