వ్యవసాయ యూనివర్సిటీ/హైదరాబాద్, మార్చి 26 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ రాజేంద్రనగర్ వద్ద బుద్వేల్లోని వ్యవసాయ విశ్వవిద్యాలయ భూమిలో నూతన హైకోర్టు భవనాల నిర్మాణాలకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ బుధవారం భూమిపూజ చేయనున్నారు. సాయంత్రం 5.30 గంటలకు జరిగే ఈ కార్యక్రమంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, ఇతర న్యాయమూర్తులు పాల్గొననున్నారు.
ఎన్నికల కోడ్ ఉన్నందున ప్రజాప్రతినిధులు హాజరు కావటం లేదని తెలిసింది. అయితే, ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు అనుమతి కోరుతూ సీఎం రేవంత్రెడ్డి ఈసీకి లేఖ రాసినట్టు తెలిసింది. ఈ కార్యక్రమానికి మీడియాను అనుమతించలేదు. వ్యవసాయ వర్సిటీ ఉపకులపతి రఘునందన్రావు, ఉద్యాన వర్సిటీ ఉపకులపతి డాక్టర్ నీరజాప్రభాకర్కు మాత్రమే అనుమతి ఉన్నట్టు తెలిసింది. ఇప్పటికే పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బారికేడ్లు ఏర్పాటు చేసి ఎవరినీ అనుమతించటం లేదు.