ములుగు, డిసెంబర్18(నమస్తేతెలంగాణ): కాకతీయ రాజులు 800 ఏండ్లక్రితం నిర్మించిన రామప్ప దేవాలయం అద్భుత శిల్పకళాఖండమని సుప్రీంకోర్టు ప్రధానన్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. దీనిని యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తించటంతెలంగాణ రాష్ర్టానికి గర్వకారణమని పేర్కొన్నారు. శనివారం ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం పాలంపేటలోని రామప్ప దేవాలయాన్ని జస్టిస్ రమణ సతీసమేతంగా సందర్శించారు. సీజేఐకి రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్,మానుకోట ఎంపీ మాలోతు కవిత, ఎమ్మెల్యే సీతక్క పుష్పగుచ్ఛాలు అందించి స్వాగతం పలికారు. ఆలయంలో రుద్రేశ్వర స్వామికి పండితుల వేదమంత్రాల నడుమ ఎన్వీ రమణ దంపతుల గోత్రనామాలతో ప్రత్యేక పూజలు జరిపించారు. అనంతరం రామప్ప దేవాలయశిల్పకళను గైడ్లు వివరించారు. ఈ సందర్భంగా జస్టిస్ రమణ మాట్లాడుతూ యునెస్కో గుర్తింపుతో కాకతీయుల కళా నైపుణ్యానికి విశ్వవ్యాప్తంగా గుర్తింపు లభించిందని అన్నారు. నీటిలో తేలియాడే ఇటుకలతో గోపురాన్ని నిర్మించటం, శతాబ్దాలు గడిచినా దేవాలయనిర్మాణానికి వాడిన రాళ్లు రంగు వెలిసిపోకుండా కాంతులీనడం ఆలయానికి ప్రత్యేకత తెచ్చిపెట్టాయని తెలిపారు. ఈ ఆలయానికి వారసత్వ హోదా దక్కడం సముచితం, సమున్నతం, సంతోషభరితమని పేర్కొన్నారు. సీజేఐ వెంట హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్సతీశ్చంద్రశర్మ, హైకోర్టు న్యాయవాదులు ఉజ్జల్బూయన్, రాజశేఖర్రెడ్డి, పీ నవీన్రావు, వరంగల్ జిల్లా 9వ అదనపు జిల్లా జడ్జి అనిల్కుమార్, న్యాయ సేవా అధికార సంస్థ చైర్మన్ మహేశ్నాథ్, ములుగు జూనియర్ సివిల్ కోర్టు జడ్జి రామచంద్రారావు, జిల్లా కలెక్టర్ కృష్ణఆదిత్య తదితరులున్నారు.