హైదరాబాద్ : చారిత్రక వరంగల్ నగరంపై తనకున్న అభిమానాన్ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ చాటుకున్నారు. హనుమకొండలో 10 కోర్టుల భవన సముదాయాన్ని ప్రారంభించిన సందర్భంగా వరంగల్ నగరానికి ఉన్న చారిత్రక, సాంస్కృతిక వారసత్వాన్ని తెలుపడంతో పాటు ఈ నగరంతో తనకున్న అవినాభావ సంబంధాన్ని వెల్లడించారు. కాళోజీ స్ఫూర్తితో తెలుగులో మాట్లాడేందుకు సాహసం చేస్తున్నానని చెప్పి ఉపన్యాసం ప్రారంభించారు. ప్రసంగం ముగిసే వరకు తెలుగులోనే మాట్లాడి మాతృభాషపై తనుకున్న మక్కువను ప్రదర్శించారు.
ఎన్వీ రమణ ప్రసంగం.. ‘తెలుగు వాడివై తెలుగు రాదనుచు సిగ్గు లేక ఇంకా చెప్పుటెందుకురా.. అన్య భాషలు నేర్చి ఆంధ్రమ్ము రాదంటు సకిలించు ఆంధ్రుడా చావవెందుకురా.. అని అన్న కాళోజీ స్ఫూర్తితో ఈరోజు తెలుగులో మాట్లాడేందుకు సాహసిస్తున్నాను. వరంగల్ పట్టణానికి నాకు ఎంతో అవినాభావ సంబంధం ఉంది. వరంగల్లో దాదాపు 3 సాహిత్య కార్యక్రమాలకు హాజరయ్యాను. ఇక్కడ నాకు బంధువులు, మిత్రులు ఉన్నారు. వరంగల్ ఆత్మీయమైన నగరం. వరంగల్ ఒక చారిత్రాత్మక నగరం. రాజకీయ, సాంస్కృతిక, ఆర్థిక రంగాల్లో రాష్ట్రంలోనే వరంగల్ ప్రముఖ స్థానంలో ఉంది. ప్రగతిశీల ఉద్యమాలకు నెలవు.
అంతర్జాతీయ కమ్యూనిస్టు, జాతీయ కాంగ్రెస్ ఉద్యమాల నుంచి మితవాద, మతవాద అనేక రాజకీయాలకు పుట్టినిల్లు. అనేక రాజకీయ ఉద్యమాలకు పోరాటాల గడ్డ. కళలు, సాహిత్యానికి, సంస్కృతికి ఈ ప్రాంతం నెలవు. అనేక మంది కవులు, స్వాతంత్ర్య పోరాటయోధులు, విప్లవకారులు తిరిగిన నేల ఇది.
బమ్మెర పోతన, పాల్కురికి సోమనాథుడు, దాశరథి రంగాచార్య, కాళోజీ నారాయణరావు లాంటి సరస్వతి పుత్రులకు జన్మనిచ్చిన నేల ఇది. దేశానికి ఒక ప్రధానమంత్రిని ప్రసాదించిన ప్రాంతమిది. నిరంకుశ, నియంతృత్వ, పెత్తందారీ విధానాలకు వ్యతిరేకంగా సాగిన అనేక పోరాటాలకు పుట్టినిల్లు ఇది.
ఓ నిజాము పిశాచమా, కానరాడు నిన్ను బోలిన రాజు మాకెన్నడేని తీగలను తెంపి అగ్నిలో దింపినావు.. నా తెలంగాణ కోటి రతనాల వీణ.. అన్న దాశరథి గర్జన పరపీడన నుంచి విముక్తి కోసం సాగిన ఎన్నో పోరాటాలకు ఊపిరినిచ్చింది. పోరుగల్లుకు వందనం.. ఓరుగల్లుకు వందనం.. వరంగల్కు వందనం..’ అని పేర్కొన్నారు.
మాతృభాషను మరిచి పోవద్దు అని ఎన్వీ రమణ విజ్ఞప్తి చేశారు. మీ పిల్లలతో తెలుగులోనే మాట్లాడండి.. మాతృభాషను గౌరవించాలి అని పేర్కొన్నారు. కాళోజీ స్ఫూర్తితో తెలుగు మాట్లాడుతున్నాను అని ఎన్వీ రమణ స్పష్టం చేశారు. వరంగల్ పర్యటనలో భాగంగా రామప్ప దివ్యక్షేత్రాన్ని సందర్శించాం. మన చారిత్రాత్మక సంపదను గుర్తించి యునెస్కో అవార్డునివ్వడం గర్వించాల్సిన విషయం. వేయి స్తంభాల గుడిని చూసేందుకు రెండు కళ్లు చాలవు. భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్నాం అని ఎన్వీ రమణ తెలిపారు.