హైదరాబాద్, ఆగస్టు 4 (నమస్తే తెలంగాణ): కృష్ణా జలాల వివాదంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను తాను విచారించబోనని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ స్పష్టంచేశారు. జల వివాదంపై సీజేఐ సూచించిన మధ్యవర్తిత్వ పరిష్కారానికి ఏపీ అంగీకరించకపోవటంతో పిటిషన్ను మరో బెంచ్కు బదిలీ చేశారు. పలు ప్రాజెక్టుల్లో జలవిద్యుత్తు ఉత్పత్తిపై తెలంగాణ ప్రభుత్వం జారీచేసిన జీవో 34ను వ్యతిరేకిస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. ఆ పిటిషన్పై గత సోమవారం చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా వివాదాన్ని మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోవాలని, అందుకు తాను సహకారం అందిస్తానని సీజేఐ సూచించారు. బుధవారం పిటిషన్ను మరోసారి విచారించిన ధర్మాసనం, మధ్యవర్తిత్వంపై రెండు రాష్ర్టాల అభిప్రాయం కోరింది. ఈ ప్రతిపాదనను ఏపీ సర్కారు వ్యతిరేకించింది. తమకు మధ్యవర్తిత్వం అవసరం లేదని, కోర్టు తీర్పు ద్వారానే సమస్యను పరిష్కరించుకోవాలని కోరుకుంటున్నామని ఏపీ తరఫు న్యాయవాదులు తెలిపారు. దాంతో మధ్యవర్తిత్వానికి ఎవరినీ బలవంతం చేయలేమని, అదేవిధంగా ఈ పిటిషన్ను సీజేఐ ధర్మాసనం విచారించబోదని జస్టిస్ రమణ స్పష్టం చేశారు. పిటిషన్ను సీజేఐ ధర్మాసనమే విచారించాలని కేంద్ర ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా విజ్ఞప్తి చేసినా అందుకు సీజేఐ అంగీకరించలేదు. తాను రెండు రాష్ర్టాలకు చెందినవాడినని, కచ్చితంగా విచారించాల్సి వస్తే, విచారణ నుంచి తాను తప్పుకొంటానని గత సోమవారమే సీజేఐ ప్రకటించారు.