హైదరాబాద్, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ)/ఉస్మానియా యూనివర్సిటీ: విద్యార్థులంతా ఉత్తరాలు రాయాలని, పుస్తకాలు చదవాలని సుప్రీంకోర్టు ప్రధా న న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ఉద్బోధించారు. ఉత్తరాలు రాస్తే మీలో ఉన్న కవులు బయటకు వస్తారని సూచించారు. ఏ హోదాలో ఉన్నా.. ఎంత ఉన్నతస్థానంలో స్థిరపడ్డా.. మాతృమూర్తి, మాతృభూమి, మాతృభాషలను మరువొద్దని చెప్పారు. శుక్రవారం ఉస్మానియా వర్సిటీలోని ఠాగూర్ ఆడిటోరియంలో నిర్వహించిన ఓయూ 82వ స్నాతకోత్సవానికి జస్టిస్ ఎన్వీ రమణ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. తొలుత జస్టిస్ ఎన్వీ రమణకు గవర్నర్, ఓయూ చాన్స్లర్ తమిళిసై గౌరవ డాక్టరేట్ను ప్రదానంచేశారు. ఈ సం దర్భంగా జస్టిస్ ఎన్వీ రమణ మాట్లాడుతూ.. ఉస్మానియా వర్సిటీ దక్షిణ భారతదేశంలోని మూడో పురాతన విశ్వవిద్యాలయమని, హైదరాబాద్ రాష్ట్రంలో మొదటిదని గుర్తుచేశారు. బ్రిటిష్ వలసపాలన, ఆంగ్లభాష ఆధిపత్యం కొనసాగుతున్న కాలంలో ప్రాంతీయ భాషల్లో బోధనను ఓయూ ప్రారంభించి ఉన్నత విద్యలో కొత్త యుగానికి నాంది పలికిందని గుర్తుచేశారు. బ్రిటిష్పాలన నుంచి స్వతంత్ర భారత్గా అవతరించే వరకు వెలుగు రేఖలు పంచిందన్నారు.
ఓయూ దార్శనికులను తయారుచేసింది
ఉస్మానియా యూనివర్సిటీ ఎంతో మంది దార్శనికులను తయారుచేసిందని, సాధారణ వ్యక్తిని అసాధారణ వ్యక్తిగా తీర్చిదిద్దడం ఓయూ ప్రత్యేకతని జస్టిస్ ఎన్వీ రమణ అభివర్ణించారు. రాజనీతిజ్ఞుడు మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు, తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఓయూ ప్రొడక్ట్లేనని, వీరేకాకుండా ఎందరో సీఎంలను, మంత్రులను, రాజకీయ ప్రముఖులను ఓయూ తయారుచేసిందని చెప్పారు. ఆధునిక భారతదేశాన్ని నిర్మించడంలో ఓయూ పాత్ర గణనీయమైందన్నారు. రవీంద్రనాథ్ ఠాగూర్, రాజగోపాలాచారి, నెహ్రూ, డాక్టర్ ఎస్ రాధాకృష్ణన్, అంబేద్కర్ వంటి 42 మంది గొప్పవాళ్లు ఓయూ నుంచి గౌరవ డాక్టరేట్లను స్వీకరించారని, వారి సరసన తాను సరిపోతానా? అన్న భయం వెంటాడుతున్నదని అన్నారు. ఓయూ కాలేజీలో చేరాలనుకున్నా అవకాశం దక్కలేదని గత సృ్మతులను నెమరేసుకున్నారు. కానీ ఓయూతో తనకు ప్రత్యేక అనుబంధం ఉన్నదని, ప్రత్యేకించి ‘ఇ’ హాస్టల్లో బసచేసేవాడినని, అప్పుడప్పుడు లా, లింగ్విస్టిక్ తరగతులకు హాజరయ్యాయని, క్యాంటీన్, లైబ్రరీల్లో గడిపానని గుర్తుచేసుకొన్నారు. ఇలాంటి వర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ పొందడం తన వ్యక్తిగత బాధ్యతను మరింత పెంచిందని పేర్కొన్నారు.
సీజేఐ నోట.. కాళోజీ, దారశథి కవితలు
ఈ సందర్భంగా కాళోజీ, దాశరథి కవితలు చదివిన జస్టిస్ ఎన్వీ రమణ మాతృభాషపై గల మమకారాన్ని చాటుకొన్నారు. తెలుగు సాహిత్యాన్ని బాగా చదవాలని, అద్భుతమైన సాహిత్యం మన సొంతమని పేర్కొన్నారు. విద్యార్థులు ఏ సమాజం నుంచి వచ్చారో ఆ సమాజ మూలాన్ని విస్మరించరాదన్నారు. ఈ సందర్భంగా ‘తెలుగు బిడ్డవై ఉండి తెలుగు రాదనుచు సిగ్గులేకుండా చెప్పుడెందుకురా.. అన్యభాషలు నేర్చి ఆంధ్రంబురాదనుచు సకలించు ఆంధ్రుడా చావవెందుకురా.. అంటూ కాళోజీ మాటలను ఉదహరించారు. దాశరథి కవితలు రెండింటిని సైతం ఉదహరించారు. ‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అంటూ ముగించారు. గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్ మాట్లాడుతూ.. విజయానికి దగ్గరి దారులుండవని, కష్టపడి సమస్యలను ఎదుర్కోవాలని, సమయ పాలన పాటించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు సీజే ఉజ్జల్ భూయాన్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్, ఓయూ వీసీ ప్రొఫెసర్ రవీందర్, ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. అనంతరం 44 గోల్డ్ మెడల్స్, 211 పీహెచ్డీ పట్టాలను విద్యార్థులకు ప్రదానం చేశారు.
రాజ్యాంగమే రక్షణ కవచం
విద్యార్థులు ప్రాథమిక చట్టాలు, సూత్రాల గురించి తప్పనిసరిగా తెలుసుకోవాలని జస్టిస్ ఎన్వీ రమణ సూచించారు. పౌరులు రాజ్యాంగంతో అనుసంధానించబడాలని, రాజ్యాంగమే మనకు అంతిమ రక్షణ కవచమని చెప్పారు. ప్రపంచీకరణ కారణంగా మన సంస్కృతులు, సంప్రదాయాలు దెబ్బతింటున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. 2021 యునెస్కో నివేదిక ప్రకారం ఈ శతాబ్దం చివరి వరకు నేడు ప్రపంచంలో మాట్లాడే 7 వేల భాషల్లో సగం కనుమరుగయ్యే ప్రమాదం పొంచి ఉన్నదని అన్నారు. దీంతో భాష, సాహిత్యాన్ని కోల్పోవడంతోపాటు జానపద కథలు, వారసత్వ వైజ్ఞానాన్ని కోల్పోతామని ఆందోళన వ్యక్తంచేశారు.